
సీఎం హిట్లర్కన్నా హీనం
ముఖ్యమంత్రి కేసీఆర్ హిట్లర్ కన్నా హీనంగా వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారని తెలంగాణ టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు.
* విపక్షాల గొంతు నొక్కేస్తున్నారు: ఎర్రబెల్లి
* సభ కేసీఆర్ కుటుంబ అసెంబ్లీగా మారిపోయిందని విమర్శ
* రేవంత్ వ్యాఖ్యలు తప్పని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తాం
* టీ సర్కార్ తప్పులు బయటపడతాయనే టీడీపీ సభ్యుల సస్పెన్షన్
* ప్రభుత్వంపై, స్పీకర్పై త్వరలో అవిశ్వాసం పెడతామని వెల్లడి
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ హిట్లర్ కన్నా హీనంగా వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారని తెలంగాణ టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు. కేసీఆర్ కుమార్తె తప్పును విపక్షం ప్రశ్నిస్తే.. అధికారపక్షం ఎదురుదాడికి దిగడం సరికాదని విమర్శించారు. రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు తప్పని రాష్ట్ర ప్రభుత్వం నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తామని పేర్కొన్నారు. అసెంబ్లీ వద్ద ఆందోళన చేసి, అరెస్టైన అనంతరం గోషామహల్ పోలీస్స్టేషన్ వద్ద ఎర్రబెల్లి విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ కుమార్తె, ఎంపీ కవిత సమగ్ర సర్వేలో రెండుచోట్ల తన పేరు నమోదు చేసుకున్నారని తమ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలకు టీడీపీ కట్టుబడి ఉందని ఆయన చెప్పారు.
రేవంత్ చేసిన వ్యాఖ్యలకు ఆధారాలను సైతం స్పీకర్కు సమర్పించామని, ఆ వ్యాఖ్యలు తప్పని రాష్ట్ర ప్రభుత్వం నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తామని ఎర్రబెల్లి పేర్కొన్నారు. రాష్ట్ర అసెంబ్లీ కేసీఆర్ కుటుంబ అసెంబ్లీగా మారిందని... విపక్షాలు ఏ శాఖకు సంబంధించిన ప్రశ్నలు లేవనెత్తినా... కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, అల్లుడు హరీశ్రావులే సమాధానాలు చెబుతున్నారని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఐదు నెలల పాలనలో ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని.. టీఆర్ఎస్కు ఎందుకు ఓటేశామా? అని ప్రజలు బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ హిట్లర్ కన్నా హీనంగా వ్యవహరిస్తున్నారని, ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు మాట్లాడితే అధికారపక్షం నోరునొక్కేస్తోందని ఎర్రబెల్లి ధ్వజమెత్తారు.
ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని.. తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ సీఎం హయాంలోనూ ఇలాంటి ఘటన చోటుచేసుకోలేదని మండిపడ్డారు. సర్వేలో కేసీఆర్ కుమార్తె రెండుచోట్ల పేరు నమోదు చేసుకుందని పేర్కొంటే... మహిళల హక్కులను కాలరాస్తున్నారంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాద్ధాంతం చేశారని విమర్శించారు. మరి టీఆర్ఎస్ అధికారం చేపట్టిన తర్వాత మహిళలపై అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలు పెరిగినా మంత్రులు, ఎమ్మెల్యేలు పెదవి విప్పలేదేమని ప్రశ్నించారు. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించి టీడీపీ ఎమ్మెల్యేలను వారం పాటు సస్పెండ్ చేశారని ఎర్రబెల్లి ఆరోపించారు. అసెంబ్లీలో ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వ తప్పుడు విధానాలు, అవినీతి బయటపడుతుందన్న భయంతోనే అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే టీఆర్ఎస్ ప్రభుత్వంపై, స్పీకర్పై అవిశ్వాస తీర్మానం పెడతామని చెప్పారు. దీనిపై శుక్రవారం గవర్నర్ను కలిసి విన్నవిస్తామని.. రుజువు కోసం అసెంబ్లీ సమావేశాల వీడియో క్లిప్పింగ్లను ఆయనకు సమర్పిస్తామని పేర్కొన్నారు.