
'భారత క్రికెట్ జట్టును ప్రకటించండి'
వచ్చే నెల్లో ఇంగ్లండ్ లో జరిగే చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత క్రికెట్ జట్టును తక్షణమే ప్రకటించాలంటూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కి పరిపాలక కమిటీ (సీఓఏ) ఆదేశాలు జారీ చేసింది.
న్యూఢిల్లీ: వచ్చే నెల్లో ఇంగ్లండ్ లో జరిగే చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత క్రికెట్ జట్టును తక్షణమే ప్రకటించాలంటూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కి పరిపాలక కమిటీ (సీఓఏ) ఆదేశాలు జారీ చేసింది. అసలు ఇప్పటికే గడువు ముగిసిన నేపథ్యంలో జట్టును ప్రకటించకుండా ఎందుకు తాత్సారం చేసినట్లు చెప్పాలని సీఓఏ అధినేత వినోద్ రాయ్ నిలదీశారు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ప్రవేశపెట్టిన కొత్త రెవెన్యూ పద్ధతిని బీసీసీఐ తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.ఆ క్రమంలోనే ఐసీసీ నిర్వహించే మెగా ఈవెంట్లలో ఒకటైన చాంపియన్స్ ట్రోఫీకి దూరంగా ఉండాలని బీసీసీఐ ఆలోచనగా ఉంది. కాగా, దీన్ని సుప్రీంకోర్టుచే నియమించబడ్డ సీఓఏ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అది సరైన చర్య కాదని సీఓఏ అభిప్రాయపడుతోంది.
దీనిలో భాగంగానే బీసీసీఐ జాయింట్ సెక్రటరీ అమితాబ్ చౌదరికి వినోద్ రాయ్ లేఖ రాశారు. 'ఏప్రిల్ 25వ తేదీన ప్రకటించాల్సిన జట్టును ఎందుకు ప్రకటించలేదు. ఆ ట్రోఫీని భారత తిరిగి నిలబెట్టుకోవాలంటే ముందు నుంచే సన్నాహకం అవసరం. అయినప్పటికీ జట్టు ఎంపికపై బీసీసీఐ తాత్సారం చేస్తుంది. జట్టును ప్రకటించటానికి సెలక్షన్ కమిటీతో సమావేశం నిర్వహించండి. తక్షణమే చాంపియన్స్ ట్రోఫీకి వెళ్లే జట్టును ఎంపిక చేసి ఆ వివరాల్ని ఐసీసీకి తెలియజేయండి.వేరే కారణాలతో టోర్నీని బాయ్ కాట్ చేయడం సరైన విధానం కాదు' అని అమితాబ్ చౌదరికి రాసిన లేఖలో్ వినోద్ రాయ్ పేర్కొన్నారు.