-
మిలాన్ విన్యాసాలు ప్రారంభం
సాక్షి, విశాఖపట్నం: యుద్ధ నౌకల సమాహారం.. ప్రపంచ నౌకాదళాల సమన్వయం ‘మిలాన్–2024’ విశాఖ వేదికగా సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. ప్రతిష్టాత్మక నౌకాదళ యుద్ధ విన్యాసాల ప్రదర్శన ‘మిలాన్–2024’లో 58 దేశాలు పాల్గొంటున్నాయి. ఇప్పటికే చాలా దేశాలకు చెందిన నౌకాదళాలు, కోస్ట్గార్డ్ బృందాలు, యుద్ధనౌకలు, విమానాలు, హెలికాఫ్టర్లు, సబ్మెరైన్లు విశాఖకు చేరుకున్నాయి. ఈ నెల 27వ తేదీ వరకు జరిగే మిలాన్–2024లో భాగంగా తొలి రోజు మధ్యాహ్నం మారీటైమ్ వార్ఫేర్ సెంటర్లో వివిధ దేశాల మధ్య ప్రీ సెయిల్ డిస్కషన్స్ జరిగాయి. హార్బర్ ఫేజ్ విన్యాసాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అదేరోజు రాత్రికి ఐస్ బ్రేకర్ డిన్నర్ ఏర్పాటు చేసి అన్ని దేశాల అధికారులు, సిబ్బందికి భారత నౌకాదళం ఆతిథ్య విందు ఇవ్వనుంది. కాగా, 22వ తేదీన జరిగే ప్రతిష్టాత్మక సిటీ పరేడ్కు సంబంధించిన రిహార్సల్స్ సోమవారం సాయంత్రం ఆర్కే బీచ్లో అద్భుతంగా జరిగాయి. మంగళవారం సాయంత్రం జరిగే తుది రిహార్సల్స్కు నౌకాదళ అధికారులు, జిల్లా అధికారులు హాజరుకానున్నారు. ఇప్పటి వరకూ విశాఖ చేరుకున్న యుద్ధ నౌకల వివరాలు సీ షెల్ నుంచి కోస్ట్గార్డ్కు చెందిన పీఎస్ జొరాస్టర్ డిస్ట్రాయర్, శ్రీలంక నుంచి ఎస్ఎల్ఎన్ఎస్ సయురాలా యుద్ధనౌక, మయన్మార్ నుంచి యూఎంఎస్ కింగ్సిన్పీసిన్ యుద్ధ నౌక, ఇండొనేషియా నుంచి కేఆర్ఐ సుల్తాన్ ఇస్కందర్ ముదా యుద్ధ నౌక, రాయల్ ఆస్ట్రేలియా నేవీ నుంచి హెచ్ఎంఏఎస్ వార్మూంగా వెసల్, జపాన్ మేరీటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ నుంచి జేఎస్ సజనామీ యుద్ధ నౌక వచ్చాయి. వీటితోపాటు రాయల్ థాయ్ నేవీ నుంచి హెచ్టీఎంఎస్ ప్రచువాప్ ఖిర్కీఖాన్ వార్ఫేర్, వియత్నాం పీపుల్స్ నేవీ నుంచి కార్వెట్టీ 20 డిస్ట్రాయర్, యూఎస్ నేవీ నుంచి యూఎస్ఎస్ హాల్సే యుద్ధ నౌక, బంగ్లాదేశ్కు చెందిన బీఎన్ఎస్ ధలేశ్వరి యుద్ధ నౌక, రాయల్ మలేషియా నుంచి కేడీ లేకిర్ యుద్ధ నౌక, రష్యన్ నేవీ నుంచి మార్షల్ షాపోష్నికోవ్ వార్ షిప్, వర్యాగ్ గైడెడ్ మిసైల్ షిప్ కూడా విశాఖ చేరుకున్నాయి. -
ఇవన్నీ చూస్తుంటే నా రక్తం మరిగిపోతోంది: కింగ్ ఆఫ్ కోత హీరోయిన్
రితికా సింగ్.. ముందు క్రీడాకారిణిగానే తెలుసు. ఆ తర్వాతే ఆమె నటిగా పరిచయమైంది. సుధా కొంగర తన దర్శకత్వంలోని ఇరుది సుట్రులో ఆమెకు అవకాశమిచ్చారు. ఈ చిత్రాన్నే తెలుగులో గురు, హిందీలో సాలా ఖడూస్గా రీమేక్ చేశారు. దీంతో ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రాఘవ లారెన్స్ శివలింగ, నీవెవరో, ఓ మై కడవులే, ఇన్కార్ సినిమాల్లో నటించింది. స్టోరీ ఆఫ్ థింగ్స్ వెబ్ సిరీస్తో వెబ్ సిరీస్లో నటించింది. మళ్లీ చాలారోజుల తర్వాత దుల్కర్ సల్మాన్ జతగా కింగ్ ఆఫ్ కొత్త అంటూ వెండితెరపై సందడి చేసింది. (ఇది చదవండి: సోషల్ మీడియా ట్రోల్స్ చాలా ఇబ్బంది పెట్టాయి: రితికా) మహారాష్ట్రలో పుట్టి పెరిగిన రితికా.. చిన్న వయసు నుంచే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ తీసుకుంది. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉండే రితికా సింగ్.. మహిళలపై జరిగే దారుణాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. మహిళల కచ్చితంగా సెల్ఫ్ డిఫెన్స్ రావాలని చాలాసార్లు ప్రస్తావించింది. అదే తరహాలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రతి రెండు గంటలకు దేశంలో ఏదో ఓ మూలన మహిళలు, అమ్మాయిలు, చిన్నపిల్లలపై లైంగిక వేధింపులు జరుగుతన్నాయని ఆరోపించింది. వార్తల్లో ఇలాంటి ఘటనలు చూసిన ప్రతిసారి నా రక్తం మరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ దారుణాలు ఇంకెప్పుడు ఆగుతాయంటూ ఇన్స్టా వేదికగా ప్రశ్నించింది. ఇలాంటి మహిళలపై ఈ అఘాయిత్యాలు ఆగాలంటే మహిళలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న దారుణాలు చూస్తుంటే ప్రతి బిడ్డకు సెల్ఫ్ డిఫెన్స్తో పాటు మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. (ఇది చదవండి: సైలెంట్గా ఓటీటీకి వచ్చేసిన ధోని 'ఎల్జీఎమ్'... తెలుగు సినిమాలు ఎన్నో తెలుసా?) ఇలాంటి దారుణాలు తట్టుకుని ఈ సమాజంలో నిలడాలంటే మన పిల్లలకు జరుగుతున్న ఘటనలపై చర్చించాలని రితికా సింగ్ రాసుకొచ్చారు. ఇలాంటి చిన్నపిల్లలతో చర్చించడం కష్టమైనప్పటికీ.. వారి భవిష్యత్తు కోసం మన మారాల్సిందేనని సూచించారు. మన భవిష్యత్ తరాల పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. మహిళలంతా ఇలాంటి దారుణాలపై పోరాడేందుకు సిద్ధంగా ఉండాలని హితవు పలికారు. అయితే ఇటీవల మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో 12 ఏళ్ల బాలికపై దారుణ ఘటనను ఉద్దేశించి ఈ పోస్ట్ చేసినట్లు అర్థమవుతోంది. View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) -
లైంగిక వేధింపులు ధైర్యంగా ఎదుర్కోవాలి
బంజారాహిల్స్ (హైదరాబాద్)/సాక్షి, కామారెడ్డి: క్రీడారంగంలోనైనా, ఎక్కడైనా లైంగిక వేధింపులకు గురవుతున్నట్టైతే ఆడపిల్లలు వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని కామారెడ్డి జిల్లాకు చెందిన మార్షల్ ఆర్ట్స్ జాతీయ స్థాయి క్రీడాకారిణి సూచించారు. అదే సమయంలో క్రీడారంగంలోకి ఎంతో ఇష్టంగా వస్తున్న ఆడపిల్లలను వేధిస్తూ వారి మనోధైర్యాన్ని దెబ్బతీసే వారిపై ప్రభుత్వం, అధికారులు కఠిన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని ఆమె అన్నారు. తెలంగాణ జిల్లాల నుంచి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్న క్రీడాకారులకు సరైన ప్రోత్సాహం లభించకపోగా, కొందరు అమ్మాయిలను వేధింపులకు గురిచేస్తున్న ఘటనలు బాధిస్తున్నాయని చెప్పారు. ఆడపిల్లలు ఎందులోనూ త క్కువ కాదని, వారిని ప్రోత్సహించాల్సిందిపోయి వేధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇటీవల హకీంపేటలోని స్పోర్ట్స్ స్కూల్లో బాలికలపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. క్రీడాకారిణులు, ఆడపిల్లలు ఆత్మవిశ్వాసం, ధైర్యంతో వ్యవహరించినట్టైతే వేధింపులకు పాల్పడే వారికి తగిన బుద్ధి చెప్పవచ్చని చెప్పారు. తనకు కూడా ఇలాంటి అనుభవం ఎదురైందని, అయితే తాను గట్టిగా హెచ్చరించి వేధింపుల నుంచి బయటపడ్డానని తెలిపారు. రాష్ట్ర క్రీడా మంత్రి పేషీలో పని చేసే ఓ వ్యక్తి తనను లైంగిక వేధింపులకు గురి చేశాడని చెప్పారు. వివరాలు ఆమె మాటల్లోనే.. నువ్వు క్యూట్గా ఉన్నావు..ఎప్పుడు కలుద్దాం అన్నాడు ‘బంజారాహిల్స్లోని మినిస్టర్ క్వార్టర్స్లో నివసించే క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేషీలో డేటాఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తున్న సురేందర్ తాను మంత్రి పీఏనని నాకు చెప్పాడు. నాకు 2022 నవంబర్లో తైక్వాండ్లో సిల్వర్, చెస్ బాక్సింగ్లో బంగారు పతకం లభించాయి. ఈ విషయాన్ని మంత్రికి చెప్పాల్సిందిగా సురేందర్కు మెసేజ్ చేశా. గత ఏడాది జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ఆర్థిక సాయానికి సంబంధించిన సిఫార్సు లేఖ ఇవ్వడానికి మరోసారి మంత్రి క్వార్టర్స్కు వెళ్లా. ఇంగ్లాండ్లో జరిగిన పోటీలో పతకం లభించినప్పుడు కూడా మెసేజ్ చేశా. ఆయా సందర్భాల్లో సురేందర్ ‘నువ్వు చాలా అందంగా (క్యూట్గా) ఉంటావు. మనం ఎక్కడ కలుసుకుందామంటూ ప్రపోజల్ పెట్టాడు. అసలు విషయం పక్కన పెట్టి క్యూట్గా ఉన్నావు.. నన్ను కలుస్తావా..? నీ వయస్సెంత? అంటూ మెసేజ్లు పంపాడు. రకరకాలుగా వేధింపులకు గురి చేయడంతో ఇక లాభం లేదనుకుని గట్టిగా వార్నింగ్ ఇచ్చా. తాను మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారిణిని అని, నాతో పెట్టుకుంటే బాగుండదని, బాడీలో ఏ ఒక్క పార్ట్ పనిచేయకుండా కొడతానని తీవ్రస్థాయిలో హెచ్చరించా. దీంతో సురేందర్ దారికొచ్చి క్షమాపణ చెప్పాడు. అప్పట్నుంచీ నాతో మర్యాదగానే ప్రవర్తించాడు..’ అని ఆమె తెలిపారు. వాస్తవం ఇలా ఉంటే ఓ చానెల్లో మాత్రం (సాక్షి కాదు) తన అనుమతి లేకుండా ఇష్టం వచ్చినట్లు కథనం ప్రసారం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. -
‘మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్’కు ప్రిపేర్ అవుతున్న స్టార్స్!
విలన్ ముఖం మీద హీరో పంచ్ ఇవ్వాలా? కాలితో ఒక్క కిక్ కొట్టాలా? గాల్లో ఎగిరి పల్టీలు కొట్టి మరీ విలన్ని కొట్టాలా? ఇవన్నీ చేయాలంటే కాస్త ట్రైనింగ్ కావాలి. రెగ్యులర్ ఫైట్స్కి అయితే అక్కర్లేదు. బీభత్సమైన ఫైట్స్కి అయితే శిక్షణ తీసుకోవాల్సిందే. అది హీరో అయినా హీరోయిన్ అయినా. ఈ మధ్య రిస్కీ రోల్స్ ఒప్పుకున్న కొందరు స్టార్స్ ‘మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్’ నేర్చుకోవడానికి ప్రిపేర్ అయ్యారు. కిక్ బాక్సింగ్, కరాటే, కుంగ్ ఫూ, జూడో, కలరి పయట్టు వంటివన్నీ మార్షల్ ఆర్ట్స్ కిందే వస్తాయి. ఫైట్కి సూట్ అయ్యే ఆర్ట్ నేర్చుకుని బరిలోకి దిగనున్న స్టార్స్ గురించి తెలుసుకుందాం. మూడు నెలలు బ్యాంకాక్లో... హీరో మహేశ్బాబు– డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో జరిగే ఈ కథలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయట. పోరాట సన్నివేశాలు సహజంగా ఉండేందుకు కెరీర్లో తొలిసారి ఈ సినిమా కోసం మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోనున్నారట మహేశ్బాబు. ఇందుకోసం మూడు నెలల పాటు బ్యాంకాక్ వెళతారని టాక్. అక్కడ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్, హైకింగ్, ట్రెక్కింగ్ వంటివి నేర్చుకోనున్నారట. ఈ శిక్షణ ఇవ్వనున్న బ్యాంకాక్ స్టంట్ టీమ్కి ఓ హాలీవుడ్ ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ నేతృత్వం వహిస్తారని తెలిసింది. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ‘గుంటూరు కారం’లో నటిస్తున్నారు మహేశ్బాబు. ఈ చిత్రం పూర్తయ్యాక బ్యాంకాక్లో శిక్షణ తీసుకుని, రాజమౌళి సినిమా షూట్లో జాయిన్ అవుతారట. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు రాజమౌళి. ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్న సంగతి తెలిసిందే. థాయ్ల్యాండ్లో... తొలి చిత్రం ‘ఉప్పెన’తో (2021) బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు వైష్ణవ్ తేజ్. ఆ తర్వాత ‘కొండపొలం, రంగరంగ వైభవంగా’ వంటి చిత్రాల్లో నటించారు. ఈ మూడు చిత్రాల్లో సాఫ్ట్ క్యారెక్టర్తో ప్రేక్షకులను అలరించిన ఆయన తొలిసారి ‘ఆదికేశవ’ చిత్రంలో ఫుల్ యాక్షన్ రోల్ చేశారు. శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాల కోసం థాయ్ల్యాండ్లో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ తీసుకున్నారు వైష్ణవ్ తేజ్. ఈ చిత్రంలో వైష్ణవ్కు జోడీగా శ్రీలీల నటించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 18న రిలీజ్ కానుంది. కలరి మార్షల్ ఆర్ట్లో... మలయాళ హీరో టొవినో థామస్ కలరి అనే మార్షల్ ఆర్ట్లో శిక్షణ పొందారు. టొవినో థామస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అజయంతే రందం మోషణం’. జితిన్ లాల్ దర్శకత్వం వహిస్తున్నారు. కథ పరంగా కేరళలోని కలరి అనే మార్షల్ ఆర్ట్కు ఈ చిత్రంలో ప్రాధాన్యం ఉండటంతో టొవినో థామస్ ఈ విద్యలో శిక్షణ తీసుకుని నటిస్తున్నారు. ఈ చిత్రంలో కృతీ శెట్టి, ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మి హీరోయిన్లుగా నటిస్తున్నారు. భారతీయుడు కోసం... కమల్హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘భారతీయుడు 2’ కోసం కాజల్ అగర్వాల్ మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ తీసుకున్నారు. ‘భారతీయుడు’ (1996) సినిమాకి సీక్వెల్గా ‘భారతీయుడు 2’ (తమిళంలో ‘ఇండియన్ 2) రూపొందుతోంది. ఈ చిత్రంలో కమల్కు జోడీగా కాజల్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో పవర్ఫుల్ ఫైట్స్ చేయడం కోసం అతిపురాతనమైన యుద్ధ క్రీడ కలరి పయట్టు నేర్చుకున్నారు కాజల్. కలరి సాధన చేస్తున్న ఓ వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ‘షావోలిన్, కుంగ్ ఫూ, కరాటే, తైక్వాండో.. వంటి క్రీడలు కలరి నుంచి పుట్టుకొచ్చినవే’ అని పేర్కొన్నారామె. ఈ మూవీ కోసం గుర్రపు స్వారీ కూడా నేర్చుకున్నారు కాజల్ అగర్వాల్. -
మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ అకాల మరణం.. 18 ఏళ్లకే..!
మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) ఫైటర్, అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్షిప్ (UFC) భవిష్యత్ ఆశాకిరణం విక్టోరియా లీ అకాల మరణం చెందింది. హవాయ్లో పుట్టిన ఈ అప్కమింగ్ ఫైటర్ 18 ఏళ్లకే తనువు చాలించి, తన కుటుంబంతో పాటు యావత్ మార్షల్ ఆర్ట్స్ రంగాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది. 16 ఏళ్లకే సింగపూర్ బేస్డ్ ప్రమోటర్ వన్ ఛాంపియన్షిప్తో కాంట్రాక్ట్ కుదుర్చుకుని అపజయమెరుగని ఫైటర్గా చలామణి అవుతున్న లీ.. హఠాత్తుగా ఈ లోకాన్ని వదిలి వెల్లడం పట్ల యావత్ క్రీడాలోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. View this post on Instagram A post shared by Angela Lee Pucci (@angelaleemma) లీ మరణ వార్తను ఆమె సోదరి ఏంజెలా లీ నిన్న (జనవవరి 8) సోషల్మీడియా వేదికగా వెల్లడించింది. విక్టోరియా ఎలా మరణించిందో ప్రస్తావించని ఏంజెలా.. డిసెంబర్ 26వ తేదీనే తన సోదరి మరణించినట్లు పేర్కొంది. విక్టోరియా మరణం తమ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిందని, గతంలోలా ఇక తామెప్పుడూ ఉండలేమని, తాము ఎదుర్కొంటున్న పరిస్థితి ఏ కుటుంబానికి రాకూడదని భగవంతున్ని ప్రార్ధిస్తున్నానని ఏంజెలా సోషల్మీడియా సందేశాన్ని పెట్టింది. View this post on Instagram A post shared by ONE Championship (@onechampionship) విక్టోరియా మృతి పట్ల ప్రముఖ UFC ఫైటర్లు కానర్ మెక్ గ్రెగర్, ఖబీబ్, జాన్ జోన్స్, బ్రాక్ లెస్నర్ సంతాపం తెలిపారు. కాగా, అతి చిన్న వయసులోనే విక్టోరియా మృతి చెందడం పట్ల పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫైటింగ్ రింగ్లో కనపడని గాయాలు తగిలి ఆమె మృతి చెంది ఉంటుందని కొందరంటుంటే, మరికొందరేమో విక్టోరియా వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. -
కర్రసాముకు పూర్వవైభవం.. చిన్నారుల్లో పెరుగుతున్న ఆసక్తి
విజయవాడ స్పోర్ట్స్: ప్రాచీన యుద్ధ కళ కర్రసాము (సిలంబం)కు పూర్వవైభవం వస్తోంది. విజయవాడ నగరానికి చెందిన చిన్నారులు కర్రసాములో నిష్ణాతులై, క్రీడా వేదికలపై సత్తా చాటుతున్నారు. నిరంతర సాధనతో జాతీయ పతకాలు కైవసం చేసుకుంటున్నారు. అంతరించిపోతున్న కళల జాబితాలో చేరిన విద్యను తాజాగా వెలుగులోకి తీసుకొస్తున్నారు. విశిష్ట చరిత్ర.. క్రీస్తుకు పూర్వమే ఈ కర్రసాము విద్య పుట్టింది. అప్పటి జీవన విధానం, అందుబాటులోని వనరుల ఆధారంగా శత్రువులపై పైచేయి సాధించేందుకు తమిళనాడులో గాడ్ మురుగన్ సంప్రదాయ కర్రసామును ప్రపంచానికి పరిచయం చేశారు. తమిళంలో దీనిని ‘సిలంబం’ అని, తెలుగులో ‘తాలింకానా’ అని పిలిచేవారని చరిత్ర చెబుతోంది. కర్రలతో చేసే సాధనం కావడంతో కొన్నేళ్ల తరువాత ‘కర్రసాము’గా తెలుగులో ప్రసిద్ధి కెక్కింది. కాలక్రమేణా కర్రసాము యుద్ధ ప్రాముఖ్యత తగ్గిపోయినా నేటికీ ఈ కళ కొన్ని గ్రామాల్లో సజీవంగానే ఉంది. అయితే నగర యువతకు ఈ విద్య గురించి పూర్తిగా అవగాహన ఉండదనేది అక్షర సత్యం. ఈ నేపథ్యంలోనే కర్రసాము ఔన్యత్యాన్ని నగర యువతకు చాటేందుకు ‘సంప్రదాయ కర్రసాము(ట్రెడిషనల్ సిలంబం)’ పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు. కర్రసాము సాధనతో ఆత్మరక్షణతో పాటు అధిక బరువు తగ్గడానికి, మడమలు, కీళ్లు, ఎముకల పటుత్వానికి, రక్త ప్రసరణ సజావుగా సాగేందుకు, ఏకాగ్రత పెంచేందుకు ఉపయోగపడుతుందని కోచ్లు వివరిస్తున్నారు. తొమ్మిది విభాగాల్లో పోటీలు.. ట్రెడిషనల్ సిలంబం పోటీలు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నారు. సింగిల్ స్టిక్, డబుల్ స్టిక్, స్వార్డ్, స్పీయర్, సురుల్వార్, డీర్ఆరమ్స్, మ్యాన్ టు మ్యాన్, డ్యూయల్ ఈవెంట్, గ్రూప్ ఈవెంట్లను నిర్వహిస్తున్నారు. వీటిల్లో మ్యాన్ టు మ్యాన్ విభాగంలో ఎదురెదురుగా ఇద్దరు యుద్ధం చేసినట్లు పోటీ పడతారు. మిగిలిన విభాగాలు కేవలం ప్రదర్శన మాదిరిగానే పోటీలు నిర్వహిస్తారు. పోటీలకు 6 మీటర్ల పొడవు, 6 మీటర్ల వెడల్పుతో ఏర్పాటు చేసిన కోర్టులో 70 సెకన్లలో ప్రదర్శన ముగించాల్సి ఉంటుంది. కర్ర తీప్పే స్పీడ్, స్టయిల్, సౌండ్, స్కిల్ ఆధారంగా మార్కులు వేస్తారు. వ్యక్తి శరీరానికి లేదా నేలకు కర్ర తాకితే నెగిటివ్ మార్కులు ఉంటాయి. జాతీయ క్రీడా వేదికపై.. చెన్నైలో గత నెల 25వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరిగిన జాతీయ స్థాయి ట్రెడిషనల్ సిలంబం పోటీల్లో విజయవాడకు చెందిన క్రీడాకారులు సత్తా చాటారు. అండర్–12 విభాగంలో ఎం.హియాజైన్ స్వర్ణం(డబుల్స్టిక్), ఎన్.యశస్వి స్వర్ణం(సింగిల్స్టిక్), కె.రిషికేష్ కాంస్యం(సింగిల్స్టిక్), అండర్–14 విభాగంలో జి.ఆరుష్ రజతం(సింగిల్ స్టిక్), అండర్–10 విభాగంలో ఎన్.కశ్యప్ రజతం(సింగిల్స్టిక్), పి.శ్రీకారుణ్య రజతం(డబుల్స్టిక్), అండర్–8 విభాగంలో బి.మేఘనా రజతం(సింగిల్స్టిక్), కారుణ్య కాంస్య(సింగిల్స్టిక్) పతకాలు సాధించారు. రెండు చోట్ల శిక్షణ కేంద్రాలు.. విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం, యనమలకుదురులోని కృష్ణానది వద్ద ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో కఠోర శిక్షణ తీసుకుంటున్నారు. ప్రస్తుతం విజయవాడ నగరంలో సుమారు 200 మంది చిన్నారులు కర్రసాములో శిక్షణ తీసుకుంటున్నట్లు కోచ్లు చెబుతున్నారు. (క్లిక్ చేయండి: అద్భుత శిల్పాలు చెక్కుతూ.. శాండ్ ఆర్టిస్ట్గా అంతర్జాతీయ ఖ్యాతి) అంతర్జాతీయ పతకాలు సాధిస్తాం.. ఇటీవల జరిగిన జాతీయ స్థాయి పోటీలకు దేశంలోని అన్ని రాష్ట్రాలు ప్రాతినిధ్యం వహించాయి. మన జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన ప్రతి క్రీడాకారుడు పతకం సాధించాడు. రానున్న రోజుల్లో జరిగే ప్రపంచ స్థాయి పోటీల్లోనూ పతకాలు సాధించేందుకు క్రీడాకారులను తీర్చిదిద్దుతున్నాం. – కె.సత్యశ్రీకాంత్, కోచ్ వచ్చే ఏడాది నుంచి స్కూల్ గేమ్స్లో.. సంప్రదాయ కర్రసాము క్రీడకు గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఏన్నో ఏళ్లుగా కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది (2023) స్కూల్ గేమ్స్లో చేర్చుతున్నట్లు ఇటీవల చేసిన ప్రకటన ఆనందాన్ని కలిగించింది. స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్) ఈ క్రీడకు గుర్తింపు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్)ను గుర్తింపు ఇవ్వాలని కోరుతున్నాం. – నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ ట్రెడిషనల్ సిలంబం అసోసియేషన్ కార్యదర్శి -
గోల్డ్ మెడల్తో సర్ప్రైజ్ చేసిన హాలీవుడ్ హీరో
వెనమ్(VenoM), మ్యాడ్మాక్స్ ఫ్యూరీ రోడ్.. ఫేమ్ హాలీవుడ్ హీరో టామ్ హార్డీ(ఎడ్వర్డ్ థామస్) పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచింది. హీరోగా పేరు తెచ్చుకొని మళ్లీ పాపులర్ అవడం ఏంటని డౌట్ వద్దు. విషయంలోకి వెళితే.. మార్షల్ ఆర్ట్ కాంపిటీషన్లో పాల్గొన్న టామ్ హార్డీ ఏకంగా గోల్డ్ మెడల్ కొల్లగొట్టడం విశేషం. 45 ఏళ్ల వయసులో మార్షల్ ఆర్ట్స్లోకి ఎంటరైన టామ్ హార్డీ 2022 బ్రెజిలియన్ జియు-జిట్సు ఓపెన్ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచాడు. సెప్టెంబర్ 17న అల్టిమేట్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ ఆధ్వర్యంలో మిల్టన్ కీన్స్లోని ఓక్గ్రోవ్ స్కూల్లో ఈ పోటీని నిర్వహించారు. నీలిరంగు దుస్తులు ధరించిన టామ్ హార్డీ.. తన అసలు పేరు ఎడ్వర్డ్ థామస్గా బరిలోకి దిగడం విశేషం. కాగా పోటీలో ప్రత్యర్థికి అవకాశం ఇవ్వని టామ్ హార్డీ పట్టుతో ఉక్కిరిబిక్కిరి చేశాడు. మ్యాచ్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక టామ్ హార్డీ మార్షల్ ఆర్ట్స్ గేమ్స్లో పాల్గొనడంపై మ్యాచ్ నిర్వాహకులు స్పందించారు. టామ్ హార్డీ చాలా మంచి వ్యక్తి. అతని యాక్టింగ్ తెలిసిన ప్రతీ ఒక్కరు గుర్తుపడతారు. మేం పిలిచిన వెంటనే ఒక గెస్ట్గా హాజరవడమే గాక మ్యాచ్ ఆడడంతో పాటు అభిమానులకు ఫోటోలు ఇవ్వడం అతని మంచి మనుసును తెలియజేస్తుంది. ఇలాంటి ఈవెంట్కు టామ హార్డీ రావడం మా అదృష్టం అని పేర్కొన్నారు. మ్యాచ్ అనంతరం గోల్డ్ మెడల్తో పాటు సర్టిఫికేట్ పొందిన టామ్ హార్డీ మాట్లాడాడు. ''ఈ విజయం వర్ణించలేనిది.. ఎందుకంటే నేనింకా షాక్లోనే ఉన్నా.. ఏం మాట్లాడాలో తెలియడం లేదు'' అంటూ పేర్కొన్నాడు. Tom Hardy just casually submitting people at 45 years old pic.twitter.com/pLpYvH1Rj4 — Out Of Context MMA (@oocmma) September 21, 2022 View this post on Instagram A post shared by 𝗧𝗮𝗽𝗲𝗱 𝗙𝗶𝗻𝗴𝗲𝗿𝘀 (@taped_fingers) -
కర్రసాములో ప్రత్యేకత చాటుకుంటున్న మంగంపేట
సాక్షి, రాయచోటి(అన్నమయ్య జిల్లా) : మన పూర్వీకుల కాలంలో బందిపోటు, గజదొంగలు, శత్రువులు గ్రామాలపై దాడి చేసి దోచుకొని వెళ్తుండేవారు. అప్పట్లో గ్రామాలను కాపాడుకునేందుకు ఆత్మరక్షణ కోసం యువత కర్రసాము విద్యను అభ్యసించి ప్రావీణ్యం పొందేవారు. ఇందుకు ప్రత్యేకంగా గురుకులాలు ఏర్పాటుచేసి కర్రసాములో శిక్షణ ఇచ్చే వారు. కర్రసాములో బాగా రాణించిన వారికి సంఘంలో ప్రత్యేక ఆదరణ లభించేంది. కాలానుగుణంగా అన్ని రంగాలలో అభివృద్ధి సాధించడంతో కర్రసాము విద్య మరుగున పడిపోయింది. అయితే గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికీ ఆనాటి కర్రసాములో ప్రావీణ్యం పొందిన వారు ఉన్నారు. పెళ్లిసందడి, జాతర్లలో, ఉరుసు ఉత్సవాలతోపాటు పండుగ, పబ్బాల సమయంలోనూ కర్రసాము తళుక్కుమంటోంది. పూర్వకాలం నుంచి వస్తున్న అనేక విద్యల్లో కర్రసాము అనేది విలువైనదిగా గ్రామీణ ప్రాంత జనం భావించేవారు. కాలంలో మార్పు.. కంప్యూటర్ యుగం రాకతో పాతకాలం సంప్రదాయాలు కనుమరుగవుతున్నాయి. అయితే ఓబులవారిపల్లె మండలం మంగంపేటకు చెందిన పలువురు యువకులు, చిన్నారులు కర్రసాము పట్ల ఆసక్తి చూపడంతోపాటు నేర్చుకోవడం విశేషం. అలా గిర్రున తిప్పేస్తున్నారు.. అంతే..! మంగంపేట గ్రామస్తులు తమ పిల్లలకు కర్రసాము నేర్పించాలనే ఉద్దేశంతో పునరావాస కాలనీ కోసం ఏర్పాటు చేసిన మైదానంలో గత కొంతకాలంగా ప్రతిరోజూ కర్రసాముపై శిక్షణ పొందుతూ వస్తున్నారు. వై.కోట గ్రామానికి చెందిన గురువు బాబు వేసవి సెలవుల నుంచి ప్రతి నిత్యం సాయంత్రం సమయంలో కర్రసాము నేర్పించారు. ఇదే వరుసలో గ్రామానికి చెందిన యువత కూడా ఆసక్తి చూపుతూ కర్రసాములో భాగంగా కట్టెను అలా గిర్రున తిప్పేస్తున్నారు. సెలవులలో ఇంటి వద్ద ఉన్న పిల్లలు కర్రసాముపై మక్కువ పెంచుకొని ప్రతి రోజూ సాధన చేయడంతో ఇప్పుడుతిప్పడంలో ఆరితేరిపోయారు. గ్రామానికి చెందిన దాదాపు 40 మంది పిల్లలు కర్రసాములో ప్రత్యేక నైపుణ్యం ప్రదర్శిస్తున్నారు. మంగంపేట పునరావాస కాలనీకి చెందిన ఎన్ఆర్ఐ బాబాయి, అబ్బాయిలైన బంగారపు నరసింహులు, బంగారపు పీరయ్య గ్రామంలో యువకులు, పిల్లలకు కర్రసాము నేర్పించాలనే ఉద్దేశంతో వై.కోట గ్రామానికి చెందిన బాబు అనే గురువును ఏర్పాటు చేశారు. తొలుత పది మంది పిల్లలతో ప్రారంభించారు. అయితే కర్రసాములో యువకులు, పిల్లలు కొద్ది కాలంలోనే బాగా రాణిస్తుండంతో వీరిని చూసి మరికొంత మంది కర్రసాము నేర్చుకొనేందుకు ముందుకు వచ్చారు. ఏది ఎమైనా అంతరించి పోయిన కర్రసాము విద్యను మంగంపేట గ్రామస్తులు నేర్చుకుంటూ పది మందికి మళ్లీ పరిచయం చేస్తున్నారు. కర్ర తిప్పడం అప్పుడు కష్టం... ఇప్పుడు ఇష్టం కర్ర తిప్పడం అంటే సామాన్యమైన విషయం కాదు. గురువు సలహాలు, సూచనలతో వేళ్ల చేతితో కర్రను తిప్పడం సులువు కాదు. సాధన చేయగా తిప్పడం సులువుగా మారింది. తిప్పడంలో కూడా అనేక రకాలు ఉన్నాయి. కట్టె తిప్పుతూ ముందుకు నడుస్తూ, కాళ్ల కింద నుంచి తిప్పడం లాంటి మెలకువలు నేర్చుకున్నాను. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వీలు దొరికినప్పుడల్లా అందరం కలిసి సాధన చేయడం ద్వారా కర్రసాములో ప్రావీణ్యత సాధించాం. – ఎం.రామ్చరణ్, 10వ తరగతి, మంగంపేట, అన్నమయ్య జిల్లా వేసవి విడిదిలో పిల్లలకు నేర్పించాలని అనుకొన్నాను నేను గల్ఫ్ దేశం నుంచి స్వదేశానికి వచ్చి ఇంటి వద్ద మా పిల్లలకు కర్రసాము నేర్పించాలని అనుకున్నాను. మరి కొంత మంది పిల్లలు ఆసక్తి చూపడంతో గురువును ఏర్పాటు చేసి ప్రతి రోజూ నేర్పిస్తున్నాను. – బంగారపు నరసింహులు, ఎన్ఆర్ఐ మంగంపేట, ఓబులవారిపల్లె శారీరకంగా, మానసికంగా ఉపయోగకరం దాదాపు నలభై మంది పిల్లలు కర్రసాము నేర్చుకున్నారు. కొద్దిరోజుల్లోనే మెలకువలు తెలుసుకొని బాగా రాణిస్తున్నారు. పిల్లలు నేర్చుకునే సమయంలో చాలా ఆసక్తిగా కనిపించారు. ప్రతి రోజూ సాయంత్రం సమయంలో నేర్చుకోవడంతో శారీరకంగా, మానసికంగా పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. – బి.పీరయ్య, మంగంపేట, ఓబులవారిపల్లె. వేసవి సెలవుల్లో నేర్చుకున్నా ! నా పేరు ఎం.సుశాంత్. మంగంపేటలో నివాసముంటున్నాను. మక్కా స్కూలులో ఆరవ తరగతి చదువుతున్నాను. వేసవి సెలవుల్లో ఏదో ఒక విభాగంలో నైపుణ్యం పెంచుకుంటే బాగుంటుందని భావించి కర్రసాము నేర్చుకున్నాను. దాదాపు 45 రోజుల వ్యవధిలో కర్ర బాగా తిప్పుతు న్నాను. చదువుతోపాటు ఆత్మరక్షణకు సంబంధించిన కర్రసాములో నైపుణ్యం సాధించాను. (క్లిక్: అవధాన ఉద్దండుడు.. నరాల రామారెడ్డి) -
