న్యూఢిల్లీ: భారత నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)గా జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. సాయుధ దళాల ఆధునీకరణ, త్రివిధ దళాల మధ్య సమన్వయం, ఏకీకరణను పెంపొందించే దిశగా సంస్థాగత సంస్కరణల కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా రాజా సుబ్రమణి వ్యాఖ్యానించారు. మన సాయుధ దళాల్లో స్వదేశీ ఆయుధాల అభివృద్ధి, ఉపయోగాన్ని వేగవంతం చేస్తామని అన్నారు.
జాతీయ ప్రయోజనాలను కాపాడటంలో భారత సాయుధ దళాలు నిరంతరం వృత్తి నైపుణ్యాన్ని, దృఢ దీక్షను ప్రదర్శించాయని కొనియాడారు. దేశ సార్వ¿ౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించడానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. సుబ్రమణి 1985 డిసెంబర్ 14న ఆయన భారత సైన్యంలో చేరారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఇండియన్ మిలటరీ అకాడమీలో శిక్షణ పొందారు.
2023 మార్చి నుంచి 2024 జూన్ దాకా సెంట్రల్ కమాండ్లో జనరల్ ఆఫీసర్ కమాండింగ్– ఇన్–చీఫ్గా వ్యవహరించారు. జమ్మూకశ్మీర్, అస్సాంలో క్లిష్టమైన సైనిక ఆపరేషన్లలో పాల్గొన్నారు. ఎన్నో కీలక ఆపరేషన్లకు నాయకత్వం వహించారు. 2024 జూలై 1 నుంచి 2025 జూలై 31 దాకా వైస్ చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్గా సేవలందించారు. కేంద్ర ప్రభుత్వం ఆయనను పరమ విశిష్ట సేవా మెడల్, అతి విశిష్ట సేవా మెడల్, సేనా మోడల్, విశిష్ట సేవా మెడల్లతో సత్కరించింది.


