ఆంధ్ర తడబాటు  | Sakshi
Sakshi News home page

ఆంధ్ర తడబాటు 

Published Sat, Nov 3 2018 1:50 AM

Ranji Trophy: Sanvir Singh century helps Punjab dominate Andhra - Sakshi

సాక్షి, విశాఖపట్నం: మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ సన్‌వీర్‌ సింగ్‌ (110; 14 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీకి తోడు మయాంక్‌ మార్కండే (68 నాటౌట్‌; 6 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయ అర్ధశతకంతో చెలరేగడంతో ఆంధ్రతో జరుగుతోన్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో పంజాబ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 414 పరుగులు చేసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 261/6తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన పంజాబ్‌ మరో 153 పరుగులు జోడించి మిగిలిన 4 వికెట్లు కోల్పోయింది. ఆంధ్ర బౌలర్లలో బండారు అయ్యప్ప, కరణ్‌ శర్మ మూడేసి వికెట్లు పడగొట్టగా... విజయ్‌ కుమార్, షోయబ్‌ ఖాన్‌ చెరో 2 వికెట్లు తీశారు.  అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆంధ్ర జట్టు తడబడింది. కెప్టెన్‌ హనుమ విహారి (19), ప్రశాంత్‌ (1), అశ్విన్‌ హెబర్‌ (17) త్వరగా ఔట్‌ కావడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర 26 ఓవర్లలో 3 వికెట్లకు 54 పరుగులు చేసింది. ప్రస్తుతం రికీ భుయ్‌ (12 బ్యాటింగ్‌), కేఎస్‌ భరత్‌ (2 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు.  

సచిన్‌ బేబీ, జగదీశ్‌ సెంచరీలు... 
తిరువనంతపురం: పేసర్‌ సిరాజ్‌ గైర్హాజరీలో హైదరాబాద్‌ బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో కేరళ భారీ స్కోరు చేసింది. సచిన్‌ బేబీ (147; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), జగదీశ్‌ (113 నాటౌట్‌; 6 ఫోర్లు, 1 సిక్స్‌) శతకాలతో చెలరేగడంతో కేరళ 495/6 వద్ద తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 231/4తో శుక్రవారం ఇన్నింగ్స్‌ కొనసాగించిన కేరళ సచిన్, జగదీశ్‌ సెంచరీలకు తోడు అక్షయ్‌ చంద్రన్‌ (48 నాటౌట్‌; 5 ఫోర్లు) రాణించడంతో భారీ స్కోరు చేసింది. హైదరాబాద్‌ బౌలర్లలో సాకేత్‌ సాయిరామ్‌ 3, మెహదీ హసన్‌ 2, రవితేజ ఓ వికెట్‌ పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన హైదరాబాద్‌ శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఒక ఓవర్‌లో వికెట్‌ నష్టపోకుండా 1 పరుగు చేసింది. తన్మయ్‌ (1 బ్యా టింగ్‌), అక్షత్‌రెడ్డి (0 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు.   

Advertisement
Advertisement