గోల్డెన్...ఫైట్
సాక్షి, హైదరాబాద్: ఆమె కరాటే సాధన ప్రారంభించే సమయానికి వయసు 12ఏళ్లు. అంతర్జాతీయ పోటీలో పాల్గొనే సమయానికి 13ఏళ్లు. ‘తొలుత ఈ రంగాన్ని ఎంచుకున్నప్పుడు అమ్మా నాన్న చాలా సంకోచించారు. అయితే నా పట్టుదల చూసి వెన్ను తట్టారు. ఇప్పుడు వారే నన్ను అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నారు’ అని చెప్పారు సయ్యదా. సాధన తప్పదు..గాయాలూ తప్పవు ‘టోర్నమెంట్కు ముందు రోజుకి కనీసం 4 నుంచి 5 గంటల పాటు శిక్షణ తప్పనిసరి. మిగిలిన రోజుల్లో కూడా రెండు పూటలా ఫిట్నెస్ కాపాడుకునే వ్యాయామాలు చేయాల్సిందే’ నని చెప్పారు సయ్యదా. ‘ఏ విజయం కూడా సునాయాసంగా రాదు. పురుషులకైనా, మహిళలకైనా ఇష్టమైన రంగాన్ని ఎంచుకుంటే కష్టం అనిపించదు’ అంటారు. కామన్వెల్త్ ఛాంపియన్ షిప్కి భారత్ తరపున ప్రాతినిథ్యం వహించాల్సి ఉందనగా సరిగ్గా 2 నెలల ముందు కాలికి తీవ్ర గాయంతో కదలలేకుండా పోయిన సందర్భాన్ని గుర్తు తెచ్చుకుంటూ... ఇవన్నీ ఆటలో భాగం అంటారామె. డైట్...రైట్..రైట్ సాధనకు తగ్గట్టుగా శరీరాన్ని తీర్చిదిద్దుకోవడానికి సరైన డైట్ తీసుకుంటానని చెబుతున్నారామె. రోజువారీగా వ్యాయామం తప్పదు. అందుకే రంజాన్ వంటి అత్యంత ముఖ్యమైన పండుగ సందర్భాల్లో ఆమె మరింత జాగ్రత్తగా తన సాధనను దినచర్యను బ్యాలెన్స్ చేసుకుంటారామె. రాజకీయ శాస్త్రంలో పట్టా సాధించి, ప్రస్తుతం లా కోర్సు చేస్తున్న సయ్యదా... తాజాగా రాజకీయ రంగంలో కూడా ప్రవేశించడం విశేషం. రాజకీయాల్లో క్రీడాభివృద్ధికి మాత్రమే కాక మహిళల స్వయం సాధికారత కోసం కూడా తాను కృషి చేస్తానని అంటున్నారామె. (చదవండి: నన్ను ఎవరూ భయపెట్టలేరు. దేనికీ భయపడను: తెలంగాణ గవర్నర్ తమిళిసై) -
వయసు 78.. బరిలో దిగిందో.. ప్రత్యర్థి మట్టి కరవాల్సిందే
తిరువనంతపురం: కొన్ని ఏళ్ల క్రితం మగ పిల్లలు ఆడే ఆటలపై అమ్మాయిలు అంతగా ఆసక్తి చూపేవారు కాదు. ముఖ్యంగా కరాటే, బాక్సింగ్ వంటి క్రీడలవైపు వెళ్లాలంటే అమ్మాయిలతో పాటు.. తల్లిదండ్రులు కూడా పెద్దగా ఇష్టపడేవారు కారు. ప్రస్తుతం ఈ ఆలోచన ధోరణి మారుతోంది. ఆటలకు ఆడా..మగా తేడా ఏంటని భావిస్తున్నారు. ఈ క్రమంలో చాలా వరకు క్రీడాంశాల్లో అమ్మాయిలు సత్తా చాటుతున్నారు. అయితే వీరు కూడా ఆధునిక క్రీడలవైపే మొగ్గు చూపుతున్నారు కానీ మన సంప్రదాయ ఆటలపై ఆసక్తి కనపర్చడం లేదు. ఈ క్రమంలో కేరళకు చెందిన 78 ఏళ్ల వృద్ధురాలు మీనాక్షి అమ్మ మన దేశ పురాతన మార్షల్ ఆర్ట్ అయిన కలరిపయట్టులో పరాక్రమం చూపిస్తూ ప్రత్యర్థులను మట్టి కరిపిస్తూ.. యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆ వివరాలు.. కేరళకు చెందిన వృద్ధురాలు మీనాక్షి అమ్మ భారతదేశ పురాతన మార్షల్ ఆర్ట్ కలరిపయట్టును నేటికి కూడా సాధన చేయడమే కాక అమ్మాయిలు దాన్ని సాధన చేసేలా ప్రొత్సాహిస్తున్నారు. ఈ సందర్భంగా మీనాక్షి అమ్మ మాట్లాడుతూ.. ‘‘ఏడేళ్ల వయసు నుంచే కలరి సాధన చేయడం ప్రారంభించాను. ఇప్పటికీ ప్రాక్టీస్ చేయడమే కాక ఇతరులకు నేర్పుతున్నాను’’ అని తెలిపారు. కలరిపయట్టు నేర్పే ఈ స్కూల్ని మీనాక్షి భర్త 1949లో ప్రారంభించాడు. ఆయన మరణం తర్వాత మీనాక్షి ఈ స్కూల్ బాధ్యతలు చూస్తున్నారు. (చదవండి: Calicut Riders Family: సాఫ్ట్వేర్ ఇంజనీర్, హోం మేకర్స్.. ఇంకా) ‘‘రోజు ఉదయం పేపర్ తెరిచామంటే.. మహిళపై జరుగుతున్న దాడులకు సంబంధించి ఏదో ఓ వార్త ఉంటుంది. ఇలాంటి అరాచకాల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే కలరిపయట్టు నేర్చుకోవడం ఎంతో మంచింది. ఈ మార్షల్ ఆర్ట్ కళను నేర్చుకోవడం వల్ల మహిళలు శారీరకంగా, మానసికంగా ధృడంగా తయారవుతారు. వారి మీద వారికి నమ్మకం పెరుగుతుంది.. ఒంటరిగా ఉద్యోగాలకు వెళ్లడం.. ప్రయాణాలు చేయాల్సి వచ్చినా వారు భయపడరు’’ అన్నారు మీనాక్షి. ‘‘కలరిపయట్టులో పూర్తిగా నిమగ్నం అయితే మన శరీరమే కళ్లవుతాయి. ప్రత్యర్థి మాయమవుతాడు. దీనిలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి శాంతికి సంబంధించింది అయితే మరోకటి యుద్ధంలో వాడేది. కలరిపయట్టు నేర్చుకోవడం వల్ల మనసు, బుద్ధి, శరీరం, ఆత్మ పూర్తిగా శుద్ది అవుతాయి. ఏకాగ్రత పెరుగుతుంది. వేగం, శాంతి పెరుగుతాయి. శారీరక, మానసిక శక్తి పునరుత్తేజమవుతోంది’’ అన్నారు. (చదవండి: అప్పుడు కేరళలో.. ఇప్పుడు తమిళనాడులో.. ఆ హక్కు మీకు ఉంది!) నృత్యం,యోగా అంశాలను కలిగి ఉన్న కలరిపయట్టులో కత్తులు, కవచాలు, వంటి ఆయుధాలు ఉంటాయి. కలరి 3,000 సంవత్సరాల పురాతనమైనది. దీని గురించి ప్రాచీన హిందూ గ్రంథాలలో ప్రస్తావించారు. అయితే బ్రిటీష్ పాలనలో కలరిపయట్టు సాధనపై నిషేధం విధించారు. అయితే స్వాతంత్య్రం వచ్చాక నిషేధాన్ని తొలగించినప్పటికి పూర్వ వైభవం రాలేదు. కాకపోతే 20వ శతాబ్దం ప్రారంభం నుంచి కలరిపయట్టుపై ఆసక్తి చూపే వారి సంఖ్య పెరగడం మంచి పరిణామంగా భావిస్తున్నారు. చదవండి: విద్యుత్ జమాల్.. కలరిపయట్టు -
అకీరా కర్రసాము వీడియో షేర్ చేసిన రేణూ దేశాయ్
-
అకీరా నందన్ అద్భుత విన్యాసం: నెటిజనుల సందడి, వైరల్
సాక్షి, హైదరాబాద్: నటి, దర్శకురాలు రేణూ దేశాయ్ తనయుడు అకిరా నందన్ తన టాలెంట్తో మరో సారి వార్తల్లో నిలిచారు. మార్టల్ ఆర్ట్స్లో ఇప్పటికే తనదైన శైలిలో ఆకట్టుకుంటున్నాడు. అకీరా కర్రసాము చేస్తున్న వీడియోను రేణూ ఇన్స్టాలో షేర్ చేశారు. తండ్రి పవన్ కళ్యాణ్ జానీ సినిమాలో లాగా కర్ర సాము ఇరగదీస్తున్నాడంటూ అభిమానులు కామెంట్ చేశారు. తండ్రికి తగ్గ తనయుడంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అకీరా ఒడుపుగా కర్రసాము చేస్తున్న వీడియోకి రేణూ పాప్ స్టార్ మైకేల్ జాన్స్ బిల్లీ జీన్ సాంగ్ను యాడ్ చేశారు. ఈ అద్భుతమైన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అంతేకాదు జానీ-2 పేరుతో అకీరాని పరిచయం చేయమంటూ ఫ్యాన్స్ సలహా ఇస్తున్నారు. కాగా కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో అకీరా ఎంట్రీపై ఇపుడు తానేమీ చెప్పలేనని, సమయం వచ్చినప్పుడు కచ్చితంగా చెబుతానంటూ ఇటీవల వ్యాఖ్యానించిన రేణూ దేశాయ్ అకీరా తెరంగేట్రం ఊహాగానాలకు మరింత ఉత్సాహాన్నిచ్చారు. కరాటే, కుంగ్ ఫూ వంటి మార్షల్ ఆర్ట్స్ లో అకీరా పాపులర్ అవుతున్న సంగతి తెలిసిందే. @PawanKalyan ❤️🙏 దేవర తండ్రికి తగ్గ 🔥 తనయుడు #AkiraNandan 😍🥰@ganeshbandla #PawanKalyan #HariHaraVeeraMallu #BheemlaNayak #PSPKRanaMovie #ProductionNo12 #PSPK28 pic.twitter.com/5IpG7bNDJV — SHOBAN NAIDU (@pagadalapavan00) August 3, 2021 -
