బీసీసీఐ, లోధా కేసు విచారణ మరోసారి వాయిదా
బీసీసీఐకి వ్యతిరేకంగా లోధా కమిటీ దాఖలు చేసిన పిటిషనపై విచారణ మరోసారి వాయిదా పడింది.
న్యూఢిల్లీ: ప్రస్తుతమున్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)లో ఆఫీస్ బేరర్లందరినీ తొలగించి బోర్డు పరిశీలకుడిగా హోం శాఖ మాజీ కార్యదర్శి జీకే పిళ్లైను నియమించేందుకు అనుమతించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన లోధా ప్యానెల్ కమిటీ పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ నెల 14వ తేదీకి కేసు విచారణను వాయిదా వేస్తున్నట్లు చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. చివరిసారిగా ఈ కేసును అక్టోబర్ 21న విచారించిన కోర్టు గడిచిన సోమవారం తుది తీర్పు ఇవ్వాల్సి ఉంది. దానిలో భాగంగానే శుక్రవారానికి కేసును ధర్మాసనం వాయిదా వేసింది. అయితే బెంచ్ ముందు పలు కేసులు పెండింగ్లో ఉన్న క్రమంలో ఈ కేసు విచారణను మరోసారి వాయిదా వేసింది.
ప్రపాదనల అమలు విషయంలో బీసీసీఐకి, లోధా ప్యానెల్కు మధ్య ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. 70 ఏళ్ల గరిష్ట వయస్సు, రెండు పదవుల మధ్య మూడేళ్ల విరామం, ఒక రాష్ట్రానికి ఒక ఓటు వంటి అంశాలను బోర్డు గట్టిగా వ్యతిరేకిస్తోంది. ఈ క్రమంలోనే లోధా కమిటీ సిఫారుసులను అమలు చేయడానికి బోర్డు వెనుకడుగు వేస్తోంది.. దాంతో బోర్డులోని ఆఫీస్ బేరర్లు అందర్నీ తొలగించాలని లోధా ప్యానల్ పిటిషన్ దాఖలు చేసింది. హోంశాఖ మాజీ కార్యదర్శి జికే పిళ్లైను బోర్డు పరిశీలకుడిగా నియమించాలంటూ లోధా ప్యానల్ ఆ పిటిషన్లో కోరింది.


