Chief Of Defence Staff(CDS)
-
కొన్ని జెట్లను కోల్పోయాం
సింగపూర్/న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాక్తో జరిగిన ఘర్షణల్లో మనకు వైమానికంగా నష్టం జరిగిందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ అంగీకరించారు. మన ఫైటర్ జెట్లను దాయాది కూల్చేసినట్టు వెల్లడించారు. షాంగ్రిలా డైలాగ్ నిమిత్తం సింగపూర్లో పర్యటిస్తున్న ఆయన శనివారం బ్లూంబర్గ్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. పాక్తో యుద్ధం భారత్ ఫైటర్ జెట్లను నష్టపోయిందా అన్న ప్రశ్నకు బదులుగా ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. అవి పెను రాజకీయ దుమారానికి దారితీశాయి. ఆపరేషన్ సిందూర్కు సంబంధించిన వాస్తవాలను మోదీ సర్కారు తొక్కిపెట్టిందనేందుకు ఇదే నిదర్శనమని కాంగ్రెస్ దుయ్యబట్టింది. సీడీఎస్ వ్యాఖ్యల నేపథ్యంలో మన యుద్ధ సన్నద్ధతపై స్వతంత్ర విచారణకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. ఈ మొత్తం ఉదంతంపై లోతుగా చర్చించేందుకు తక్షణం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ‘అణు’ స్థాయికి పోలేదు పాక్పై దాడుల సందర్భంగా యుద్ధ విమానాలను నష్టపోయినట్టు వాయుసేన గతంలోనే పరోక్షంగా అంగీకరించింది. పాక్ వైమానిక స్థావరాలపై దాడుల వివరాలను ఆర్మీ, నేవీ సైనిక ఆపరేషన్స్ డైరెక్టర్స్ జనరల్తో కలిసి వాయుసేన డీజీ ఎయిర్ మార్షల్ ఎ.కె.భారతి అప్పట్లో ఎప్పటికప్పుడు మీడియాకు వెల్లడించారు. మన ఫైటర్ జెట్లను కూల్చేశామన్న పాక్ ప్రకటన ఏ మేరకు వాస్తవమని మే 11 నాటి భేటీలో విలేకరులు ప్రశ్నించగా, ‘‘యుద్ధమన్నాక నష్టాలు సహజం. కాకపోతే మన పైలట్లంతా సురక్షితంగా తిరిగొచ్చారు. యుద్దం ఇంకా కొనసాగుతున్నందున మనం ఫైటర్ జెట్లను కోల్పోయామా అన్న ప్రశ్నకు ఈ దశలో బదులివ్వలేను’’ అని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో పాక్తో సాగిన ఆ నాలుగు రోజుల ఘర్షణల్లో మనకు నష్టం జరిగిందంటూ సైన్యం నుంచి ఇలా తొలిసారి స్పష్టమైన ప్రకటన వెలువడటం, అదీ స్వయానా త్రివిధ దళాలకు అధిపతి అయిన సీడీఎస్ నోటినుంచి రావడం విశేషం. అయితే మనం ఎన్ని విమానాలను నష్టపోయిందీ చెప్పేందుకు జనరల్ చౌహాన్ నిరాకరించారు. అంతేగాక ఆరు భారత యుద్ధ విమానాలను కూల్చేశామన్న పాక్ వాదన కూడా శుద్ధ అబద్ధమన్నారు. ‘‘తొలి దశలో, అంటే మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టిన రోజు నష్టాలు జరిగాయి. అయితే అసలు సమస్య యుద్ధ విమానాలను కోల్పోవడం కాదు. అలా జరగడం వెనక కారణాలను వీలైనంత త్వరగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. జరిగిన వ్యూహాత్మక తప్పిదాలను రెండు రోజుల్లోపే కనిపెట్టగలిగాం. కాబట్టే పొరపాట్లను వెంటనే సరిదిద్దుకుని యుద్ధ విమానాలన్నింటినీ తిరిగి రంగంలోకి దించాం. మే 8, 10 తేదీల్లో శత్రువును చావుదెబ్బ తీయగలిగాం. పాక్ లోలోపలికి చొచ్చుకుపోయి మరీ అత్యంత కచ్చితత్వంతో దాడులు చేశాం’’ అని ఆయన వివరించారు. ‘‘చైనా అందజేసిన భారీ ఆయుధాలు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు పాక్ను ఏ మాత్రమూ ఆదుకోలేకపోయాయి. వాటి గురించి పాక్ చెప్పుకున్న గొప్పలన్నీ వట్టివేనని మన దాడులు రుజువు చేశాయి. ఎందుకంటే పాక్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను తుత్తునియలు చేస్తూ దాని భూభాగంలో 300 కి.మీ. లోపలి దాకా అత్యంత కచ్చితత్వంతో కూడిన దాడులు చే శాం’’ అన్నారు. పాక్తో ఘర్షణ ఏ దశలోనూ అణుయుద్ధానికి దగ్గరగా రాలేదని స్పష్టం చేశారు. పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా మే 7న భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టడం తెలిసిందే. పాక్, పీఓకేల్లోని 9 ఉగ్ర శిబిరాలు, శిక్షణ కేంద్రాలను బ్రహ్మో స్ తదితర అత్యాధునిక క్షిపణులతో నామరూపాల్లేకుండా చేసింది. మర్నాడు పాక్ డ్రోన్లు తదితరాలతో సరిహద్దు గ్రామాలు, పట్టణాలపై ప్రతీకార దాడులకు దిగింది. బదులుగా మన సైన్యం పాక్లో కి 11 కీలక వైమానిక స్థావరాలను నేలమట్టం చేసింది. నాలుగు రోజుల ఘర్షణల అనంతరం ఇరుదేశా లు కాల్పుల విరమణకు అంగీకరించాయి. పాక్ సై న్యం విజ్ఞప్తి మేరకే అందుకు ఒప్పుకున్నట్టు భారత్ పేర్కొనగా తానే ఒప్పందం కుదిర్చానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకున్నారు.స్వదేశీ శక్తికి తార్కాణం రక్షణ రంగంలో భారత్ సాధించిన స్వావలంబనకు ఆపరేషన్ సిందూర్ అద్దం పట్టిందని సీడీఎస్ జనరల్ చౌహాన్ అభిప్రాయపడ్డారు. సింగపూర్లో జరిగిన ఆసియా స్థాయి రక్షణ శిఖరాగ్ర సదస్సు షాంగ్రిలా డైలాగ్ను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఆకాశ్ వంటి పూర్తి దేశీయ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు పాక్ దాడులను అత్యంత సమర్థంగా అడ్డుకుని తిప్పికొట్టాయని గుర్తు చేశారు. గగనతల రక్షణకు విదేశాల సాయంపై ఆధారపడకుండా సొంతంగా అభివృద్ధి చేసుకున్న దేశవ్యాప్త సమీకృత రాడార్ వ్యవస్థ అద్భుతంగా రాణించి సత్తా చాటిందన్నారు. దాయాది విద్వేష మంత్రం శాంతి కోసం భారత్ ఎన్ని ప్రయత్నాలు చేసినా బదులుగా పాక్ విద్వేషమే వెల్లగక్కిందని సీడీఎస్ జనరల్ చౌహాన్ దుయ్యబట్టారు. ‘‘2014లో ప్రధాని నరేంద్ర మోదీ పాక్కు స్నేహ హస్తం సాచారు. రెండు చేతులు కలవనిదే చప్పట్లు అసాధ్యం. ఇలాంటి పరిస్థితుల్లో పాక్ను దూరం పెట్టడమే సరైన వ్యూహం. ఇప్పుడు భారత్ చేస్తున్నది అదే’’ అని వివరించారు. ‘‘స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో సామాజికంగా, ఆర్థికంగా, తలసరి ఆదాయంలోనూ పాక్ మనకంటే చాలా ముందంజలో ఉంది. కానీ ఇప్పుడు ప్రతి రంగంలోనూ మనం పాక్ అందుకోలేనంతగా ప్రగతి సాధించాం’’ అని గుర్తు చేశారు.దేశాన్ని తప్పుదోవ పట్టించిన కేంద్రం: కాంగ్రెస్ పాక్తో జరిగిన సాయుధ ఘర్షణ విషయంలో మోదీ సర్కారు దేశాన్ని తప్పుదోవ పట్టించిందంటూ కాంగ్రెస్ మండిపడింది. అది దాచేసిన నిజాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయని ఫైటర్ జెట్లను కోల్పోయామన్న సీడీఎస్ ప్రకటనను ఉద్దేశించి అభిప్రాయపడింది. పాక్తో నాలుగు రోజుల ఘర్షణలో ఎంత నష్టం జరిగిందో వాస్తవాలు వెల్లడించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. ‘‘సీడీఎస్ ప్రకటన నేపథ్యంలో సిందూర్కు సంబంధించి ఎన్నో కీలక