breaking news
Telangana panchayat elections 2025
-
ఒక్క ఓటు తేడాతో విజయం.. పోలింగ్ కేంద్రం వద్ద పోలీసుల లాఠీచార్జ్
సాక్షి, వనపర్తి: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల వేళ ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ఘనపూర్ మండలంలో ఒక్క ఓటుతో కాంగ్రెస్ అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థిపై విజయం సాధించారు. దీంతో, అక్కడ రీకౌంటింగ్ చేయాలని బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగారు. దీంతో, ఘర్షణలు నెలకొంది.వివరాల ప్రకారం.. ఘనపూర్ మండలంలోని సోలిపూర్ గ్రామంలో నిన్న పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో స్థానిక మహిళ, కాంగ్రెస్ అభ్యర్థి సింధు.. బీఆర్ఎస్ అభ్యర్థిపై ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ అభ్యర్థి, శ్రేణులు.. రీకౌంటింగ్ చేయాలని ధర్నాకు దిగారు. అనంతరం, రీకౌంటింగ్ చేసినా కూడా ఓడిపోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు ససేమిరా అంటూ నిరసనలు చేపట్టారు. దీంతో, బీఆర్ఎస్ శ్రేణులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.అనంతరం, పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో, పలువురు గాయపడ్డారు. మరోవైపు.. బీఆర్ఎస్ శ్రేణులు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో పరిస్థిని మరింత ఆందోళనకరంగా మారింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. అక్కడ భారీగా మోహరించారు. గ్రామంలో 144 సెక్షన్ విధించారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్ గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. -
తొలి విడుత పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి గట్టి షాక్!
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో తొలివిడుత పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి ఓటర్లు గట్టిషాకిచ్చారు. సర్పంచ్ స్థానాల్లో ఇతరుల కంటే తక్కువ స్థానాల్ని బీజేపీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. ఇక ఈ ఎన్నికల్లో హుజూరాబాద్లో ఎంపీ ఈటల రాజేందర్ బిగ్షాక్ తగిలింది. ఈటల బలపరిచిన బీజేపీ రెబల్ అభ్యర్థి పంచాయతీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అదే సమయంలో బండి సంజయ్ వర్గానికి చెందిన సర్పంచ్ అభ్యర్థి ర్యాకం శ్రీనివాస్ గెలుపుపొందారు. ఈటల రాజేందర్ మద్దతు తెలిపిన ర్యాకం సంపత్ ఓటమి పాలయ్యారు.ప్రస్తుతం ఈ ఘటన పంచాయతీ ఎన్నికల్లో హాట్టాపిగ్గా మారగా.. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ నేపథ్యంలో కరీంనగర్ బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ బంపరాఫర్ ప్రకటించారు. తమ పార్టీ బలపరిచే అభ్యర్థులను ఏకగ్రీవం చేస్తే.. రూ.10 లక్షల ప్రోత్సాహక నిధులిస్తానంటూ ప్రకటించారాయన.మాట ఇస్తే... తప్పే ప్రసక్తే లేదు. ఏకగ్రీవ పంచాయతీలకు రూ.5 లక్షల ఇన్సెంటివ్ ఇస్తానని బీఆర్ఎస్ మాట తప్పింది. కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద నయాపైసా నిధుల్లేవు. నిధులు తెచ్చేది, ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే. ఎన్నికలు జరిగేది కూడా కేంద్ర నిధుల కోసమే. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పొరపాటు చేస్తే 5 ఏళ్ల నరక యాతన తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలే చేశారు. ఎన్నికల ముందే బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు బీజేపీ బలపరిచిన అభ్యర్థుల గెలుపుకు దోహదపడిందనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.తెలంగాణలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలను బట్టి కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు.కాగా, ఇవాళ జరిగిన పోలింగ్లో 3,834 సర్పంచి పదవులకు 12,960 మంది అభ్యర్థులు, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు 65,455 మంది పోటీ పడ్డారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. ఏకగ్రీవంతో కలుపుకొని 1484 పైగా కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచ్లుగా విజయం సాధించారు. బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు 723 మంది, బీజేపీ 132 మంది, ఇతరులు 339 మంది గెలుపొందారు. -
ఎన్నికల టెన్షన్.. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల తన్నులాట
సాక్షి, నల్గొండ: తెలంగాణలో తొలి విడత గ్రామ పంచాయతీల ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. మరోవైపు.. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నల్గొండ జిల్లాలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య దాడి జరిగింది. దీంతో, టెన్షన్ వాతావరణం నెలకొంది.వివరాల ప్రకారం.. నల్లగొండలోని కేతేపల్లి మండలంలో బుధవారం అర్ధరాత్రి కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కొర్లపహాడ్లో రాళ్లు, కత్తులతో ఇరు వర్గాల కార్యకర్తలు దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో నలుగురికి గాయపడటంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. దీంతో, కొర్లపహాడ్ గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు.ఇదిలా ఉండగా.. రాష్ట్రవ్యాప్తంగా 3,834 పంచాయతీలు, 27,628 వార్డులకు పోలింగ్, ఓట్ల లెక్కింపు నేడు జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించి, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లు లెక్కించనున్నారు. ఉప సర్పంచ్ ఎన్నిక కూడా నేడే నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. -
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ ఢంకా
తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అప్డేట్స్...


