కరోనా రోగుల సంచారం, జనం హడల్‌

Coronavirus Patient Around Relatives And Bangalore City - Sakshi

బెంగళూరు రూరల్‌లో గుబులు  

కర్ణాటక,దొడ్డబళ్లాపురం: కరోనా నుంచి బెంగళూరు గ్రామీణ జిల్లా క్షేమంగా ఉందని భావిస్తున్న తరుణంలో కరోనా సోకిన పీ–1207, పీ–1364 రోగులు జిల్లాలో అనేకచోట్ల తిరిగారని తెలిసి అంతటా ఆందోళన మొదలైంది. ముఖ్యంగా దొడ్డబళ్లాపురం, నెలమంగల తాలూకాలలో కరోనాభీతి నెలకొంది. మంగళవారంనాడు బెంగళూరు శివాజినగర్‌కు చెందిన 1207వ రోగి నెలమంగల తాలూకా బిల్లినకోటె, చుట్టుపక్కల డాబాలో, పరిసరాల్లో తిరిగి, పలువురిని కలిసి వెళ్లాడు. దీంతో డాబా యజమాని, సిబ్బంది,కలిసిన వారిని అందరినీ గుర్తించిన అధికారులు ఐసోలేషన్‌ వార్డ్‌కు తరలించారు. (కరోనాకు ప్రైవేట్‌ వైద్యం)

సీగేహళ్లిలో బంధువుల ఇంటికి  
అదేవిధంగా పీ–1634 బెంగళూరులో ఆకస్మికంగా మృతిచెందగా, అతడికి కరోనా సోకినట్టు మృతిచెందిన తరువాత రక్త పరీక్షల్లో తేలింది. ఇతడు దొడ్డబళ్లాపురం తాలూకా సీగేహళ్లి గ్రామానికి చెందిన వ్యక్తి. ఇదే నెల 16వ తేదీన తన భార్య, కుమారునితో వచ్చి బంధువులను కలిసి వెళ్లాడు. అంతటితో ఆగకుండా నెలమంగల తాలూకా హుల్లెహరివె గ్రామంలో నివసిస్తున్న తన చెల్లెలు ఇంటికి వెళ్లి ఆ ఇంట్లోని బాలింతను, పసిబిడ్డను చూసి వెళ్లిపోయాడు. బెంగళూరులో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బంధువు ఆరోగ్యాన్ని విచారించడానికి వెళ్లి అక్కడే గుండెపోటుతో చనిపోయాడు. కరోనా అని తేలడంతో ఆరోగ్యశాఖ అధికారులు తక్షణం మృతుడు తిరిగిన ప్రాంతాలకు వెళ్లి, కలిసిన వారందరికీ ఆరోగ్య పరీక్షలు చేసి ముందు జాగ్రత్త చర్యగా క్వారంటైన్‌కు తరలించారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top