
ఒక్కటైతేనే.. ‘ఉగ్ర’ అంతం
ఆంటల్యా: ఫ్రాన్స్ రాజధాని పారిస్పై ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తూ.. ఉగ్రవాదంపై పోరాటానికి ప్రపంచం సమైక్యంగా చర్యలు చేపట్టడం అత్యవసరమని భారత ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు.
- ప్రపంచదేశాలకు భారత ప్రధాని మోదీ పిలుపు
- టైస్టులకు నిధులు, ఆయుధాలు, సాంకేతికత అందనివ్వొద్దు
- సమన్వయం, సహకారంతో కలసికట్టుగా పోరాడాలి
- బ్రిక్స్కు, జీ 20కి ఉగ్రవాదంపై పోరే తక్షణ లక్ష్యం కావాలి
ఆంటల్యా: ఫ్రాన్స్ రాజధాని పారిస్పై ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తూ.. ఉగ్రవాదంపై పోరాటానికి ప్రపంచం సమైక్యంగా చర్యలు చేపట్టడం అత్యవసరమని భారత ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ‘ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మానవాళి మొత్తం ఏకమవ్వాలి. ఉగ్రవాదంపై పోరాడటానికి ప్రపంచం సమైక్యంగా కృషి చేయటం ఇప్పుడు అత్యవసరం’ అని స్పష్టం చేశారు.
ఉగ్రవాదులకు నిధులు, ఆయుధాలు, సమాచార సాధనాలు అందకుండా చర్యలు తీసుకోవాలని, ఉగ్ర సంస్థలు సైబర్ నెట్వర్క్ను ఉపయోగించుకోకుండా అంతర్జాతీయ స్థాయిలో సహకారాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. టర్కీలో బ్రిక్స్ దేశాధినేతల భేటీలో, అనంతరం జీ 20 సదస్సులో చేసిన ప్రసంగాల్లో మోదీ ఉగ్రవాదంపై ఐక్య, సమగ్ర పోరు అవసరాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. పారిస్ మారణహోమం నేపథ్యంలో.. బ్రిక్స్ భేటీలో, జీ 20 సదస్సులో ఉగ్రవాదంపై పోరు అంశమే కేంద్ర స్థానం ఆక్రమించింది. టైజంపై పోరు బ్రిక్స్ ప్రాధాన్యతాంశాల్లో ఒకటి కావాలని బ్రిక్స్ దేశాధినేతల భేటీలో మోదీ స్పష్టం చేశారు.
‘జీ 20’లో మాట్లాడుతూ.. ‘పారిస్లో జరిగిన విషాదకర ఉగ్రదాడి నీడలో ఈ సదస్సులో పాల్గొంటున్నాం. ఆ ఘటనతో అంతా బాధకు, షాక్కు, ఆగ్రహానికి గురయ్యాం. పారిస్ దాడిని, అంకారా, లెబనాన్లలో ఇటీవలి దాడులను ఐక్యంగా ఖండిస్తున్నాం. సినాయ్లో విమాన కూల్చివేత ఘటనలో రష్యన్ల మృతిపై రష్యా ఆవేదనను పంచుకుంటున్నాం. ఇవన్నీ మనం ఎదుర్కొంటున్న చీకటి శక్తుల గుర్తులు’ అన్నారు. ‘ఉగ్రవాదం మనమెదుర్కొంటున్న అతిపెద్ద సవాలు. దానివల్ల ప్రాణాలే కాదు.. ఆర్థిక వ్యవస్థా దెబ్బతింటుంది. అది జీవనశైలినీ ప్రభావితం చేస్తుంది. దాన్ని అంతమొందించేందుకు ప్రపంచ దేశాల సమగ్ర, ఐక్య స్పందన అవసరం. ఉగ్రవాదంపై రాజీలేని పోరే జీ 20 దేశాల ప్రాథమ్యం కావాలి’ అని మోదీ పిలుపునిచ్చారు.
ఉగ్రవాదంపై జీ 20 తీర్మానం
పారిస్పై ఉగ్ర మూకల రాక్షస దాడుల నేపథ్యంలో.. టైజంపై పోరును అంతర్జాతీయ స్థాయిలో ఐక్యంగా, అత్యవసరంగా తీవ్రం చేయాల్సి ఉందని జీ 20 దేశాధినేతలు పేర్కొన్నారు. 20 అగ్ర ఆర్థిక వ్యవస్థల(జీ 20) దేశాధినేతల సదస్సు టర్కీలో ఆదివారం ప్రారంభమైంది. సమ్మిళిత ఆర్థిక వృద్ధి, వాతావరణ మార్పులపై చర్చలకు ఉద్దేశించిన ఈ సదస్సులో ఉగ్రవాదమే కేంద్ర స్థానం ఆక్రమించింది. ఈ నేపథ్యంలో.. జీ 20 దేశాలు సోమవారం ఉగ్రవాదంపై ఒక తీర్మానాన్ని ఆమోదించనున్నాయి. ఉగ్రవాదంపై పోరులో మెరుగైన సమన్వయం, నిధులు అందకుండా అడ్డుకునే దిశగా దేశాల మధ్య సమాచార మార్పిడి, ఉగ్రవాదానికి ఊతమిచ్చే పరిస్థితులను మార్చేందుకు సమగ్ర విధానం.. మొదలైన వాటిని ఆ తీర్మానంలో పొందుపర్చనున్నారు.
ఈ ఉగ్రవాద తీర్మానానికి సంబంధం లేకుండా సదస్సు ప్రధాన ప్రకటన వేరేగా ఉంటుందని అధికారులు తెలిపారు. అలాగే, ఐసిస్ లాంటి ఉగ్రవాద సంస్థలకు మద్దతుదారులు నగదును పంపించడాన్ని అడ్డుకునే దిశగా ‘ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్’ ఇచ్చిన సిఫారసులను త్వరితగతిన ఆమోదించడం, ఉగ్రసంస్థల ఆర్థిక వనరుగా ఉపయోగపడ్తున్న చమురు బ్లాక్ మార్కెట్ను అంతం చేయడం, సమాచార సాంకేతికతను ఉగ్రవాదులు ఉపయోగించుకోకుండా నిరోధించడం.. తదితర అంశాలను చర్చల అనంతరం జీ 20 దేశాలు సంయుక్తంగా విడుదల చేసే ప్రకటనలో పేర్కొననున్నారు. అలాగే, ఉగ్రవాదంపై పోరులో ‘అంతర్జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కూటమి’ని ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని బ్రిక్స్ నేతలు భేటీ అనంతరం విడుదల చేసిన ప్రకటనలో నొక్కి చెప్పారు.