కంప్యూటర్‌ సైన్సే కింగ్‌!

Computer Science is the King - Sakshi

ఇంజనీరింగ్‌ తొలిదశ ప్రవేశాల కౌన్సెలింగ్‌లో అత్యధిక ఆప్షన్లు సీఎస్‌ఈకే

ఆ కోర్సువైపే మొగ్గు చూపిన 45,514 మంది విద్యార్థులు

వివిధ కాలేజీల్లో సీఎస్‌ఈ సీటు కోసం 9,50,748 ఆప్షన్లు నమోదు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఎప్పటిలాగే ఈసారి కూడా కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ (సీఎస్‌ఈ) కోర్సువైపే ఎక్కువ మంది విద్యార్థులు మొగ్గు చూపారు. ఎంసెట్‌ ప్రవేశాల కమిటీ ఇటీవల ప్రకటించిన మొదటి దశ ప్రవేశాల్లో అత్యధికం మంది విద్యార్థులు సీఎస్‌ఈలో సీట్లు పొందేందుకే వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 183 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో కన్వీనర్‌ కోటాలో 65,444 సీట్లు అందుబాటులో ఉండగా 53,934 మంది విద్యార్థులే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. వారిలో 52,628 మంది విద్యార్థులు మాత్రమే సీట్ల కోసం వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. వెబ్‌ ఆప్షన్లు ఇచ్చిన వారిలో అత్యధికంగా 45,514 మంది విద్యార్థులు కంప్యూటర్‌ సైన్స్‌లో సీటు కోసం వివిధ కాలేజీల్లో 9,50,748 ఆప్షన్లు ఇచ్చుకున్నారు.

ఆ తరువాత ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌లో (ఈసీఈ) సీట్ల కోసం 35,937 మంది విద్యార్థులు 6,09,278 ఆప్షన్లను ఇచ్చుకున్నా రు. ఇక మూడో స్థానంలో ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ నిలిచింది. అందులో సీట్ల కోసం 21,646 మంది విద్యార్థులు 2,84,064 వెబ్‌ ఆప్షన్లను ఇచ్చుకున్నారు. ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌లో చేరేందుకు 20,410 మంది, సివిల్‌ ఇంజనీరింగ్‌లో చేరేందుకు 16,608 మంది, మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో చేరేందుకు 14,612 మంది విద్యార్థులు వెబ్‌ ఆప్షన్లను ఇచ్చుకున్నారు. 

ఐదు కొత్త కోర్సులు హౌస్‌ఫుల్‌.. 
రాష్ట్రంలోని పలు కాలేజీలు ఈసారి ఐదు కోర్సులను ప్రవేశపెట్టాయి. ప్రపంచవ్యాప్తంగా ఎంతో డిమాండ్‌ ఉన్న ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, మెషీన్‌ లెర్నింగ్‌ వంటి సబ్జెక్టులతో కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ కోర్సుతోపాటు కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ బిజినెస్‌ సిస్టమ్స్, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ (నెట్‌వర్క్స్‌)ను అందుబాటులోకి తెచ్చాయి.  ఏఐ కోర్సు కన్వీనర్‌ కోటాలో 84 సీట్లు అందుబాటులోకి ఉండగా వాటిల్లో చేరేందుకు 2,256 మంది విద్యార్థులు 3,580 వెబ్‌ ఆప్షన్లను ఇచ్చుకున్నారు.

కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌లో 42 సీట్లు అందుబాటులోకి రాగా 135 మంది విద్యార్థులు వెబ్‌ ఆప్షన్లను ఇచ్చుకున్నారు. కంప్యూ టర్‌ సైన్స్‌ అండ్‌ బిజినెస్‌ సిస్టమ్స్‌లో 42 సీట్లు ఉంటే వాటిల్లో చేరేందుకు 1,781 మంది విద్యార్థులు వెబ్‌ ఆప్షన్లను ఆచ్చుకు న్నారు. కంప్యూటర్స్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ (నెట్‌వర్క్స్‌)లో 42 సీట్లు ఉంటే 476 మంది వెబ్‌ ఆప్షన్లను ఇచ్చుకున్నారు. కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీలో 42 సీట్లు అందుబాటులోకి రాగా, వాటిల్లో చేరేందుకు 1,644 మంది విద్యార్థులు వెబ్‌ ఆప్షన్లను ఇచ్చుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ ఉండటంతో దీనికి ఆప్షన్లు ఇచ్చుకుంటున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top