ధోనీసేనకు ఏమైంది?

ధోనీసేనకు ఏమైంది?


లండన్: రాజు గుర్రం రాను రాను.. అన్నట్టుగా ఇంగ్లండ్లో టీమిండియా పరిస్థితి తయారైంది. ఇంగ్లండ్తో ఐదు వన్డేల సిరీస్లో తొలి మ్యాచ్ను భారత్ డ్రాగా ముగించింది. ప్రఖ్యాత లార్డ్స్ స్టేడియంలో జరిగిన రెండో మ్యాచ్లో నెగ్గి ధోనీసేన ప్రశంసలు అందుకుంది. ఈ వేదికపై టీమిండియా సుదీర్ఘ విరామం తర్వాత నెగ్గడం విశేషం. ఇంగ్లండ్లో ధోనీసేన సిరీస్ గెలవడం ఖాయమని అభిమానులు, విశ్లేషకులు భావించారు. ఇంగ్లండ్ వాతావరణానికి అలవాటు పడిన ధోనీసేన మూడో టెస్టు నుంచి మరింత జోరు కనబరుస్తుందనిపించింది. అయితే కథ అడ్డం తిరిగింది. మూడు, నాలుగు టెస్టుల్లో మనోళ్లు గల్లీ క్రికెట్ను తలపించేలా ఘోరంగా ఆడారు. ఫలితంగా రెండింటిలోనూ చిత్తుచిత్తుగా ఓడారు. సిరీస్ను సమం చేయాలంటే గెలిచి తీరాల్సిన చివరి, ఐదో మ్యాచ్లోనూ ఇదే వరుస.



శుక్రవారం ఆరంభమైన ఐదో టెస్టులో ధోనీసేన దారుణంగా ఆడుతోంది. తొలి సెషన్ కూడా ముగియకముందే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. గంభీర్ డకౌటవగా, ఇతర బ్యాట్స్మెన్ అదే బాటపట్టారు. క్రీజులోకి రావడం ఆలస్యమన్నట్టు పెవిలియన్కు క్యూ కడుతున్నారు. గంభీర్ (0), పుజారా (4), కోహ్లీ (6), రహానె (0).. మన ఘనాపాటి క్రికెటర్లు చేసిన పరుగులివి. మురళీ విజయ్ (18) మాత్రం డబుల్ డిజిట్ స్కోరు చేశాడనిపించుకుని అవుటయ్యాడు. భారత్ 20 ఓవర్లలో 37 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. భారత లైనప్లో మిగిలున్న సీనియర్ బ్యాట్స్మన్ ధోనీ మాత్రమే. ధోనీతో పాటు బిన్నీ క్రీజులో ఉన్నారు. భారత ప్రదర్శన ఇలాగే కొనసాగితే రెండో సెషన్లోనే చాపచుట్టేయడం ఖాయం! ఈ మ్యాచ్లో కూడా ధోనీసేన మూడు రోజుల్లోనే ఓడినా ఆశ్చర్యం లేదు. క్రీడల్లో గెలుపోటములు సహజమే అయినా ప్రపంచ స్థాయి అత్యుత్తమ జట్టు మరీ ఇంత చెత్తప్రదర్శన కనబర్చడం దారుణం. ధోనీసేనకు ఏమైంది?

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top