‘రఫేల్‌ కంటే అమరావతి స్కామ్‌ పెద్దది’ | YSRCP Leaders Release Chandrababu Emperor Of Corruption Book | Sakshi
Sakshi News home page

Jan 8 2019 11:58 AM | Updated on Jan 8 2019 3:29 PM

YSRCP Leaders Release Chandrababu Emperor Of Corruption Book - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అతని అనుచరగణం చేసిన అవినీతి, అక్రమాలను ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎక్కడికక్కడ ఎండగడుతోంది. ఢిల్లీ వేదికగా అటు ప్రత్యేక హోదాపై, ఇటు టీడీపీ ప్రభుత్వ అరాచక పాలనపై ఆ పార్టీ ఎంపీలు, సీనియర్‌ నాయకులు గళం వినిపిస్తున్నారు. ‘చంద్రబాబు ఎంపరర్‌ ఆఫ్‌ కరప్షన్‌’ అనే పుస్తకాన్ని వైఎస్సార్‌సీపీ ఎంపీలు, మాజీ ఎంపీలు, సీనియర్‌ నేతలు ఢిల్లీలో సోమవారం విడుదల చేశారు. కాదేదీ అవినీతికి అనర్హమన్నట్టుగా చంద్రబాబు దోపిడీ పాలన సాగుతోందని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు నిజ స్వరూపం చెప్పడానికే ఈ పుస్తకమని తెలిపారు. చంద్రబాబు, అతని అనుచరులు అమరావతి నుంచి పోలవరం నిర్మాణం వరకు 6 లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అవినీతి కార్యకలాపాల కోసమే చంద్రబాబు ఢిల్లీ పర్యటన చేస్తున్నాడని రాజ్యసభ సభ్యుడు విజసాయిరెడ్డి అన్నారు. ఏపీలో పుట్టిన ప్రతి బిడ్డపై అప్పుల భారం మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రఫెల్‌ కంటే అమరావతి స్కామ్‌ పెద్దది..
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరుగుతోందని కాగ్‌ స్పష్టం చేసిందని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు. రఫేల్‌ కంటే అమరావతి స్కామ్‌ పెద్దదని వాటర్ మాన్‌ రాజేంద్ర సింగ్‌ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. 600 హామీలిచ్చిన తెలుగుదేశం పార్టీ ఒక్కటీ కూడా అమలు చేయలేదని రాజ్యసభ్యుడు వేంరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అవినీతి పాలనపై సాక్షాత్తూ ఇద్దరు చీఫ్‌ సెక్రటరీలు బహిరంగంగా విమర్శలు చేశారని చురకలంటించారు.

Advertisement
 
Advertisement
Advertisement