అండర్–19 ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లోకి భారత్
మౌంట్ మాంగనీ: వరుసగా రెండో విజయంతో భారత జట్టు అండర్–19 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. పసికూన పపువా న్యూ గినియాతో మంగళవారం జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. భారత కెప్టెన్ పృథ్వీ షా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్కు దిగిన పపువా న్యూ గినియా జట్టు భారత బౌలర్ల ధాటికి 21.5 ఓవర్లలో కేవలం 64 పరుగులకే కుప్పకూలింది. ఒవియా సామ్ (15), సిమోన్ అతాయ్ (13), సినక అరువా (12) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. నలుగురు బ్యాట్స్మెన్ డకౌట్ అయ్యారు. భారత స్పిన్నర్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అనుకూల్ రాయ్ 14 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టడం విశేషం. అనంతరం భారత్ 8 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 67 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్ పృథ్వీ షా (36 బంతుల్లో 57 నాటౌట్; 12 ఫోర్లు) దూకుడుగా ఆడి అర్ధ సెంచరీ చేయగా... మన్జ్యోత్ కాల్రా (9 నాటౌట్) అతనికి అండగా నిలిచాడు. భారత్ తమ తదుపరి మ్యాచ్ ఈనెల 19న జింబాబ్వేతో
ఆడుతుంది.
మరిన్ని వార్తలు