సందేహాలు తలెత్తుతున్నాయి. వాటన్నింటికీ సమాధానాలు లభించాలంటే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలే ఏకైక మార్గం. కాబట్టి తక్షణం వాటిని ఏర్పాటు చేయాలి. అంతేకాదు, మన యుద్ధ సన్నద్ధతపై స్వతంత్ర కమిటీతో దర్యాప్తు జరిపించాలి’’ అంటూ ఎక్స్ పోస్ట్లో పేర్కొన్నారు. కార్గిల్ యుద్ధంపై కూడా వాజ్పేయి సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం కమిటీ వేసి సమీక్ష జరిపిందని గుర్తు చేశారు. ‘‘మన వీర పైలట్లు ప్రాణాలకు తెగించి దేశ గౌరవాన్ని కాపాడారు. వారికి వందనం’’ అంటూ ఖర్గే కొనియాడారు. -
పాక్ సైన్యంతో ప్రమాదమే: సీడీఎస్
న్యూఢిల్లీ: పొరుగుదేశం పాకిస్తాన్ ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నప్పటికీ, ఆ దేశ ఆర్మీతో మనకు ప్రమాదంఎప్పటిలాగానే ఉందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ వ్యాఖ్యానించారు. పాక్ సైనిక సామర్థ్యం చెక్కు చెదరలేదని చెప్పారు. అయితే సరిహద్దులను, ముఖ్యంగా వివాదాస్పద ఉత్తర సరిహద్దులను కాపాడుకోగల సత్తా మన సైన్యానికి ఉందని శనివారం ఇండియా టుడే కాంక్లేవ్లో చెప్పారు. ‘చైనా బలపడుతుండటం, ఆ దేశంతో తెగని సరిహద్దు వివాదం మనకు తక్షణ సవాలుగా మారింది. చైనా, పాక్ మనకు బద్ధ శత్రువులు. పైగా వీరివద్ద అణ్వాయుధాలున్నాయి. యుద్ధ రీతుల్లో ఎప్పటికప్పుడు అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మన ఆర్మీకి ఇదే అతి పెద్ద సవాల్గా మారింది. కొత్త ఆయుధ వ్యవస్థలను సమకూర్చుకోవడం, సాంకేతికతను అందిపుచ్చుకోవడం, వ్యూహాలు, ప్రతివ్యూహాలను రచించుకోవడం వంటివి కొనసాగుతున్నాయి’’ అని జనరల్ చౌహాన్ చెప్పారు. -
‘చైనా, పాక్ స్నేహం.. భారత్కు సవాలే’
ఢిల్లీ: చైనా దుందుడుకు చర్యలు, అదేవిధంగా డ్రాగన్ దేశం పాకిస్తాన్తో కొనసాగిస్తున్న స్నేహం భారత్కు సవాల్గా మారుతోందని చీఫ్ ఆప్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ అన్నారు. ఆ రెండు దేశాల స్నేహం భారత్ భద్రతా బలగాలకు ఛాలెంజ్ విసురుతోందని పేర్కొన్నారు. ఇండియా టుడే కాన్క్లేవ్లో పాల్గొన్న అనిల్ చౌహాన్ పలు విషయాలు పంచుకున్నారు. పాక్, చైనా దేశాల మధ్య స్నేహం రోజురోజుకు హిమాలయాలంత ఎత్తు.. సముద్రమంత లోతుకు విస్తరిస్తోందని అన్నారు. అదే విధంగా ఆ రెండు దేశాలు కూడా అణు సామర్థ్యం కలిగి ఉన్నాయని తెలిపారు. కానీ, ఈ సవాళ్లు తాము ముందునుంచి ఊహిస్తున్నవేనని ఈయన స్పష్టం చేశారు. మరికొన్ని ఊహించని పరిణామాలు యుద్ధ వాతావరణాన్ని కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. ఇక.. పాకిస్తాన్ ఆర్మీని తేలికగా తీసుకుంటున్నామన్న విషయాన్ని ఆయన తోసిపుచ్చారు. ఇటీవల తీవ్రమైన ఆర్థిక, రాజకీయ సంక్షోభాలతో కొట్టుమిట్టాడిన పాక్.. ఇప్పుడిప్పుడే అన్ని రకాలుగా స్థిరత్వాన్ని పొందుతుందన్న విషయాన్ని వెల్లడించారు. ఎప్పటికప్పుడు పాకిస్తాన్ ఆర్మీ తన సత్తా కోల్పోకుండా కాపాడుకుంటోందని తెలిపారు. తద్వారా పాక్తో భారత్కు ముప్పు వాటిల్లే అవకాశం లేకపోలేదని అనిల్ చౌహన్ పేర్కొన్నారు. అయితే భారత్ సైన్యం సైతం ఎప్పటికప్పుడు తన సామర్థాన్ని పెంచుకుంటోందని స్పష్టం చేశారు. -
సీడీఎస్గా జనరల్ చౌహాన్ బాధ్యతలు
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత సీనియర్ కమాండర్, ఈస్టర్న్ ఆర్మీ మాజీ కమాండర్ జనరల్ చౌహాన్ కొత్త చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) అయ్యారు. దేశ మొట్టమొదటి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ 9 నెలల క్రితం తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన స్థానం జనరల్ చౌహాన్ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. దేశం ముందున్న భవిష్యత్ భద్రతా సవాళ్లకు త్రివిధ దళాలను సన్నద్ధం చేయడం, ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన థియేటర్ ప్లాన్ను అమలు చేయడం జనరల్ అనిల్ చౌహాన్ ప్రధాన లక్ష్యాలు. ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ మిలటరీ ఎఫైర్స్కు సెక్రటరీగాను ఆయన వ్యవహరిస్తారు. సరిహద్దుల్లోని తూర్పు లద్దాఖ్లో డ్రాగన్ దేశంతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో చైనా వ్యవహారాల్లో నిపుణుడిగా పేరున్న జనరల్ చౌహాన్ను అత్యున్నత హోదాలో కేంద్రం నియమించడం గమనార్హం. ‘భారత సైనిక బలగాల్లో అత్యున్నత హోదాను చేపట్టినందుకు గర్వంగా ఉంది. త్రివిధ దళాలు నాపై ఉంచిన అంచనాలను అందుకునేందుకు నా వంతు కృషి చేస్తాను. అన్ని సవాళ్లను, ఇబ్బందులను కలిసికట్టుగా ఎదుర్కొంటాం’ అని ఈ సందర్భంగా జనరల్ చౌహాన్ అన్నారు. రైజినా హిల్స్లోని సౌత్ బ్లాక్ వద్ద జరిగిన కార్యక్రమంలో జనరల్ చౌహాన్ త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. 1961లో జన్మించిన జనరల్ చౌహాన్ 1981లో భారత సైన్యంలోని 11 గూర్ఖా రైఫిల్స్లో చేరారు. -
బిపిన్ రావత్ తర్వాత సీడీఎస్గా అనీల్ చౌహాన్
సాక్షి, న్యూఢిల్లీ: జనరల్ బిపిన్ రావత్ మరణానంతరం సుమారు 9 నెలల తర్వాత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్)ను నియమించింది కేంద్ర ప్రభుత్వం. బిపిన్ రావత్ తర్వాత సీడీఎస్గా లెఫ్టినెట్ జనరల్ అనిల్ చౌహాన్(రిటైర్ట్) పేరును ప్రకటించింది. లెఫ్టినెంట్ జనరల్ చౌహాన్ 2021, మే నెలలో తూర్పు కమాండ్ చీఫ్గా విధులు నిర్వర్తిస్తూ పదవీ విరమణ చేశారు. సైన్యంలో పలు ఉన్నత పదవులను నిర్వర్తించారు చౌహాన్. జమ్ముకశ్మీర్, ఈశాన్య ప్రాంతాల్లో ఉగ్రకార్యకలాపాలను నిలువరించటంలో విస్తృత అనుభవం ఉంది. త్రివిద దళాలను ఏకతాటిపైకి తేవాలనే ఉద్దేశంతో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ను ఏర్పాటు చేసింది కేంద్రం. దేశ తొలి సీడీఎస్గా జనరల్ బిపిన్ రావత్ 2020, జనవరిలో బాధ్యతలు చేపట్టారు. అయితే.. 2021 డిసెంబర్లో తమిళనాడులో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మిలిటరీ హెలికాప్టర్లో వెళుతుండగా ప్రమాదం జరిగి రావత్, ఆయన భార్య ప్రాణాలు కోల్పోయారు. వారితో పాటు మరో 11 మంది మరణించారు. అప్పటి నుంచి సీడీఎస్ పోస్ట్ ఖాళీగానే ఉంది. దాదాపు 9 నెలల తర్వాత కొత్త సీడీఎస్ను నియమించింది కేంద్రం. ఇదీ చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష బరిలో దిగ్విజయ్ సింగ్? -
CDS India: ఆచితూచి అడుగేయాలి!
