గోదావరి పుష్కరాల్లో భాగంగా ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు సుమారు 30లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలచారి అన్నారు.
భద్రాచలం : గోదావరి పుష్కరాల్లో భాగంగా ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు సుమారు 30లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలచారి అన్నారు. ఖమ్మం జిల్లా భద్రాచలం ఆర్డీఓ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కుంభమేళా తరహాలో పుష్కరాలు నిర్వహిస్తోందన్నారు. బాసర, ధర్మపురి, కాళేశ్వరం, భద్రాచలం పుష్కర ఘాట్లలో ఇప్పటివరకు 3.40కోట్ల మంది స్నానాలు ఆచరించారన్నారు.
రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అన్ని హక్కులు, నిధుల కేటాయింపుపై పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించి చర్చకు తీసుకొచ్చే విధంగా పోరాడతామన్నారు. హైకోర్టు విభజనపై కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందని, దీనిపై పార్లమెంట్లో ప్రస్తావిస్తామన్నారు. కేంద్రం రాష్ట్రానికి మంజూరు చేసిన రూ.12వేల కోట్ల నిధులు విడుదల చేయలేదని వేణుగోపాలచారి తెలిపారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.