కొత్త రాష్ట్రాల డిమాండ్లు పెరిగాయి: కేంద్ర హోం శాఖ | Increased demands for the creation of new states:Home Ministry | Sakshi
Sakshi News home page

కొత్త రాష్ట్రాల డిమాండ్లు పెరిగాయి: కేంద్ర హోం శాఖ

Aug 4 2013 3:30 PM | Updated on Sep 1 2017 9:38 PM

కొత్త రాష్ట్రాల ఏర్పాటు చేయాలంటూ దేశావ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి డిమాండ్లు వస్తున్నాయని కేంద్ర హోం మంత్రిత్వశాఖ తెలిపింది.

కొత్త రాష్ట్రాల ఏర్పాటు చేయాలంటూ దేశావ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న డిమాండ్లు పెరిగాయని  కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆయా డిమాండ్లకు సానుకులంగా స్పందిస్తే భారత్లో మరో 20కి పైగా కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని తెలిపింది. దీంతో భారత్లో  రాష్ట్రాల సంఖ్య 50కి చేరుతుందని పేర్కొంది.

ఇప్పటికే మణిపూర్లో కూకీలాండ్, తమిళనాడులో కొంగునాడు, కర్ణాటకలో తుళునాడు, ఉత్తర బెంగాల్లో కామత్పూర్ ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్లు చేస్తున్నాయని చెప్పింది. అయితే దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ను నాలుగు రాష్ట్రాలుగా... అవధి ప్రదేశ్, పూర్వాంచల్, బుందేల్ఖండ్, పశ్చిమాంచల్గా విభజించాలని ఆ రాష్ట్ర నేతలు డిమాండ్ చేస్తున్న సంగతిని ఈ సందర్బంగా కేంద్రహో మంత్రిత్వశాఖ గుర్తు చేసింది.

వీటితోపాటు ఉత్తరప్రదేశ్లోని అగ్రా డివిజన్, రాజస్థాన్లోని భరత్పూర్, గ్వాలియర్లను కలపి బ్రజ్ ప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని, అలాగే పశ్చిమ ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలను కలపి ఓ రాష్ట ఏర్పాటు చేయాలంటూ పలు సంఘాలు, సంస్థలు తమకు వినతి పత్రాలు అందజేశాయని తెలిపింది. అలాగే మహారాష్టలో విదర్భ ప్రాంతాన్ని కూడా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని గత ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్న సంగతిని ప్రస్తావించింది.

అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు చేస్తామని సీడబ్ల్యూసీ నిర్ణయించింది. దాంతో తమకు కూడా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలంటూ దేశంలోని అసోం, డార్జిలీంగ్ తదితర ప్రాంతాలలో ఆందోళనలు, నిరసనలు మిన్నంటిన సంగతి తెలిసిందే. కాగా విదర్భ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని మహారాష్టలోని అమరావతి జిల్లా పరిషత్ ఆదివారం తీర్మానం చేయడం గమనార్హం. 

Advertisement
 
Advertisement
Advertisement