ఎట్టకేలకు రథం కదిలింది. దేశ రక్షణలో కీలకమైన ‘ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్’ (సీడీఎస్) పదవిని భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాగైతేనేం ఒక అడుగు ముందుకు వేసింది. దేశంలోని ఈ ఉన్నత సైనిక పదవిని చేపట్టేందుకు అవకాశాలను విస్తృతం చేస్తూ, సరికొత్త మార్గదర్శకాలను మంగళ వారం విడుదల చేసింది. భారత తొలి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మరణించిన ఆరు నెలల తర్వాతైనా కొత్త సీడీఎస్ కోసం సర్కారు శ్రద్ధ పెట్టడం హర్షణీయం. అయితే, త్రివిధ దళాలకూ, దళాధిపతులకూ మధ్య సమన్వయానికి ఉద్దేశించిన ఈ పదవికి పెట్టిన కొత్త నిబంధనలే కాస్తంత తికమక తెస్తున్నాయి. పదాతి, నౌకా, వైమానిక దళాలలో దేనికీ అధిపతిగా పదవిని చేపట్ట లేకపోయిన వారు సైతం తాజా నిబంధనలతో తమ సీనియర్లను దాటుకొని, ఆ పైన ఉండే సీడీఎస్ పగ్గాలు పట్టేందుకు వీలు చిక్కుతుంది. అదే ఇప్పుడు భిన్నాభిప్రాయాలకూ, చర్చకూ తావిస్తోంది. భారత తొలి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి గత డిసెంబర్ 8న తమిళ నాడులో జరిగిన సైనిక హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. రావత్ సహా డజను మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన ఆ ఘటన తర్వాత నుంచి ఇన్నాళ్ళుగా మరో సీడీఎస్గా ఎవరినీ ప్రభుత్వం నియమించ లేదు. ఇప్పుడు కొత్త మార్గదర్శకాల ప్రకారం సర్వీసులో ఉన్న, లేదా రిటైరైన త్రివిధ దళాల ఛీఫ్లు, వారి వైస్ ఛీఫ్లలో ఎవరైనా సరే సీడీఎస్గా అర్హులే. కాకపోతే వారి వయస్సు 62 ఏళ్ళ లోపుండాలి. అలాగే, అవసరాన్ని బట్టి సీడీఎస్ పదవీ కాలాన్ని గరిష్ఠంగా 65 ఏళ్ళ వయసు వరకు పొడిగించవచ్చు. ఈ మేరకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ మార్పులు చేర్పులు ప్రకటించింది. అందుకు అవసరమైన రీతిలో ఆర్మీ, నౌకాదళం, వైమానిక దళాలకు చెందిన మూడు వేర్వేరు చట్టాల కింద ఒకే రకమైన నోటిఫికేషన్లు జారీ చేసింది. త్రివిధ దళాధిపతులకు పెద్ద తలకాయగా, దళాలన్నీ సమన్వయంతో పనిచేసేలా చూడడం సీడీఎస్ బాధ్యత. సర్వసాధారణంగా త్రివిధ దళాల అధిపతులు మూడేళ్ళ వరకు, లేదంటే 62 ఏళ్ళ వయస్సు వరకే ఆ హోదాలో ఉంటారు. ఆర్మీ ఛీఫ్గా రిటైరైన రావత్ ఆపైన భారత తొలి సీడీఎస్గా ఉన్నత పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆ రకంగా ఆయన ఆ పదవి చేపట్టేటప్పుడు, సర్వీసులో ఉన్న ఛీఫ్లు అందరి కన్నా వయసులోనూ, హోదాలోనూ పెద్ద. దాంతో, ఇబ్బంది లేకుండా పోయింది. కానీ, మారిన నిబంధనలతోనే తంటా. ఇప్పుడిక నాలుగు స్టార్లుండే త్రివిధ దళాధిపతులతో పాటు, వారి కన్నా దిగువ హోదాలోని మూడు స్టార్ల అధికారులు సైతం ఒకే ఉన్నత హోదాకు పోటీ పడతారన్న మాట. ఏ కారణం వల్లనైనా దళాధిపతి కాలేక, మూడు స్టార్ల హోదాకే