ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా భూ కుంభకోణం వ్యవహారం రాజ్యసభను కుదిపేసింది.
గత కొన్నాళ్లుగా సమైక్యాంధ్ర నినాదాలతో దద్దరిల్లి, పదే పదే వాయిదాల పర్వంతో నడిచిన రాజ్యసభ మంగళవారం మరో అంశం కారణంగా వాయిదా పడింది. ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా భూ కుంభకోణం వ్యవహారం రాజ్యసభను కుదిపేసింది. సభ ఉదయం 11 గంటలకు సమావేశం కాగానే బీజేపీ సభ్యులు ఒక్కసారిగా ఈ అంశాన్ని లేవనెత్తారు. ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా చేసిన ఆరోపణలపై చర్చకు ఆమోదించాలని డిమాండ్ చేశారు. దీనికోసం ప్రశ్నోత్తరాల సమయాన్ని సస్పెండ్ చేయాలని బీజేపీ సభ్యుడు ప్రకాష్ జవదేకర్ నోటీసు ఇచ్చారు.
సభా కార్యకలాపాలను సజావుగా నడవనివ్వాలని చైర్మన్ హమీద్ అన్సారీ పదే పదే బీజేపీ సభ్యులకు విజ్ఞప్తి చేసినా కూడా వారు పట్టించుకోలేదు. ప్రతి ఒక్క నిబంధనను, ప్రతి ఒక్క సంప్రదాయాన్నీ సభ్యులు ఉల్లంఘిస్తున్నారని, గౌరవనీయులైన సభ్యులు సభను అరాచకాల మయంగా చేయాలనుకుంటే ఏమీ చేయలేనంటూ తీవ్ర నిస్సహాయత వ్యక్తం చేస్తూ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.