పాకిస్థాన్ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ దాదాపు 9రోజులపాటు సరిహద్దులో దుందుడుకుగా కాల్పులకు పాల్పడిన పాకిస్థాన్ తాజాగా కాస్త వెనక్కు తగ్గింది.
జమ్మూ/ఇస్లామాబాద్: పాకిస్థాన్ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ దాదాపు 9రోజులపాటు సరిహద్దులో దుందుడుకుగా కాల్పులకు పాల్పడిన పాకిస్థాన్ తాజాగా కాస్త వెనక్కు తగ్గింది. జమ్మూ, సాంబ జిల్లాల పరిధిలోని సరిహద్దులో ఈ నెల 8-9తేదీల మధ్యరాత్రంతా కాల్పులు జరగనేలేదని, భారతసైన్యం ప్రతిఘటనతో పాక్ కాల్పుల జోరుకు కళ్లెం పడిందని బీఎస్ఎఫ్ ప్రతినిధి శుక్రవారం చెప్పారు. గురువారం రాత్రి కథువా జిల్లాలోని హీరానగర్ సెక్టార్లో 4 బీఎస్ఎఫ్ స్థావరాలు లక్ష్యంగా కేవలం 20నిమిషాలసేపు పాక్ కాల్పులను మినహాయిస్తే, గత రెండురోజులుగా కాల్పులు ఆగిపోయాయన్నారు.
ఉద్రిక్తత సడలించాలి: పాక్
ఉభయదేశాల మధ్య అధీనరేఖవద్ద ఉద్రిక్తతల సడలింపునకు తక్షణం చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్ భారత్ను కోరింది. తమతమ సామార్థ్యాలేమిటో ఉభయపక్షాలకు అవగాహన ఉందని, యుుద్ధం సరైన ప్రత్యామ్నాయం కాబోదని అందువల్ల ఉద్రిక్తతలను సడలించాలని పరోక్షంగా అణ్వస్త్ర సామర్థ్యాన్ని ప్రస్తావిస్తూ పాక్ వ్యాఖ్యానించింది. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ అధ్యక్షతన జాతీయ భద్రతా వ్యవహారాల కమిటీ సమావేశం అనంతరం పాకిస్థాన్ ఈ ప్రకటన చేసింది. భారత్తో సాధారణ సంబంధాలు ఉండాలన్నదే తమ కోరిక అని పాక్ తన ప్రకటనలో తెలిపింది.