కోవిడ్‌ వ్యర్థాలివే... | 100 Tunnes COVID 19 Wastage Stock in Hyderabad | Sakshi
Sakshi News home page

కోవిడ్‌ వ్యర్థాలు @ 100 టన్నులు

Jun 24 2020 12:43 PM | Updated on Jun 24 2020 1:09 PM

100 Tunnes COVID 19 Wastage Stock in Hyderabad - Sakshi

సాక్షి,సిటీబ్యూరో: కోవిడ్‌ వ్యర్థాలు వంద టన్నులు దాటాయి.  ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న తరహాలోనే కోవిడ్‌ మహమ్మారి సోకిన రోగులు వాడిపడేసిన జీవ వ్యర్థాలు సైతం దడపుట్టిస్తున్నాయి.  ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా రోజుకు  సుమారు ఒక టన్నుకు పైగానే ఈ వ్యర్థాలు ఉత్పన్నమౌతున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, ప్రాంతాల్లోని 12 ప్రభుత్వ ఆస్పత్రులు, 128 క్వారంటైన్‌ కేంద్రాలు, 7 నమూనా సేకరణ కేంద్రాలు, 10 ల్యాబ్‌ల నుంచి నిత్యం కోవిడ్‌ జీవ వ్యర్థాలను సేకరిస్తున్నారు. వీటిని రాష్ట్రంలోని 11 కామన్‌ బయో మెడికల్‌ వేస్ట్‌ ట్రీట్‌మెంట్‌ సెంటర్లకు తరలించి పర్యావరణానికి హాని కలగని రీతిలో నిర్వీర్యం చేస్తున్నారు. ఈ వ్యర్థాలను సేకరించేందుకు సుమారు 55 ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేయడం గమనార్హం. కోవిడ్‌  పంజా విసిరిన మార్చి 29 నుంచి జూన్‌ 22 వరకు సుమారు 100 టన్నుల వ్యర్థాలను సేకరించి ఆయా కేంద్రాలకు తరలించినట్లు పీసీబీ వర్గాలు తెలిపాయి. ఇందులో అత్యధికంగా గాంధీ ఆస్పత్రి నుంచి 50  టన్నుల జీవ వ్యర్థాలను సేకరించామన్నారు.

కోవిడ్‌ వ్యర్థాలివే...
కోవిడ్‌ సోకిన రోగులకు ఆస్పత్రులు, క్వారంటైన్‌ కేంద్రాల్లో వాడిన మాస్క్‌లు, గ్లౌస్‌లు, దుస్తులు, మలమూత్రాలు, సిరంజిలు, కాటన్, పర్సనల్‌ ప్రోటెక్షన్‌ ఎక్విప్‌మెంట్‌(పీపీఈ)కిట్లు, మెడిసిన్స్‌ కవర్స్‌ తదితరాలను కోవిడ్‌ వ్యర్థాలుగా పరిగణిస్తున్నారు. ఈ వ్యర్థాల పరిమాణం రోజురోజుకూ పెరుగుతూనే ఉండడం గమనార్హం. వీటిని నిర్లక్ష్యంగా ఇతర జీవ వ్యర్థాలతోపాటే పడవేస్తే వ్యాధి విజంభించే ప్రమాదం పొంచి ఉండడంతో పీసీబీ వర్గాలు,శుద్ధి కేంద్రాల నిర్వాహకులు వీటిని ప్రత్యేక శ్రద్ధతో సేకరించి జాగ్రత్తగా శుద్ధి కేంద్రాలకు తరలిస్తుండడం విశేషం.

వ్యర్థాల శుద్ధి అంతా ప్రత్యేకం..
కోవిడ్‌ సోకిన రోగులతోపాటు వారు వాడి పడేసిన వ్యర్థాలను సైతం అంతే జాగ్రత్తగా శుద్ధి చేస్తున్నారు. ప్రధానంగా జీవ వ్యర్థాలను శుద్ధి చేసే కామన్‌ బయోమెడికల్‌ వేస్ట్‌ ట్రీట్‌మెంట్‌ కేంద్రాలు మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట, నిజామాబాద్, వనపర్తి, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, యాదాద్రి జిల్లాల్లో 11 వరకు ఉన్నాయి. 55 ప్రత్యేక వాహనాల ద్వారా ఈ కేంద్రాలకు నిత్యం కోవిడ్‌ వ్యర్థాలు చేరుతున్నాయి. వీటిని రెండు విడతలుగా ప్రత్యేక యంత్రాల్లో కాల్చి బూడిద చేస్తున్నారు. ఆ తర్వాత ఈ బూడిదను దుండిగల్‌లోని హజార్డస్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ కేంద్రానికి తరలించి అక్కడ బూడిదను మళ్లీ వివిధ రసాయనాలతో శుద్ధిచేసి  ప్రత్యేక బాక్సుల్లో నిల్వచేసి భూమిలో అత్యంత లోతున పూడ్చివేస్తున్నారు.

పలువురిపై కోవిడ్‌ పంజా..
కోవిడ్‌ వ్యర్థాలను శుద్ధి చేస్తున్న 11 కామన్‌ బయో మెడికల్‌ వేస్ట్‌ ట్రీట్‌మెంట్‌ కేంద్రాల్లో సుమారు 200 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వ్యర్థాల తరలింపు, శుద్ధిచేస్తున్న సుమారు 25 మందికి కోవిడ్‌ సోకినట్లు పీసీబీ వర్గాలు తెలిపాయి.  వీరంతా తమ ప్రాణాలను ఫణంగా పెట్టి విధి నిర్వహణలో ఉన్నందున తమకు కూడా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వైద్యసిబ్బందికి అందజేస్తున్న బీమా, ఇతర వసతులు కల్పించాలని ఆయా సిబ్బంది ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement