తగిన నిధులు కేటాయించని బాబు సర్కార్
ఫిబ్రవరి గణాంకాల ప్రకారం వార్షికంగా రూ.31,584 కోట్లు అవసరం
కానీ బడ్జెట్ కేటాయించింది కేవలం రూ.27,719 కోట్లు
ప్రస్తుత పింఛన్లలో 8 లక్షల కోత పెడితేనే ఈ నిధులు సరిపోయే అవకాశం
సాక్షి, అమరావతి: బాబు సర్కార్ బడ్జెట్ ప్రకారం 2026–27 ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది లక్షల పింఛన్లకు కోత పడే పరిస్థితి నెలకొంది. గత 20 నెలలుగా గొప్పగా ప్రచారం చేసుకుంటున్న పింఛన్ల పథకానికీ ప్రభుత్వం బడ్జెట్లో తగిన నిధులు కేటాయించకపోవడం దీనికి కారణం. 2026 ఫిబ్రవరిలో ప్రభుత్వం పింఛన్ లబ్ధిదారులకు రూ.2,632.04 కోట్లు (రూ. 2,724.09 కోట్లు పంపిణీ చేస్తామని ముందు ప్రకటించింది) పంపిణీ చేసింది.
ఈ లెక్కన ఏడాదికి రూ. 31,584 కోట్లు నిధుల అవసరం ఉంటుంది. తాజా బడ్జెట్లో కేవలం 27,719 కోట్లు మాత్రమే కేటాయించింది. అంటే అవసరానికన్నా 4 వేల కోట్లు తక్కువ. దీంతో ఇప్పుడు పింఛన్లు తీసుకుంటున్న లబ్ధిదారుల సంఖ్య ఇకపై 8 లక్షలు తగ్గితేనే ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించిన నిధులు సరిపోతాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
50 ఏళ్లకే పింఛన్.. ‘హామీకే సరి’
ఎన్నికలప్పుడు చంద్రబాబు ఇచ్చిన ‘50 ఏళ్లకే పింఛన్’ హామీ.. కేవలం ప్రకటనలకే పరిమితమని బడ్జెట్ కేటాయింపులు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం 60 ఏళ్లు దాటిన వారు వృద్ధాప్య పింఛన్లకు అర్హులు. అయితే చంద్రబాబు ఎన్నికల ముందు ఎస్సీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్లు అన్న హమీని ప్రకటించారు. తాజా కేటాయింపులు చూస్తే ఈ హామీ అమలు లేనట్లేనని తేలిపోయింది.
కొత్త పింఛన్లకు ఆన్లైన్ ప్రక్రియ నిలిపివేత
» చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గత 20 నెలల్లో 60 ఏళ్లు నిండిన నిరుపేదలకు, వితంతువులకు కొత్త పింఛన్లు మంజూరు కాకపోగా, కనీసం పింఛన్కు దరఖాస్తు చేసుకునే అవకాశమూ లేకుండా పోయింది.
» కొత్త పింఛన్ల మంజూరు కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే ప్రక్రియ నిలిచిపోయింది.
» గత జగన్ ప్రభుత్వ హయాంలో అర్హులు ఏడాదిలో ఏ రోజైన తమ ఊరిలోని గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉండేది.
» ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని గ్రామ,వార్డు సచివాలయాల్లో ఆ సేవలు నిలిచిపోయాయి. సచివాలయాల్లో గానీ, మండల కార్యాలయాల్లో గానీ నేరుగా దరఖాస్తు అందజేయాలన్నా వీలుకాని పరిస్థితి.
» 2024 జనవరి ఆరంభంలోనూ అప్పటి ప్రభుత్వం అర్హులైన అవ్వాతాతలకు కొత్త పింఛన్లు మంజూరు చేసింది.
» ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వరకు సైతం ఆన్లైన్ వెబ్పోర్టల్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో కొత్త పింఛన్ల మంజూరు దరఖాస్తుల స్వీకరణ కొనసాగింది.
» అప్పట్లో ప్రభుత్వానికి అందిన రెండున్నర లక్షల మంది పింఛన్ దరఖాస్తులు పెండింగ్లోనే ఉన్నాయి.
ఇప్పటికే ఐదున్నర లక్షల పింఛన్లు కోత
వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ ఇవ్వగా.. చంద్రబాబు ప్రభుత్వం వాటిలో ఇప్పటికే ఐదున్నర లక్షలకు పైగా కోతవేసింది. జగన్ ప్రభుత్వంలో దేశంలో మరే రాష్ట్రంలో లేనట్టుగా అత్యధికంగా 66,34,742 మంది లబ్ధిదారులు పింఛన్ పొందారు.
చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లో ఈ సంఖ్య ప్రతి నెలా తగ్గుతూనే ఉంది. ఈ ఫిబ్రవరిలో పంపిణీ జరిగిన 60.19 లక్షలు చూస్తే, చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఏకంగా ఐదున్నర లక్షల దాకా పింఛన్ల సంఖ్య తగ్గిపోయినట్టు అర్థమవుతోంది. లక్ష వరకు దివ్యాంగుల పింఛన్లు కోత పెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ‘రీ వెరిఫికేషన్’ నిర్వహిస్తోందన్న విమర్శలున్నాయి.