ఆ పాత్ర కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్న కాజల్
ఓ సీక్రెట్ మిషన్ యాక్షన్ మిషన్ కోసం మార్షల్ ఆర్ట్స్, రైఫిల్ షూటింగ్, గయాక్షన్ మిషన్ ఫైరింగ్లో శిక్షణ పొందుతున్నారు హీరోయిన్ కాజల్ అగర్వాల్. నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రా (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) ఏజెంట్ పాత్రలో కనిపిస్తారు నాగ్. హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా ఇందులో ‘రా’ ఏజెంట్గానే కనిపించనున్నారు. ఈ పాత్ర లుక్, బాడీ లాంగ్వేజ్, స్క్రీన్ ప్రెజెన్స్ సూపర్గా ఉండాలని ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నారు కాజల్. ఆమె పాత్రకు కొన్ని యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రీకరణలో పాల్గొంటున్నారు కాజల్. -
మోహన్లాల్ కూతురిని ఆశీర్వదించిన బిగ్ బీ
నటుడిగా మోహన్లాల్ ప్రతిభ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఇప్పుడు చెప్పుకోవాల్సింది విస్మయ గురించి. మోహన్లాల్ కూతురైన విస్మయ థాయ్ మార్షల్ ఆర్ట్స్లో అద్భుతమైన ప్రతిభ చూపించి ‘ఆహా!’ అనిపించింది. చక్కగా కవిత్వం రాస్తుంది. అంతే చక్కగా పెయింటింగ్స్ వేస్తుంది. తన కవిత్వం, బొమ్మలతో తాజాగా ‘గ్రేన్స్ ఆఫ్ స్టార్డస్ట్’ పేరుతో పుస్తకం తీసుకువచ్చింది. ఆమె సృజనాత్మక ప్రయాణం నిరంతరం కొనసాగాలని బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఆశీర్వదించారు. T 3823 - MohanLal , superstar pf Malayalam Cinema and one that I have immense admiration of , sends me a book, "Grains of Stardust", written & illustrated by his daughter Vismaya .. A most creative sensitive journey of poems and paintings .. Talent is hereditary ! My best wishes pic.twitter.com/KPmojUbxhk — Amitabh Bachchan (@SrBachchan) February 23, 2021 -
విద్యుత్ జమాల్.. కలరిపయట్టు
‘కళ్లు ఉన్నోడు ముందు మాత్రమే చూస్తాడు. దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు’ అని ‘దూకుడు’ సినిమాలో మహేశ్బాబు అంటారు. బాలీవుడ్ యాక్షన్ హీరో విద్యుత్ జమాల్ కూడా ఇలాంటి మాటే అంటున్నారు. ‘మెదడు గుడ్డిది అయితే కళ్లు ఉన్నా ఉపయోగం లేదు’ అంటున్నారు ఆయన. వీలున్నప్పుడల్లా తన సినిమాల్లో మార్షల్ ఆర్ట్స్ను ప్రదర్శిస్తూ ఉంటారాయన. అలానే తన సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు మార్షల్ ఆర్ట్స్, ఫిట్నెస్ విషయాలనే ఎక్కువగా ప్రస్తావిస్తుంటారు. తాజాగా ప్రాచీన యుద్ధ విద్య కలరిపయట్టులో శిక్షణ తీసుకుంటున్న ఓ వీడియోను పంచుకున్నారు. కళ్లకు మైనం వేసుకొని దాని మీద ఓ బట్టతో కళ్లు కట్టేసుకున్నారు. కత్తి తీసుకుని పండ్లను నేర్పుగా కట్ చేయడం ఆ వీడియోలో కనబడుతుంది. ‘‘ఈ ఆర్ట్ వల్ల మన ఫోకస్ మొత్తం ఒక పని మీద పెట్టడం అలవర్చుకోవచ్చు. చాలా ఏళ్లుగా ఈ విద్యను నేర్చుకోవాలనుకున్నాను. ఇప్పటికి కుదిరింది’’ అన్నారు విద్యుత్ జమాల్. -
ఆత్మరక్షణ: ప్రతిరోజూ పోరాటమే!
యానీయా భరద్వాజ్ బాలీవుడ్ నటి, మోడల్, వెబ్స్టార్. ‘మేడ్ ఇన్ హెవెన్’ సీరిస్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. పట్టణ, గ్రామీణ భారతీయ బాలికలు నన్చాకు(జపనీస్ మార్షల్ ఆర్ట్ వెపన్), కత్తి విద్యలను తప్పనిసరి నేర్చుకోవాలని ఇటీవల ట్విటర్ వేదికగా కోరింది. యానీయా లాక్డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ హిమాచల్ ప్రదేశ్లో నన్చాకు, కత్తి పోరాటాలలో కఠిణ శిక్షణ తీసుకుంటోంది. ‘భారతీయ అమ్మాయిలు తమ మనుగడకు ప్రతిరోజూ పోరాటం చేయాల్సిందే. అందుకు ఆత్మస్థైర్యం, ఆత్మరక్షణకు పోరాట పఠిమను పెంచే విద్యలలో శిక్షణ తీసుకోవడం తప్పనిసరి అవసరం’ అంటూ తన అభిప్రాయాలను వెలిబుచ్చింది యానీయా – ‘అమ్మాయి అనగానే అందం, సున్నితత్వం అనే అంశాలకు మాత్రమే మనదగ్గర ప్రాధాన్యమిస్తారు. చిన్ననాటి నుంచీ అలాగే పెంచుతారు. అందుకే, చాలామంది అమ్మాయిల్లో ఆత్మస్థైర్యం పాళ్లు తక్కువ. ప్రపంచ సినిమా, అంతర్జాతీయ వినోద ప్రాజెక్టులలో ఔత్సాహిక నటిగా ఎదగడానికి ముందు నేను ధైర్యంగా ఉండటం అవసరమని భావించాను. అప్పుడే నన్చాక్స్, కత్తులు నన్ను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. నేను వాటితో కనెక్ట్ అయ్యానని బలంగా నమ్ముతున్నాను. నన్చాకు ను ఉపయోగిస్తూ హృతిక్ రోషన్తో కలిసి ఓ ప్రకటనలో నటించాను. అప్పుడే దాని ప్రాముఖ్యం తెలిసింది. అందుకే నన్చాకులో శిక్షణ పొందాను. నన్చాక్తో నైపుణ్యం శరీరం ఫిట్గా ఉండటానికీ తోడ్పడుతుంది. ఇప్పుడు కత్తితో ప్రాక్టీస్ చేయడాన్ని బాగా ఇష్టపడుతున్నాను. రక్షణ విద్యలు అవసరం పట్టణ, గ్రామీణ భారతదేశంలోని భారతీయ బాలికలు అందరూ నన్చాకు, కత్తి నైపుణ్యాలను తప్పక నేర్చుకోవాలి. తమను తాము రక్షించుకోవడానికి ఈ విద్యలు చాలా అవసరం. హిమాచల్ ప్రదేశ్లోని కొందరు గ్రామస్తులు నా సాధనకు అరుదైన చారిత్రాత్మక కళాఖండ ఖడ్గాన్ని బహుమానంగా ఇచ్చారు. ఆ సమయంలో ఎంత సంతోషించానో మాటల్లో చెప్పలేను. ఈ నైపుణ్యాలతో ఒక నటిగా నన్ను నేను నిలబెట్టుకోగలను అనే నమ్మకం మరింతగా బలపడింది. ఇటీవల రిలీజైన అంతర్జాతీయ వెబ్ సీరీస్లలో ‘కర్స్డ్’ , ’ది విట్చర్’ అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ సీరీస్లలో నటీమణులు కత్తి, ఆయుధాలను వాడి తమ ప్రతిభను చాటుకున్నారు. కత్తి పోరాట సామర్ధ్యాలతో రాణించే మొదటి భారతీయ నటి నేను కావాలని శ్రమిస్తున్నాను. మొదట నేను చేయబోయే సినిమా కోసమే ఈ విద్య నామమాత్రంగా నేర్చుకోవాలనుకున్నాను. కానీ, ఈ విద్య నాలో తెలియని ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది. అందుకే కఠిన శిక్షణ తీసుకుంటున్నాను’ అని వివరించింది యానియా. అంతేకాదు కరోనా కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి యానీయా హిమాచల్ప్రదేశ్లో తన ఫోటోగ్రఫీ అభిరుచికి పదును పెట్టింది. వెలుతురు–చీకటి, నలుపు–తెలపులలో తీసిన ఫొటోలు యానీయా దృష్టి ప్రత్యేకతను చాటుతున్నాయి. సినిమా తారలు అంటే అందానికే కాదు ఆత్మవిశ్వాసానికీ ప్రతీకగా నిలుస్తున్నారు. ఈ రంగంలో రాణించడానికి నటనలోనే కాదు పోరాట నైపుణ్యాల కృషికీ శ్రమిస్తున్నారు. అమ్మాయిలలో స్ఫూర్తిని నింపుతున్నారు. -
కూటి కోసం
-
విజయ్ థాయ్లాండ్లో ఏం చేస్తున్నాడంటే..
