కోర్టులో నటుడు పృథ్వీరాజ్‌కు చుక్కెదురు! | Sakshi
Sakshi News home page

కోర్టులో నటుడు పృథ్వీరాజ్‌కు చుక్కెదురు!

Published Thu, Jun 29 2017 1:28 PM

కోర్టులో నటుడు పృథ్వీరాజ్‌కు చుక్కెదురు! - Sakshi

విజయవాడ: విభేదాలతో వేరుగా ఉంటున్న తన భార్యకు నెలకు రూ. 8 లక్షల చొప్పున భరణం చెల్లించాలని ప్రముఖ టాలీవుడ్‌ హాస్యనటుడు పృథ్వీరాజ్‌కు ఫ్యామిలీ కోర్టు ఆదేశాలు జారీచేసింది. పృథ్వీరాజ్‌ తనను నిర్లక్ష్యం చేస్తూ మానసికంగా వేధిస్తున్నారంటూ సెక్షన్‌ 498 ఏ గృహహింస చట్టం కింద ఆయన భార్య శ్రీలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత జనవరి నుంచి ఈ కేసును విజయవాడ ఫ్యామిలీ కోర్టు విచారణ నడుస్తున్నప్పటికీ, ఎన్నడూ పృథ్వీరాజ్‌ కోర్టు విచారణకు హాజరుకాలేదు.

పృథ్వీరాజ్‌, శ్రీలక్ష్మికి 1984లో పెళ్లయింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పృథ్వీరాజ్‌ కుటుంబం మొదట విజయవాడలో నివసించేంది. పృథ్వీరాజ్‌ కు సినిమాల్లో బ్రేక్‌ వచ్చిన తర్వాత ఆయన కుటుంబం హైదరాబాద్‌కు తరలివచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో భారీ డిమాండ్‌ ఉన్న కమెడియన్లలో పృథ్వీరాజ్‌ ఒకరు. ముఖ్యంగా ’ఖడ్గం’ సినిమాలో ‘థర్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ’ డైలాగ్‌తో పృథ్వీరాజ్‌ లైమ్‌లైటులోకి వచ్చారు.  ఇటీవలికాలంలో పృథ్వీరాజ్‌ తనను నిర్లక్ష్యం చేస్తూ.. మనసిక క్షోభకు గురిచేస్తున్నారని, ఇక ఆయనతో కలిసి ఉండటం తనకు సాధ్యం కాదని శ్రీలక్ష్మి కోర్టుకు తెలిపారు. భర్త ఆదాయ వివరాలను కోర్టుకు సమర్పించిన ఆమె.. తనకు నెల రూ. 10 లక్షల భరణం ఇవ్వాల్సిందిగా కోర్టును కోరారు. అయితే, పృథ్వీరాజ్‌ ఆదాయ మార్గాలను పరిశీలించిన కోర్టు నెలకు రూ. 8 లక్షలు భరణం చెల్లించాలని గురువారం ఆదేశాలు జారీచేసింది.

Advertisement
Advertisement