రంజీ ఫైనల్లో సౌరాష్ట్ర

Ranji Trophy 2018 Semi-final: Saurashtra beat Karnataka by 5 wickets - Sakshi

బెంగళూరు: పుజారా (131 నాటౌట్‌; 17 ఫోర్లు) అజేయ పోరాటంతో సౌరాష్ట్రను రంజీ ట్రోఫీలో ఫైనల్‌కు చేర్చాడు. ఈ దేశవాళీ చాంపియన్‌షిప్‌లో సౌరాష్ట్ర టైటిల్‌ పోరుకు అర్హత సాధించడం ఇది మూడోసారి. సోమవారం ముగిసిన సెమీఫైనల్లో సౌరాష్ట్ర 5 వికెట్ల తేడాతో కర్ణాటకపై విజయం సాధించింది. ఆఖరి రోజు మిగతా 55 పరుగుల లాంఛనాన్ని మరో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. 279 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు 224/3 ఓవర్‌నైట్‌ స్కోరుతో నాలుగో రోజు ఆట కొనసాగించిన సౌరాష్ట్ర రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసి గెలిచింది.

ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మన్‌ షెల్డన్‌ జాక్సన్‌ ( 100; 15 ఫోర్లు) సెంచరీ చేసిన వెంటనే నిష్క్రమించాడు. తర్వాత వచ్చిన అర్పిత్‌ (12) త్వరగానే ఔట్‌ కావడంతో... ప్రేరక్‌ మన్కడ్‌ (4 నాటౌట్‌)తో కలిసి జాగ్రత్తగా ఆడిన పుజారా సౌరాష్ట్రను గెలుపు తీరానికి చేర్చాడు. వినయ్‌ కుమార్‌కు 3 వికెట్లు దక్కాయి. వచ్చే నెల 3 నుంచి 7 వరకు జైపూర్‌లో జరిగే ఫైనల్లో సౌరాష్ట్ర జట్టు డిఫెండింగ్‌ చాంపియన్‌     విదర్భతో తలపడుతుంది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top