వచ్చేది రామరాజ్యమే | Sakshi
Sakshi News home page

వచ్చేది రామరాజ్యమే

Published Wed, Mar 5 2014 10:42 PM

aditya thackeray in election campaigns

 పింప్రి, న్యూస్‌లైన్: రావణ రాజ్యం ముగిసిందని, ఇక రామ రాజ్యం వస్తుందని యువసేన నాయకుడు ఆదిత్య ఠాక్రే ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మధ్యాహ్నం పుణేలో మోషి నుంచి బోసిరి వరకు ఆదిత్యఠాక్రే రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. శివసేన కూటమి అభ్యర్థులను గెలిపించి ఎర్రకోటపై పార్టీ జెండా ఎగిరేవిధంగా చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్-ఎన్సీపీలు అటు దేశానికిగానీ లేదా ఇటు రాష్ట్రానికిగానీ చేసిందీ ఏమీ లేదన్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమేనన్నారు. వీరిని ఎన్నుకుంటే శూన్యమే మిగులుతుందన్నారు.

 ఎన్సీపీ అంటేనే నేషనల్ కరప్షన్ పార్టీ అంటూ ఎద్దేవా చేశారు. ముందుగా మోషిలోని ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేసిన ఆదిత్య... బోసిరి వరకు రోడ్‌షో నిర్వహించారు. బోసిరిలోని పీయూటీ చౌక్ వద్ద ఉన్న  శివాజీ విగ్రహం నుంచి రోడ్‌షోను ప్రారంభించారు. బోసిరి, ఆలంది మార్గం మీదుగా దిఘి వరకు రోడ్ షో జరిగింది. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు శివాజీరావ్ అడల్‌రావ్ పాటిల్‌తోపాటు కార్పొరేటర్లు సులభా ఉభాలే, సంగీత పవార్, శివసేన విభాగ ప్రముఖులు విజయ్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement