పోలీసుశాఖకు అరకొర కేటాయింపులే
బడ్జెట్ ప్రసంగంలో క్రెడిట్ చోరీకి యత్నం
సాక్షి, అమరావతి: రెడ్బుక్ అమలుకు పోలీసువ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో శాంతి–భద్రతలపై శీతకన్ను వేసింది. మహిళల భద్రత, పోలీసుశాఖ ఆధునికీకరణ, డ్రగ్స్ మాఫియా కట్టడి వంటి అంశాలను గాలికివదిలేసింది. 2026–27 వార్షిక బడ్జెట్లోహోంశాఖకు కేవలం రూ.9,165 కోట్లు మాత్రమే కేటాయించింది. అందులో సింహభాగం పోలీసుశాఖ జీతభత్యాలు, సాధారణ నిర్వహణ ఖర్చులకే సరిపోనుంది.
కేటాయింపుల్లో ప్రధానమైనవి ఇలా..
మహిళాభద్రత కోసం గత బడ్జెట్లో రూ.10.01 కోట్లు కేటాయించిన ప్రభుత్వం కేవలం రూ.3.20 కోట్లే వెచ్చించింది. ఈ ఏడాది కేటాయింపు కేవలం రూ.3.20కోట్లు కావడం గమనార్హం. n రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న గంజాయి, డ్రగ్స్ దందాను కట్టడి చేయడంపై ప్రభుత్వం ఆసక్తి చూపించలేదు. నార్కోటిక్స్ ఆపరేషన్లకు అవసరమైన వ్యవస్థ బలోపేతం కోసం గత బడ్జెట్లో రూ.61 కోట్లు కేటాయించి కేవలం రూ.22కోట్లే ఖర్చు చేసింది.
» ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపులే రూ.30 కోట్లకు పరిమితం చేసింది.
» కేంద్ర నిధులకు మ్యాచింగ్ గ్రాంట్గా రాష్ట్రం కేటాయించాల్సిన నిధులపై ముఖం చాటేసింది. ఫోరెన్సిక్ విభాగానికి మౌలిక సదుపాయాల కల్పనకు కూడా నిధులు కేటాయించలేదు.
బడ్జెట్ ప్రసంగంలో క్రెడిట్ చోరీ
మరోవైపు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చేసిన పనులను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగంలో కూటమి ప్రభుత్వ ఘనతగా చెప్పుకోవడం విస్మయపరిచింది. రాష్ట్రంలో 5,757మంది పోలీస్ కానిస్టేబుళ్ల నియామకం కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసి ప్రిలిమినరీ పరీక్షలు కూడా నిర్వహించింది.
అప్పట్లో టీడీపీ ఆ నియామక ప్రక్రియకు వ్యతిరేకంగా తమ సానుభూతిపరులతో కోర్టుల్లో కేసులు వేయించింది. టీడీపీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ కేసులను ఉపసంహరించారు. దాంతో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి మార్గం సుగమమైంది. అవి కూడా తామే భర్తీ చేసినట్టు పయ్యావుల కేశవ్ చెప్పడం విడ్డూరంగా ఉంది.
» శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో కొత్తగా 4 ఏపీఎస్పీ బెటాలియన్ల ఏర్పాటుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆ ఘనత కూడా చంద్రబాబు ప్రభుత్వానిదేనని పయ్యావుల కేశవ్ క్రెడిట్ చోరీకి యతి్నంచారు.


