ఆదిలాబాద్టౌన్: వ్యాధుల సీజన్ మొదలైంది. ఇటీవల కురిసిన వర్షాలకు పారిశుద్ధ్య నిర్వహణ లోపించింది. జనం జ్వరం, దగ్గు, ఒంటినొప్పులు, జలు బు తదితర సమస్యలతో బాధపడుతున్నారు. మ రోవైపు జిల్లాలోని ఆయా పీహెచ్సీల్లో వైద్యుల కొ రత తీవ్రంగా ఉంది. 18 మంది వైద్యులు పీజీ కో సం వెళ్లారు. తొమ్మిది పీహెచ్సీల్లో కనీసం ఒక్కరు కూడా రెగ్యులర్ వైద్యులు లేకపోవడం గమనార్హం. శాఖ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టినా పూర్తిస్థాయిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందడం లేదు. ఆర్బీఎస్కే, జన్మన్ మొబైల్ వాహనాల ద్వారా వైద్యసేవలు అందించే డాక్టర్లతో నెట్టుకొస్తున్నారు. వారిని ఇక్కడ సర్దుబాటు చేయడంతో ఏజెన్సీ మండలాల్లోని గిరిజనుల వైద్యసేవలకు బ్రేక్ పడింది. ఆర్బీఎస్కే ద్వారా పాఠశాలలకు వెళ్లి వైద్యసేవలు అందించాల్సి ఉండగా, సర్దుబాటులో ఆ ప్రక్రియ కొంత నిలిచిపోయింది.
వెక్కిరిస్తున్న ఖాళీలు..
జిల్లాలో 22 పీహెచ్సీలు, ఐదు పట్టణ ఆరోగ్య కేంద్రాలు, రెండు ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. మొత్తం 50 వైద్య పోస్టులకు గానూ 26 ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఏజెన్సీ ప్రాంతంలోని పీహెచ్సీల్లోనే ఖాళీలు ఎక్కువగా ఉండడంతో గిరిజనులకు మెరుగైన సేవలు అందకుండా పోయాయి. నార్నూర్, గాదిగూడ, ఝరి, సైద్పూర్, తాంసి, భీంపూర్, బజార్హత్నూర్, గుడిహత్నూర్, పిట్టబొంగరంలో ఒక్క రెగ్యులర్ వైద్యుడు లేడు. ఆదిలాబాద్ పట్టణంలో ఐదు యూహెచ్సీలు ఉండగా, పుత్లీబౌళి, హమాలీవాడలోనూ ఇదే పరిస్థితి. దీంతోపాటు ల్యాబ్టెక్నీషియన్, ఫార్మసిస్ట్, డాటాఎంట్రీ ఆపరేటర్, ఏఎన్ఎం, స్టాఫ్ నర్సుల పోస్టులు సైతం ఖాళీలతో వెక్కిరిస్తున్నాయి. గుడిహత్నూర్, సైద్పూర్, పుత్లీబౌళి పీహెచ్సీలతో పాటు పలు ఆస్పత్రుల్లో ఫార్మసిస్టులు లేరు. దీంతో ఏఎన్ఎంలు, అక్కడ పనిచేసే వైద్య సిబ్బందే మందులు పంపిణీ చేస్తున్నారు.
రోగులకు అవస్థలే..
వైద్యుల పోస్టులు ఖాళీగా ఉండడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఒక్కో పీహెచ్సీలో ఇద్దరు, ముగ్గురు వైద్యులు ఉండాల్సి ఉండగా ఒక్కరితోనే నెట్టుకొస్తున్నారు. దీంతో సదరు వైద్యుడు అందుబాటులో లేని సమయంలో ప్రజలు అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. అత్యవసర సమయంలో జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి వెళ్లాల్సిన పరిస్థితి. కొన్ని సందర్భాల్లో సమయానికి చికిత్స అందకపోవడంతో మృత్యువాత పడిన ఘటనలు సైతం లేకపోలేదు. ఉన్న వైద్యుల్లో సగం మంది సమయపాలన పాటించకపోవడం, సా యంత్రం వరకు అందుబాటులో ఉండకపోవడంతో మెరుగైన వైద్య సేవలు అందకుండా పోతున్నాయని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.
చర్యలు చేపడతాం..
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపడతాం. జిల్లాలో 26 వైద్య పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల 18 మంది వైద్యులు పీజీ చదువు కోసం వెళ్లారు. దీంతో కొంత ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఎనిమిది మంది జన్మన్ వైద్యులు, ఇద్దరు ఆర్బీఎస్కే వైద్యుల ద్వారా సేవలు అందిస్తున్నాం. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.
– డాక్టర్ సాధన, డీఎంహెచ్వో


