
సాక్షి, ముంబయి: విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు ఐర్లాండ్తో ట్వంటీ20 సిరీస్ ఆడనుంది. ఇంగ్లండ్తో సిరీస్ కంటే ముందుగానే భారత జట్టు ఐర్లాండ్కు బయలుదేరనుందని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) వెల్లడించింది. ఈ మేరకు బుధవారం బీసీసీఐ పాలక మండలి ఐర్లాండ్ పర్యటన షెడ్యూలు ఖరారు చేసింది. డబ్లిన్ వేదికగా రెండు టీ20లు జరగనున్నాయి. జూన్ 27న తొలి టీ20, 29న రెండో టీ20 మ్యాచ్లో టీమిండియా, ఐర్లాండ్ జట్లు తలపడతాయి. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి అమితాబ్ చౌదరీ ఓ ప్రకటన విడుదల చేశారు.
జూలైలో ఇంగ్లండ్ పర్యటన ఉండగా, అంతకు కొన్ని రోజుల ముందు భారత జట్టు ఐర్లాండ్తో రెండు టీ20ల సిరీస్ ఆడనుంది. అయితే ఐర్లాండ్, భారత్ జట్లు పొట్టి ఫార్మాట్లో కేవలం ఒకే ఒక్క మ్యాచ్లో తలపడ్డాయి. 2009 ఐసీసీ టీ20 ప్రపంచ కప్లో భాగంగా నాటింగ్హామ్లో ఈ జట్లు తలపడ్డ తర్వాత దాదాపు 9 ఏళ్లకు మరోసారి ఎదురపడనున్నాయి. అయితే భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య ద్వైపాక్షిక టీ20 సిరీస్ ఇప్పటివరకూ జరగలేదు.
భారత జట్టు ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంది. ఇటీవల జరిగిన కేప్టౌన్ టెస్టులో భారత్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. రెండో టెస్టులో విజయం సాధించి కేప్టౌన్ టెస్టు ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని కోహ్లీ సేన భావిస్తోంది.