ప్రధాని మోదీతో కేసీఆర్‌ భేటీ | Telangana CM KCR Meets PM Modi in Delhi | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీతో కేసీఆర్‌ భేటీ

Oct 4 2019 5:20 PM | Updated on Oct 4 2019 8:03 PM

Telangana CM KCR Meets PM Modi in Delhi - Sakshi

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(కేసీఆర్‌) శుక్రవారం సాయంత్రం భేటీ అయ్యారు.

సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(కేసీఆర్‌) శుక్రవారం సాయంత్రం భేటీ అయ్యారు. నరేంద్ర మోదీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆయనతో కేసీఆర్‌ సమావేశమయ్యారు. ముందుగా ప్రధాని మోదీకి కేసీఆర్‌ అభినందనలు తెలిపారు. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు, కృష్ణా-గోదావరి నదుల అనుసంధానానికి నిధులు అంశాలను ప్రధానితో ఆయన చర్చించినట్టు సమాచారం. మిషన్‌ భగీరథ పథకానికి కూడా నిధులు ఇవ్వాలని ప్రధానమంత్రిని కోరినట్టు తెలుస్తోంది.

తెలంగాణలో ములుగు, నారాయణపేట్‌ జిల్లాలు కొత్తగా ఏర్పాటు కావడంతో జిల్లాల సంఖ్య 33కు పెరిగింది. అలాగే వికారాబాద్‌ జిల్లాను జోగులాంబ గద్వాల జోన్‌ నుంచి చార్మినార్‌ జోన్‌ పరిధిలోకి మార్చాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు మార్పులకు అనుగుణంగా జోనల్‌ ఉత్తర్వులను సవరించి రాష్ట్రపతి ఉత్తర్వుల జారీకి సహకరించాలని ప్రధానిని కోరినట్టు సమాచారం. దాదాపు గంట పాటు వీరి భేటీ ​కొనసాగింది.

ప్రధానితో భేటీ ముగిసిన తర్వాత కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. కేసీఆర్‌ పాటు రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, కేశవరావు, పలువురు ఎంపీలు ఉన్నారు. 15 నిమిషాల పాటు సమావేశం సాగింది. రాజీవ్ రహదారి విస్తరణకు కంటోన్మెంట్ భూముల అప్పగించాలని రాజ్‌నాథ్‌ను సీఎం కేసీఆర్ కోరారు. అనంతరం ఆయన హైదరాబాద్‌కు బయలుదేరారు.(చదవండి: అమిత్‌ షాతో కేసీఆర్‌ 40 నిమిషాల భేటీ)

Advertisement
 
Advertisement
Advertisement