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ ఓ చిత్రంలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘ఫైటర్’ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. పూరి కనెక్ట్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. హిందీ వెర్షన్కు కరణ్ జోహార్ భాగస్వామిగా వ్యవహరించనున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ మూవీ కోసం విజయ్ థాయ్లాండ్కు వెళ్లాడు. అయితే విజయ్ థాయ్లాండ్ ఎందుకోసం వెళ్లాడనేదానిపై నిర్మాత ఛార్మి స్పష్టత ఇచ్చారు. అక్కడ విజయ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నట్టు ఛార్మి తెలిపారు. మార్షల్ ఆర్ట్స్ బ్యాక్డ్రాప్లో సాగనున్న ఈ చిత్రంలో విజయ్ కొత్త లుక్లో కనిపించనున్నారు. ఇందుకోసం విజయ్ చాలా కఠోర సాధన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. విజయ్ మార్షల్ ఆర్ట్స్ శిక్షణకు సంబంధించి ఛార్మి.. ఓ వీడియో కూడా విడుదల చేశారు. అందులో విజయ్కు శిక్షణ ఇస్తున్న ట్రైనర్ను పరిచయం చేశారు. ఈ సందర్భంగా ట్రైనర్ మాట్లాడుతూ.. విజయ్ రోజుకు ఆరు గంటల పాటు సాధన చేస్తున్నట్టు తెలిపాడు. అలాగే ట్రైనింగ్ ఎలా సాగుతుందో వివరించాడు. అంతేకాకుండా జనవరి 20న ముంబైలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానున్నట్టు ఛార్మి వెల్లడించారు. మరోవైపు విజయ్ నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకులు మందుకు రానుంది. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో.. విజయ్ సరసన ఐశ్వర్య రాజేష్, కేథరిన్, ఎజిబెల్లా, రాశీ ఖన్నా నటిస్తున్నారు. -
ఇస్తానన్నాను.. ఇచ్చాను
చైనా రాజధాని బీజింగ్లో ఎం.ఎం.ఎ. పోటీలు జరుగుతున్నాయి. ఎం.ఎం.ఎ అంటే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్’. శనివారం రితు ఫొగాట్, నామ్ హీ కిమ్ బరిలోకి దిగారు. ఇద్దరి మధ్య జరుగుతున్నది ‘టెక్నికల్ నాకౌట్’ పోటీ. రితు ఇండియా అమ్మాయి. నామ్ హీ కిమ్ దక్షిణ కొరియా అమ్మాయి. కుస్తీ మొదలైంది. మూడంటే మూడే నిముషాల్లో ఆట తేలిపోయింది. ఫలితం ఏమై ఉంటుంది? బరి బయట ప్రేక్షకులలో కూర్చుని ఉత్కంఠగా ఆట చూస్తున్నవారికి ఎలాగూ కళ్లెదుటే ఫలితం తెలిసిపోతుంది. అయితే ప్రేక్షకులలో కూర్చొని, ఆట చూడకుండా సెల్ఫోన్ చూసుకుంటున్న వారికి కూడా తెలిసిపోయింది!! ఎలా? అకస్మాత్తుగా ఎ.ఆర్.రెహమాన్ గొంతు.. ‘వందే మాతరం’ అని ఉవ్వెత్తున ఎగసింది. అర్థమైపోదా.. రితు గెలిచిందని!! ఎం.ఎం.ఎ. ఆడటం రితుకూ ఇదే మొదటిసారి. అందులోని ‘ఆటమ్వెయిట్’ కేటగిరీలో పాల్గొని మూడు నిముషాల్లో ప్రత్యర్థిని నాకౌట్ చేసేసింది! 49, అంతకన్నా తక్కువ బరువు ఉన్నవారు ఆటమ్ వెయిట్ కేటగిరీలో ఆడతారు. రితు ఇప్పుడు గెలిచింది ఎం.ఎం.ఎ. లోని ‘వన్ చాంపియన్షిప్’ని! 2016 కామన్వెల్త్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ గెలిచి తొలిసారి ప్రపంచ క్రీడారంగం దృష్టిలో పడిన రితు ఈ ఏడాది ఫిబ్రవరిలో కుస్తీకి స్వస్తి చెప్పి, ఎం.ఎం.ఎ. ఫైటర్ అవడం కోసం శిక్షణ తీసుకుంది. రింగ్లోంచి బయటికి వచ్చాక రితు అన్నమాట : ‘‘వందశాతం ఇస్తానన్నాను. ఇచ్చాను’’ అని! -
సత్తా చూపిస్తా
కెరీర్లో ఇప్పటివరకు ఎక్కువగా గ్లామర్ పాత్రలే చేశారు హీరోయిన్ అదా శర్మ. తాజాగా ‘కమాండో 3’ చిత్రం కోసం మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ తీసుకున్నారామె. దాని గురించి అదా మాట్లాడుతూ– ‘‘కమాండో 3’లో పోలీసాఫీసర్ భావనా రెడ్డి పాత్రలో నటించాను. నా పాత్రలో యాక్షన్తో పాటు కామెడీ కూడా ఉంటుంది. యాక్షన్ సన్నివేశాల కోసం ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. కేరళలో కళరియపట్టు, తమిళనాడులో సిలంబం వంటి మార్షల్ ఆర్ట్స్లో ప్రావీణ్యత సంపాదించాను. నాన్చాక్ కూడా సాధన చేశా. నా కో–స్టార్ విద్యుత్ జమాల్ ఈ విషయంలో నాకు కొంతమేర సహాయం చేశారు. కానీ, నా శిక్షణ మొత్తాన్ని మా అమ్మగారు దగ్గరుండి చూసుకున్నారు. మార్షల్ ఆర్ట్స్తో భావన సత్తా ఏంటో వెండితెరపై చూపిస్తా’’ అని పేర్కొన్నారు. విద్యుత్ జమాల్, అదా శర్మ జంటగా నటించిన ‘కమాండో 3’ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. -
85 ఏళ్ల కాజల్!
‘ఇండియన్ 2’ సినిమాలో మార్షల్ ఆర్ట్స్ చేయడానికి కథానాయిక కాజల్ అగర్వాల్ సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ ఆరంభం కాకముందు ఆమె మార్షల్ ఆర్ట్స్లో ట్రైనింగ్ తీసుకున్నారనే వార్తలు కూడా వచ్చాయి. తాజా సమాచారం ఏంటంటే.. ఈ సినిమాలో వృద్ధ కమల్హాసన్ (సేనాపతి)కి జోడీగా నటిస్తున్నారట కాజల్. అది కూడా 85 ఏళ్ల వృద్ధురాలిగా కనిపించబోతున్నారని టాక్. మరి.. వృద్ధురాలి పాత్ర అంటే మార్షల్ ఆర్ట్స్ సాధ్యపడదు. ఒకవేళ యంగ్ క్యారెక్టర్లో కనిపించే ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందేమోననే ఊహాగానాలు ఉన్నాయి. శంకర్ దర్శకత్వంలో కమల్హాసన్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఇండియన్2’. 1996లో వచ్చిన ‘ఇండియన్’ చిత్రానికి ఇది సీక్వెల్. ఈ సినిమాలో కమల్హాసన్ 90ఏళ్ల వృద్ధుడి పాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరుగుతోంది. ఓ పొలిటికల్ ర్యాలీ, లోకల్ మార్కెట్ బ్యాక్డ్రాప్లో వచ్చే సన్నివేశాలను తెరకెక్కించారు. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ను కూడా ఈ షెడ్యూల్లోనే ప్లాన్ చేశారు. భోపాల్ షెడ్యూల్ తర్వాత గ్వాలియర్లో కీలక సన్నివేశాలు తీస్తారు. ఆ తర్వాత తైవాన్లో చిత్రీకరణ జరపాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందట. సిద్ధార్థ్, రకుల్ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ ముఖ్య పాత్రధారులుగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. -
ప్రవీణ్కు స్వర్ణం
షాంఘై (చైనా): ప్రపంచ వుషు (మార్షల్ ఆర్ట్స్) చాంపియన్షిప్లో భారత ప్లేయర్ ప్రవీణ్ కుమార్ స్వర్ణం గెలిచాడు. బుధవారం జరిగిన 48 కేజీల సాండా ఈవెంట్ ఫైనల్లో ప్రవీణ్ 2–1తో దియాజ్ (ఫిలిప్పీన్స్)పై నెగ్గాడు. మహిళల సాండా ఈవెంట్లో పూనమ్ (75 కేజీలు), సనతోయ్ దేవి (52 కేజీలు) రజతాలు... పురుషుల 60 కేజీల ఈవెంట్లో విక్రాంత్ కాంస్యం సాధించారు. -
జ్ఞాపకశక్తి కోల్పోయా
నిన్న, మొన్న ఏం జరిగిందో, ఏం చేశామో మనకు ఒక్కోసారి గుర్తుకు రాకపోతేనే కంగారు పడతాం. అలాంటిది ఓ ఆర్నెల్ల పాటు జ్ఞాపకశక్తి కోల్పోతే? సినిమాల్లో ఇలా జరుగుతుంది కానీ నిజజీవితంలో జరుగుతుందా అనుకుంటున్నారా? హీరోయిన్ దిశా పాట్నీ లైఫ్లో ఇలా జరిగింది. తలకు తగిలిన గాయం వల్ల ఆమె ఓ ఆర్నెల్ల పాటు జ్ఞాపకశక్తిని కోల్పోయారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘లోఫర్’ సినిమాలో వరుణ్ తేజ్తో జోడీ కట్టిన ఈ బ్యూటీ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా తర్వాత బాలీవుడ్పై దృష్టి సారించారామె. తాను చేస్తున్న సినిమా విశేషాలు, జిమ్లో కసరత్తులు చేస్తున్న వీడియోలు, ఫిట్నెస్ విషయాల గురించి ఆమె సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. మూడేళ్లుగా దిశా జిమ్నాస్టిక్స్, మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. కాగా, ఓసారి జిమ్నాస్టిక్స్ చేస్తున్న సమయంలో ఆమె తల నేలకు తగలడంతో బలమైన గాయం తగిలింది. ఆ గాయం కారణంగా ఆమె ఆర్నెల్ల పాటు జ్ఞాపకశక్తిని కోల్పోయారు. ఆ విషయం గురించి దిశా మాట్లాడుతూ – ‘‘ఆర్నెల్ల జీవితాన్ని నేను కోల్పోయాను. ఎందుకంటే అంతకుముందు ఏం జరిగిందో ఆ ఆరు నెలల్లో గుర్తుకు రాలేదు’’ అన్నారు. ట్రీట్మెంట్తో మళ్లీ మామూలు మనిషి అయ్యారామె. ‘‘జిమ్నాస్టిక్స్, మార్షల్ ఆర్ట్స్ చేయాలంటే చాలా ధైర్యం, శక్తి, ఓపిక కావాలి. వర్కవుట్స్ చేసే టైమ్లో దెబ్బలు తగిలినప్పుడు మినహా మిగతా అన్నిరోజులూ చేయాల్సిందే. నేనివాళ ఇంత ఫిట్గా ఉండటానికి కారణం క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయడమే’’ అన్నారు దిశా. -
తెలంగాణ రాష్ట్ర మార్షల్ ఆర్ట్స్ జట్టు ప్రకటన
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫెడరేషన్ (ఏఐఎంఎంఏఎఫ్) ఆధ్వర్యంలో జరుగనున్న ఇంటర్నేషనల్ హెల్త్ స్పోర్ట్స్, ఫిట్నెస్ ఫెస్టివల్ చాంపియన్షిప్లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర జట్టును బుధవారం ప్రకటించారు. ఈ జట్టులో తెలంగాణ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫెడరేషన్ (టీఎంఎంఏఎఫ్)కు చెందిన ఏడుగురు క్రీడాకారులకు చోటు దక్కింది. ఫుర్కాన్ జునైదీ (57–61), రిషిరాజ్ (61–66), మీర్జా అస్లామ్ బేగ్ (57–61), మహేశ్ (74–44), సలేహ్ అల్ సాదీ (52–54), అవైజ్ ఖాన్ (52–54), సౌద్ అల్ ఖులాఖీ (66–70) రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు. ఈ జట్టుకు మేనేజర్గా సయ్యద్ జలాలుద్దీన్ జఫర్ వ్యవహరించనున్నారు. న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్లో శుక్ర, శని, ఆదివారాల్లో ఈ చాంపియన్షిప్ జరుగుతుంది. -
ధీరమణులు!
