సీబీఐకి స్వతంత్ర హోదా కల్పించాలి | Reveal shortlisted names for CBI Director's post: Prashant Bhushan | Sakshi
Sakshi News home page

సీబీఐకి స్వతంత్ర హోదా కల్పించాలి

Nov 30 2014 12:14 AM | Updated on Apr 4 2018 7:42 PM

సీబీఐపై ప్రభుత్వ నియంత్రణ లేకుండా స్వతంత్ర హోదా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రస్తుతం సీబీఐ ప్రభుత్వ ఆధీనంలోనే పనిచేస్తోందని ఆమ్‌ఆద్మీ పార్టీ

 న్యూఢిల్లీ: సీబీఐపై ప్రభుత్వ నియంత్రణ లేకుండా స్వతంత్ర హోదా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రస్తుతం సీబీఐ ప్రభుత్వ ఆధీనంలోనే పనిచేస్తోందని ఆమ్‌ఆద్మీ పార్టీ నాయకుడు ప్రశాంత్ భూషణ్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.  ప్రస్తుతం ఉన్న సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా డిసెంబర్ 2వ తేదీన పదవీ విరమణ చేయనున్నార ని, అయినప్పటికీ ఆ పోస్టుకు పేర్లను ప్రకటించడంలో ఎందుకు జాప్యం చేస్తోందని మండిపడ్డారు. సీబీఐ నూతన డెరైక్టర్ నియామకంలో పారదర్శకంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ‘ సీబీఐ నూతన డెరైక్టర్ నియమించే విషయమై కనీస పారదర్శక పాటించాలన్నారు.
 
 కానీ ప్రభుత్వాలు మారినప్పుడల్లా వారి సౌకర్యం కోసం బలహీనమైన, అవినీతి అధికారులను ఈ పోస్టులో నియమించి తమ పబ్బం గడుపుకొంటాయని, ఇది పాలకపక్షంతోపాటు ప్రతిపక్షానికి కూడా సౌకర్యవంతంగా ఉంటోందనే విషయం ఎన్నోసార్లు రుజువైందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నో అవినీతి కేసుల్లో కూరుకుపోయారని, అందుకే ఆ పార్టీ కూడా ఆ పోస్టులో నీతిమంతుడు, బలమైన వ్యక్తిని నియమించాలని కోరుకోవడం లేదని భూషణ్ ఆరోపించారు. అదేవిధంగా సీబీఐ స్వతంత్రహోదాలో పనిచేస్తూనే, లోక్‌పాల్ పరిధిలో ఉండేలా చూడాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. 2జీ స్పెక్ట్రామ్ కేసులో నిందితులను రక్షించడానికి ప్రయత్నించారనే ఆరోపణలపై సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హాను సస్పెండ్ చేయకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉండాల్సి ఉందని కేంద్రం చర్యలను తప్పుబట్టారు. సిన్హాపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం, నేర విచారణ చర్యలకు పూనుకోరాదని, కానీ కేంద్రం పై రెండింటిని చేపట్టి తప్పు చేసిందని అన్నారు. ఈ విషయమై ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాయనున్నట్లు చెప్పారు.
 
 వాద్రా అధికార దుర్వినియోగం
 కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని శనివారం బెంగళూరులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) నాయకుడు ప్రశాంత్ భూషణ్ మీడియాతో మాట్లాడుతూ  ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా ఒక ప్రైవేట్ ఎయిర్ లైన్స్ వద్ద ఉచితంగా ఆయనకు, కుటుంబ సభ్యులకు ప్రయాణ టిక్కెట్లు, ఇతర సౌకర్యాలు పొందారని విమర్శించారు. శుక్రవారం ‘తెహల్కా’ పత్రిక ఈ విషయాన్ని వెల్లడించిందని ప్రశాంత్ భూషణ్ పేర్కొన్నారు. వాద్రాతో పాటు కొంత మంది అధికారులు, ప్రముఖ వ్యక్తులు కూడా ఉచితంగా సౌకర్యాలు పొందిన వారిలో ఉన్నారని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో వాద్రా ఇంకా అనేక రాయితీలు పొందారని ఆరోపించారు. ఆ ప్రైవేట్ ఎయిర్ లైన్స్ ఇలాంటి రాయితీలు  ఇవ్వడం తప్పని, అలా చేయకుండా ఉండాల్సిందని వ్యాఖ్యానించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement