‘కాపు’ కాస్తాం

YS Jagan Mohan Reddy clarification On Kapu Issue in Assembly - Sakshi

కాపు సామాజిక వర్గానికి అండగా ఉంటాం  

ఎన్నికల హామీలు పూర్తిగా నెరవేరుస్తాం

అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టీకరణ

కాపు కార్పొరేషన్‌కు ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.2 వేల కోట్లు 

ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు కేటాయించి ఖర్చు చేస్తాం

చంద్రబాబు మాదిరి అబద్ధపు హామీలు ఇచ్చి మోసం చేయను 

కాపులను చంద్రబాబు అడుగడుగునా మోసం చేశారు.. మంజునాథ కమిషన్‌ నివేదిక పేరిటా మోసం 

ఈబీసీ రిజర్వేషన్లలో 5 శాతం రిజర్వేషన్‌ అంటూ మరో మోసం 

ఇంతకూ కాపులు బీసీలా.. ఓసీలా చంద్రబాబే చెప్పాలి

మోసం, అబద్ధం నాకు అలవాటు లేవు. చంద్రబాబుకు నాకు చాలా తేడా ఉంది. ఏదైనా నిజాయతీగా చెబుతాను. రెండు పేజీల మేనిఫెస్టో ఇచ్చాను. కాపుల సంక్షేమానికి ఏం చేస్తామో స్పష్టంగా చెప్పాం. అది చూసే ప్రజలు మాకు ఓటేశారు. కాపు కార్పొరేషన్‌కు ఏటా రూ.2వేల కోట్లు చొప్పున కేటాయించి 5ఏళ్లలో రూ.10వేల కోట్లు ఖర్చు చేస్తామన్నాం. చెప్పిన విధంగానే మొదటి బడ్జెట్‌లోనే రూ.2వేల కోట్లు కేటాయించాం. దాన్ని పూర్తిగా ఖర్చు చేస్తాం. కాపులకు అండగా ఉంటాం. కాపులకు రిజర్వేషన్ల విషయంలో మా వైఖరిలో మార్పు ఉండబోదు.

మనం సినిమాకు వెళ్తే అందులో ఓ విలన్‌ క్యారెక్టర్‌ ఉంటుంది. సినిమా కెమెరా ఏంగిల్‌ను అసెంబ్లీలోకి ఫోకస్‌ చేస్తే ఇక్కడా మనకు ఓ విలన్‌ కనిపిస్తారు. చంద్రబాబే ఆ విలన్‌ క్యారెక్టర్‌. ఆయన కాపులను అడ్డగోలుగా మోసగించారు. ఆయన చేసిన మోసంపై  ప్రశ్నిస్తే.. 2004లో ఏం జరిగింది.. 1983లో ఏం జరిగింది.. అంటూ చర్చను పక్కదారి పట్టిస్తారు. అవన్నీ ఎందుకు? అక్కడ మీరు ఉన్నారు.. ఇక్కడ నేను ఉన్నాను. మీరేం చెప్పారు.. ఏం చేశారు? నేను ఏం చెప్పాను.. ఏం చేశాను.. అన్నది చర్చిద్దాం రండి.
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: కాపులకు అన్ని విధాలుగా ఎప్పుడూ అండగా ఉంటామని, ఎన్నికల్లో వారికి ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన మాదిరిగానే కాపు కార్పొరేషన్‌కు ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు కేటాయించి పూర్తిగా ఖర్చు చేస్తామని చెప్పారు. అందుకే ఈ ఏడాది తొలి బడ్జెట్‌లో రూ.2 వేల కోట్లు కేటాయించామని, ఆ మొత్తాన్ని పూర్తిగా ఖర్చు చేస్తామన్నారు. విపక్ష నేత చంద్రబాబు మాదిరిగా అబద్ధపు హామీలు ఇచ్చి కాపులను మోసం చేసే అలవాటు తనకు లేదని సీఎం స్పష్టం చేశారు. తాను ఏదైనా నేరుగా మాట్లాడతానని, అమలు చేయగలిగే హామీలే ఇస్తానని చెబుతూ మనస్సాక్షి చంపుకుని రాజకీయాలు చేయనని విస్పష్టంగా ప్రకటించారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల నాలుగో రోజు మంగళవారం కాపు రిజర్వేషన్ల అంశంపై చర్చ జరిగింది. కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఇచ్చామని చంద్రబాబు చెబుతూ అవి అమలు చేస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి సీఎం వైఎస్‌ జగన్‌ సమాధానం ఇస్తూ కాపుల సంక్షేమానికి తాము నిజాయతీ, నిబద్ధతతో వ్యవహరిస్తున్నామన్నారు. ఎన్నికల్లో ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చంద్రబాబు కాపులను ఏ విధంగా మోసం చేసిందీ సాదోహరణంగా వివరించారు. ఈ చర్చలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రసంగం ఇలా సాగింది.

చంద్రబాబు విలన్‌ క్యారెక్టర్‌ 
‘చంద్రబాబు నిజాలు ఎప్పుడూ మాట్లాడరు. ఆయనది విలన్‌ క్యారెక్టర్‌. కాపులను అడుగడుగునా అడ్డగోలుగా మోసం చేశారు. కాపు, తెలగ, బలిజ కులాలను ఆదుకోవడానికి ఏడాదికి రూ.వెయ్యి కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక ఆయన ఏం చేశారో ఓ సారి చూద్దాం... 2014–15లో రూ.50 కోట్లు కేటాయించి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. 2015–16లో రూ.100 కోట్లు కేటాయించారు. రూ.96 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి 2016–17లో రూ.వెయ్యి కోట్లు కేటాయించారు. కానీ రూ.490 కోట్లే ఖర్చు చేశారు. 2017–18లో కూడా రూ.వెయ్యి కోట్లు కేటాయించి రూ.891 కోట్లు ఖర్చు చేశారు. చివరికి ఎన్నికల ఏడాది 2018–19లో రూ.వెయ్యి కోట్లు కేటాయించి రూ.525 కోట్లే ఖర్చు చేశారు. అంటే ఏ స్థాయిలో కాపులను చంద్రబాబు మోసం చేశారో అర్థమవుతోంది. అందుకే కాపులు చంద్రబాబును ఇక్కడ ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. 

బాబు నిర్వాకం వల్లే కాపులకు నష్టం
కాపు రిజర్వేషన్లపై ఎలా మోసం చేశారన్నది చంద్రబాబు మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈబీసీ)కు కేంద్ర ప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే, చంద్రబాబు అందులో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. అసలు కాపులు బీసీలా? ఓసీలా? ఏదో చెప్పలేని అద్వానపు స్థితిలో చంద్రబాబు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ పరంగా ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది. అందులో ఏ కులానికి పడితే ఆ కులానికి వేరేగా రిజర్వేషన్లు ఇచ్చే అధికారం ఎవరికీ లేదు. ఫార్వర్డ్‌ కులాలన్నింటిలోని ఈబీసీలందరికీ ఆ 10 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి. అంతేగానీ అందులో ఓ కులానికి 5 శాతమో మరెంతో వేరేగా రిజర్వేషన్లు ఇవ్వడం కుదరదు. కోర్టులో ఎవరైనా చాలెంజ్‌ చేస్తే అది అమలు కాదని తెలిసినా చంద్రబాబు మోసం చేశారు. కాపు రిజర్వేషన్ల అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దీనిపై ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితి. చంద్రబాబు నిర్వాకం వల్ల కాపులకు నష్టం జరిగింది. మెడికల్‌ కౌన్సిలింగ్‌లో ఈబీసీలకు సీట్లు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. 

మనస్సాక్షి చంపుకోను 
మోసం, అబద్ధం నాకు అలవాటు లేవు. ఏదైనా నేరుగా చెబుతాను. చంద్రబాబుకు నాకు చాలా తేడా ఉంది. ఏదైనా నిజాయతీగా చెబుతాను. రెండు పేజీల మ్యానిఫెస్టో ఇచ్చాను. (మ్యానిఫెస్టోలో కాపులకు ఇచ్చిన హామీలను చదివి వినిపించారు). కాపుల సంక్షేమానికి ఏం చేస్తామో స్పష్టంగా చెప్పాం. అది చూసే ప్రజలు మాకు ఓటేశారు. కాపు కార్పొరేషన్‌కు ఏటా రూ.2 వేల కోట్లు చొప్పున కేటాయించి 5 ఏళ్లలో రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తామన్నాం. చెప్పిన విధంగానే మొదటి బడ్జెట్‌లోనే రూ.2 వేల కోట్లు  కేటాయించాం. దాన్ని పూర్తిగా ఖర్చు చేస్తాం. ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు కేటాయించి పూర్తిగా ఖర్చు చేస్తాం. కాపులకు అండగా ఉంటాం. కాపులకు రిజర్వేషన్ల విషయంలో మా వైఖరిలో ఎలాంటి మార్పు ఉండబోదు. 

కాపు రిజర్వేషన్లపై చంద్రబాబు పచ్చి మోసం... మంజునాథ కమిషన్‌ 
కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని చంద్రబాబు తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చి మోసం చేశారు. మంజునాథ కమిషన్‌ వేశారు. కానీ కమిషన్‌ నివేదిక మీద చైర్మన్‌ మంజునాథ సంతకమే లేదు. చైర్మన్‌ సంతకం లేకుండానే మిగిలిన సభ్యుల సంతకాలతో నివేదికను విడుదల చేశారు. అలా ఎవరైనా చేస్తారా? చేస్తే ఆ నివేదికకు పవిత్రత, విలువ ఉంటాయా? ఎవరైనా కోర్టుకు వెళితే ఆ నివేదిక నిలుస్తుందా? అది తెలిసి కూడా చంద్రబాబు కాపులను మోసం చేశారు. అందుకే ప్రజలు ఆయన్ను ఇక్కడ ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. అయినప్పటికీ ఆయన తీరు మారడం లేదు. కుక్క తోక ఎప్పుడూ వంకరే’ అని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. 

మా మేనిఫెస్టోలో ఇలా చెప్పాం
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జాట్లు, గుజ్జర్లు, పటేళ్లు, మన రాష్ట్రంలో కాపు సోదరులు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతున్న పరిస్థితి మనం గమనిస్తునే ఉన్నాం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏ రాష్ట్రంలో కూడా రిజర్వేషన్లు 50 శాతం మించకూడదన్న నిబంధన మనందరికీ తెలిసిన చిక్కుముడి. ఇది తెలిసి కూడా టీడీపీ గత ఎన్నికల ప్రణాళికలో కాపులను బీసీలలో కలుపుతామని మోసపూరితమైన హామీ ఇచ్చింది. మన పరిధిలో లేని విషయంలో మనం ప్రయత్నం చేస్తామని చెప్పగలం గానీ అంతకుమించి రిజర్వేషన్‌ కల్పిస్తామని చెప్తే అది ప్రజలను మభ్యపెట్టే చర్యే అవుతుంది.

ఈ నేపథ్యంలో కాపు రిజర్వేషన్ల విషయంలో మా వైఖరి ఎప్పుడూ ఒక్కటే. మొదటి నుంచీ మేము చెబుతున్నట్టుగానే బీసీ హక్కులకు భంగం కలుగకుండా వారి ప్రయోజనాలకు నష్టం రాకుండా జరిగే రిజర్వేషన్లకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. చంద్రబాబు ప్రభుత్వం కాపు రిజర్వేషన్ల విషయంలో మోసం చేయడమే కాకుండా సంవత్సరానికి రూ.వెయ్యి కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చి, ఈ ఐదేళ్లలో కేవలం రూ.1,340 కోట్లు కేటాయించింది. ఈ నేపథ్యంలో మేము అధికారంలోకి రాగానే కాపు కార్పొరేషన్‌కు సంవత్సరానికి రూ.2 వేల కోట్లు చొప్పున 5 ఏళ్లలో రూ.10 వేల కోట్లు కేటాయిస్తాం. ఖర్చు చేస్తాం.  

వివిధ కులాల వారిని మోసం చేయడం చంద్రబాబుకు మొదటి నుంచీ అలవాటే. ఎస్సీ వర్గీకరణ విషయంలోనూ అలాగే మోసం చేశారు. తన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాల, మాదిగల మధ్య విభేదాలు సృష్టించారు. ఎస్సీ వర్గీకరణ నిలవదని, న్యాయస్థానం కొట్టి వేస్తుందని తెలిసీ చేశారు. అనుకున్నట్టే కోర్టు కొట్టేసింది. రాజకీయంగా తనకు ఉపయోగపడుతుందా లేదా అన్నదే చంద్రబాబు చూస్తారు తప్ప అది సాధ్యమా కాదా అన్నది పట్టించుకోరు. ఆయనకు ఏ విషయంలో ఏనాడూ చిత్తశుద్ధి లేదు. 

ఇప్పటికీ చంద్రబాబులో మార్పు రాకపోతే వచ్చే ఎన్నికల్లోఇప్పుడు ఉన్న 23 సీట్లు కూడా రావు. ఏ 13 సీట్లో ఇంకా తక్కువో వస్తాయి. చంద్రబాబు ఇప్పటికైనా మారాలి. వయసుతోపాటు మానవత్వం, మంచితనం కూడా పెంచుకోవాలి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top