ఢిల్లీ: భారత తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)గా లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి (రిటైర్డ్)ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఆయన రక్షణ వ్యవహారాల విభాగం (డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్) కార్యదర్శిగానూ వ్యవహరించనున్నారు.
మరోవైపు చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్గా వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ నియమితులయ్యారు. ఈ నెల 31న ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. కాగా, ప్రస్తుత ప్రస్తుత సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ మే 30న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఆయన స్థానంలో రాజా సుబ్రమణి బాధ్యతలు చేపట్టనున్నారు.
ప్రస్తుతం ఎన్ఎస్ రాజా సుబ్రమణి జాతీయ భద్రతా మండలి కార్యదర్శిత్వంలో (ఎన్ఎస్సీఎస్) సైనిక సలహాదారుగా విధులు నిర్వర్తిస్తున్నారు. అంతకుముందు 2024 జూలై 1 నుంచి 2025 జూలై 31 వరకు భారత సైన్య ఉప ప్రధానాధికారిగా (వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్) పనిచేశారు. అలాగే 2023 మార్చి నుంచి 2024 జూన్ వరకు సెంట్రల్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్గా సేవలందించారు.


