
ఫేస్బుక్లో పోస్టు చేశాడని.. మరణదండన!
సోషల్ మీడియాలో ఆరోపణలతో ఓ వ్యక్తికి మరణదండన విధించడం ఇదే తొలిసారి..
లాహోర్: ఫేస్బుక్లో దైవదూషణ చేస్తూ పోస్టులు పెట్టాడన్న కారణంతో ఓ వ్యక్తికి పాకిస్థాన్లోని ఉగ్రవాద నిరోధక కోర్టు ఏకంగా మరణదండన విధించింది. సోషల్ మీడియాలో దైవదూషణ ఆరోపణలతో ఓ వ్యక్తికి మరణదండన విధించడం ఇదే తొలిసారి. సోషల్ మీడియాలో దైవదూషణ చేసేవారిపై నవాజ్ షరీఫ్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ కఠినమైన తీర్పు వెలువడటం గమనార్హం.
మహమ్మద్ ప్రవక్త, ఆయన భార్యలు, సహచరులను ఉద్దేశించి కించపరిచే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో 30 ఏళ్ల తైమూర్ రజా అనే వ్యక్తికి బహవాల్పూర్లోని ఉగ్రవాద నిరోధక కోర్టు మరణదండన విధించింది. పంజాబ్ ప్రావిన్స్ రాజధాని లాహోర్కు 500 కిలోమీటర్ల దూరంలో బలవాల్పూర్ ఉంది. సోషల్ మీడియాలో దైవదూషణ ఆరోపణలతో ఓ వ్యక్తికి మరణదండన విధించడవం ఇదే తొలిసారి అని ప్రభుత్వ ప్రాసిక్యూటర్ షఫిక్ ఖురేషి తెలిపారు. దైవదూషణ కేసును ఉగ్రవాద నిరోధక కోర్టు విచారించడం కూడా అరుదైన విషయం కావడం గమనార్హం. దైవదూషణ, విద్వేష ప్రసంగాలతో ఉగ్రవాద అభియోగాలకు కూడా పాల్పడ్డాడని అతనిపై ఆరోపణలు మోపారని, అందుకే ఉగ్రవాద నిరోధక కోర్టు అతన్ని విచారించిందని ఖురేషి వివరించారు.
ముస్లిం మెజారిటీ దేశమైన పాకిస్థాన్లో దైవదూషణ అనేది చాలా సున్నితమైన అంశం. దేశంలో ఎవరైనా మహమ్మద్ ప్రవక్తను దూషిస్తే మరణ దండన విధిస్తారు. ఇప్పటికే డజన్లకొద్ది ప్రజలు దైవదూషణ ఆరోపణలపై మరణదండన ఎదుర్కొని.. అమలు కోసం ఎదురుచూస్తున్నారు. దైవదూషణ ఆరోపణలు సైతం పాక్లో అలర్లు, హింసకు దారితీసి పలువురి ప్రాణాల్ని పొట్టనబెట్టుకున్నాయి.
ఇక దైవదూషణ ఆరోపణలతో మరణదండన ఎదుర్కొంటున్న తమూర్ రజా షియా వర్గానికి చెందిన వాడు. సున్నీ ఇస్లాం సంప్రదాయాన్ని కచ్చితంగా పాటించే డీయోబనీ తెగకు వ్యతిరేకంగా అతను విద్వేష ప్రసంగాలు చేసినట్టు కోర్టులో అభియోగాలు మోపారు. పాక్లో సున్నీ, షియాల మధ్య సంబంధాలు ఉప్పు-నిప్పులా ఉన్నాయి. ఈ రెండు తెగల మధ్య విద్వేషాగ్నిని రగిల్చడానికి సున్నీ ఉగ్రవాద గ్రూపులైన లష్కరే-ఏ-జాంఘ్వీ వంటివి నిత్యం ప్రయత్నిస్తూ హింసకు కారణమవుతున్నాయి.