పరిమిత మైనవారు సైతం ఏకంగా సీడీఎస్ పదవి చేపట్టే ఛాన్స్ ఉంది. అదే జరిగితే, త్రివిధ దళాధిపతులకు తమ దిగువ ఉద్యోగే దాదాపు బాస్. అందరూ సమానులే అనుకున్నా, ఎంతైనా సీడీఎస్ కొద్దిగా ఎక్కువ సమానం కాబట్టి, పరిస్థితి తేడాపాడాగా తయారవుతుంది. అప్పుడిక సర్వీసులోని నాలుగు స్టార్ల దళాధిపతులు ఆ నియమిత వ్యక్తికి నివేదించడం ఇబ్బందికరమే! నిజానికి, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అనేక దేశాలు జాతీయ స్థాయిలో రకరకాల పేర్లతో సీడీఎస్ను పెట్టుకున్నాయి. పేర్లు వేరైనా, అన్నిచోట్లా విధులు దాదాపు ఒకటే. బ్రిటన్లో 1959లోనే ఈ నియామకం చేశారు. అయితే, ఈ సీనియర్ మోస్ట్ సైనిక హోదా మనకు కొత్త. 1999లో కార్గిల్ యుద్ధం తర్వాత భారత రక్షణ వ్యవస్థలోని లోటుపాట్ల అధ్యయనానికి ఆనాటి ప్రభుత్వం ఓ ఉన్నత స్థాయి కమిటీ వేసింది. రక్షణ మంత్రికి ఏక కేంద్రక సైనిక సలహాదారుగా సీడీఎస్ను నియమిం చాలని ఆ కమిటీ సిఫార్సు చేసింది. దీర్ఘకాలం పెండింగ్లో ఉన్న ఆ సిఫార్సును మూడేళ్ళ క్రితం కేంద్రం అమలులోకి తెచ్చి, ఆర్మీ మాజీ ఛీఫ్ రావత్ను దేశ తొలి సీడీఎస్గా నియమించింది. రక్షణ శాఖలోని సైనికవ్యవహారాల విభాగాన్ని సీడీఎస్ నడుపుతారు. దశాబ్దాలుగా దేనికదిగా పని చేస్తున్న సైనిక దళాలను అనుసంధానించి, మెరుగైన సమన్వయంతో పురోగమించేలా చూస్తారు. త్రివిధ దళాలు కలసి శత్రువుపై పోరాడేలా కొత్త సైనిక కమాండ్ల ఏర్పాటు సంస్కరణలూ దీనిలో భాగమే! ఖండాంతర ప్రపంచ సవాళ్ళ సందర్భంగా అమెరికాలో సత్ఫలితాలిచ్చిన ఈ సీడీఎస్ విధానం మన సైన్యాన్ని కూడా మరింత కేంద్రీకృతంగా, ప్రభావశీలంగా తీర్చిదిద్దుతుందని రక్షణ నిపుణుల మాట. ఆ మాటకొస్తే పార్లమెంటరీ స్థాయీ సంఘమే ఒప్పుకున్న పదేళ్ళ క్రితం నాటి లోటుపాట్లతో పోలిస్తే, ఇప్పుడు మన సైనికదళాల సన్నద్ధత మెరుగైంది. సీడీఎస్ పదవీ సృష్టి సైతం కీలక మార్పే. అయితే, రావత్ మరణానంతరం కొత్త నియామకానికి ఇంత తాత్సారం చేయడం సరికాదు. ఫలితంగా, దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సైనిక సంస్కరణలు ముందుకు సాగలేదు. తీరా ఇప్పుడు కొత్త మార్గదర్శకాలతో సీడీఎస్ హోదాయే పలుచనయ్యే ప్రమాదం వచ్చి పడింది. అందుకే, సర్కారు అలక్ష్యం వీడి, ఆచితూచి అడుగేయాలి. త్వరితగతిన నియామకం ఎంత అవసరమో, దేశ రక్షణ, రక్షణ దళాల ప్రయోజనాలను కాపాడేలా పర్యాలోచించి, నిర్ణయించడమూ అంతే అవసరమని గ్రహించాలి. 2018 నుంచి పెండింగ్లో ఉన్న జాతీయ భద్రతా వ్యూహాన్ని సైతం తొందరగా తెర పైకి తేవాలి. ప్రశ్నార్థకమయ్యే సీడీఎస్ నియామకాలు జరిగితే, సైన్యాన్ని సదా సర్వసన్నద్ధంగా ఉంచే అసలు లక్ష్యం పక్కకు పోతుంది. రక్షణ దళాల మధ్య సమశ్రుతి తప్పుతుంది. మన పొరుగున చైనా, పాకిస్తాన్ లాంటి ప్రతికూల దేశాలు పొంచివున్నాయి. తస్మాత్ జాగ్రత్త!