సాక్షి, సిటీబ్యూరో : కళ్లల్లో ఆత్మస్థైర్యం. కరాల్లో పటుత్వం. తొణికిసలాడే గుండె నిబ్బరం. కర్ర పట్టి గిరగిరా తిప్పారంటే శత్రువు వెన్నులో వణుకు పుట్టాల్సిందే. కరవాలం ఝళిపించారంటే వైరివర్గం గడగడలాడాల్సిందే. చదువులోనే కాదు సాములోనూ శక్తిస్వరూపిణులమేనని నిరూపిస్తున్నారు ఆ బాలికలు. కర్రసాము, ఖడ్గ విన్యాసాల్లో పురుషులకూ తీసిపోమంటున్నారు. తమపై చెయ్యి వేస్తే ‘చండీ ప్రచండుల’మేనంటున్నారు మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందుతున్న విద్యార్థినులు. పుస్తకాలు పట్టిన చేతులే కర్రలు, కత్తులు పట్టి పోరాడగలవని నిరూపిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సైదాబాద్లోని సెయింట్ మాజ్ స్కూల్ పీఈటీ అబ్దుర్ రెహమాన్కు 2003లో ఓ ఆలోచన వచ్చింది. తాను నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్తో పాటు కర్రసాము, ఖడ్గ విన్యాసాలను పాఠశాల విద్యార్థినులకు కూడా నేర్పించాలనుకున్నారు. ఈ శిక్షణ బాలికల ఆత్మవిశ్వాసం, స్వీయరక్షణకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఆయన భావించారు. అనుకున్నదే తడవుగా ఈ నిర్ణయాన్ని పాఠశాల నిర్వాహకుల ముందు పెట్టారు. దీనిని వారు బాలికల తల్లిదండ్రుల దృష్టికెళ్లారు. పలువురు ఇందుకు అభ్యంతరం వ్యక్తంచేశారు. మార్షల్ ఆర్ట్స్ శిక్షణ విషయం విద్యార్థినులకు తెలియడంతో కొంత మంది తమ తల్లిదండ్రులను ఒప్పించారు. దీంతో పీఈటీ అబ్దుర్ రెహమాన్ శిక్షణ ప్రారంభించారు. మహిళా దినోత్సవం రోజునే.. పాఠశాలలో 15 ఏళ్ల క్రితం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే సెయింట్ మాజ్ స్కూల్లో మార్షల్ ఆర్ట్స్లో విద్యార్థినులకు శిక్షణ ప్రారంభించారు. మొదట్లో ప్రాథమిక తరగతుల పిల్లలకు ఆ తర్వాత 10వ తరగతి చదివే అమ్మాయిలకు శిక్షణ మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ స్కూల్లో మార్షల్ ఆర్ట్స్ శిక్షణ కోసం ప్రత్యేకంగా ఓ పీరియడ్నే కేటాయించారు. సెయింట్ మాజ్ స్కూల్లో 15 ఏళ్ల క్రితం అమ్మాయిల కోసం ప్రాంభమైన మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ప్రస్తుతం పాతబాస్తీలోని చాలా పాఠశాలల్లో శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ శిక్షణ పూర్తి చేసిన పలువురు యువతులు శిక్షకులుగా కూడా పనిచేస్తున్నారు. అమ్మాయిల్లో మార్షల్ ఆర్ట్స్ శిక్షణ దేశంలోనే తొలిసారిగా మాజ్ స్కూల్లో ప్రారంభమైందని నిర్వాహకులు చెబుతున్నారు. మంచి స్పందన వస్తోంది.. మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ ఇవ్వడానికి బాలికల తల్లిదండ్రుల నుంచి చక్కటి స్పందన వచ్చింది. మా స్కూల్లో శిక్షణ పొందిన అమ్మాయిలు ఉత్తరాది రాష్ట్రాల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలుస్తుండటం ఎంతో గర్వకారణం. – ముహమ్మద్ ఇద్రీస్ అలీ,సెయింట్ మాజ్ స్కూల్ నిర్వాహకుడు వహ్వా.. ఫరీహా..! ఈ యువతి పేరు ఫరీహా తఫీమ్. బాలికలపై, యువతులపై, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను టీవీలో చూసి మనసు చలించిపోయింది. తనకూ ఇలాంటి పరిస్థితే ఎదురైతే ఏం చేయాలి అని ఆలోచించింది. స్వీయరక్షణకు దారులు వెతికింది. ఏడో తరగతిలో ఉండగా మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకుంటానని తల్లిదండ్రులతో పోరు పెట్టింది. వారు ససేమిరా అన్నారు. అయినా ఆమె తన పట్టు వీడలేదు. అమ్మాయిల ఆత్మరక్షణపై వారికి ఎంతో వివరించింది. దీంతో వారే సరేనన్నారు. ఇంకేముంది మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పూర్తి చేసుకుని ప్రస్తుతం విక్టోరియా మైదానంలో 50 మందికి శిక్షణ ఇస్తూ పలువురి చేత శెభాష్ అనిపించుకుంటోంది. స్వీయరక్షణకు ప్రాధాన్యమిచ్చి కరాటే, మార్షల్ ఆర్ట్స్ తదితర విద్యలు నేర్చుకోవాలని ఫరీహా తఫీమ్ సూచిస్తోంది.
Pagination
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ఇసుక అక్రమ తరలింపు కేసులో ఇద్దరికి జైలు శిక్ష
రైల్వే గేట్ తగిలి ఒకరికి తీవ్ర గాయాలు
కేసీఆర్ ఆత్మ విమర్శ చేసుకోవాలి: మండవ
చోరీ కే సులో ఇద్దరి అరెస్టు
రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు
వీడిన మిస్సింగ్ మిస్టరీ
వరుస నష్టాలకు బ్రేక్
నా గడ్డపైకొచ్చి నన్నే అవమానిస్తావా?
పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి 5.8 శాతం
వీక్షకులను ఇలా పెంచుకోవాలనుకోవడం కరెక్ట్ కాదేమో సార్!
తప్పక చదవండి
- 27 రోజులు.. 57 సభలు, రోడ్ షోలు
- మీ భూమి మీదే..
- బీజేపీ వస్తే రాజ్యాంగం రద్దు
- పసిడికి అక్షయ తృతీయ శోభ
- వరుస నష్టాలకు బ్రేక్
- కదిలించిన కడప చైతన్యం
- దభోల్కర్ హత్యోదంతంలో ఇద్దరికి జీవితఖైదు
- ముగిసిన కేసీఆర్ బస్సు యాత్ర
- Respect Pakistan: అయ్యర్ వీడియో కలకలం
- Lok Sabha Election 2024: లోక్సభ బరిలో ఖలిస్తాన్ మద్దతుదారులు
Advertisement