‘ఆయన మానసిక పరిస్థితి సరిగాలేదు..తప్పించాలి’ | Sakshi
Sakshi News home page

రమేష్‌ కుమార్‌ లేఖ వెనుక ఉద్దేశం ఏంటి?

Published Thu, Mar 19 2020 4:52 PM

Sajjala Ramakrishna Reddy Slams On Ramesh Kumar And Chandrababu Naidu - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమర్‌ చంద్రబాబు నాయుడు ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న వ్యక్తి ఇలా వ్యవహరించడం దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. రమేష్‌ కుమార్‌ మానసిక పరిస్థితి బాగాలేదని, ఆయనను తప్పించాలని డిమాండ్‌ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు హాని ఉందంటూ ఎన్నికల కమిషనర్ రమేష్‌ కేంద్రానికి లేఖ రాయడం వెనుక ఉద్దేశమేంటని ప్రశ్నించారు. లేఖలోని అంశాలను చూశాక రమేషే రాశారన్న అనుమానం కలుగుతుందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు లేఖ రాసినట్లు ఉందని ఆరోపించారు. ఈ నెల 15వ తేదిన నిమ్మగడ్డ చెప్పిన మాటలకు.. లేఖలో రాసిన అంశాలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయని దుయ్యబట్టారు.
(చదవండి : ఈసీ లేఖపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌)

‘ కరోనా వైరస్‌ విజృంభిస్తే గ్రామ స్థాయిలో బలమైన యంత్రాంగం ఉండాలి. పరిస్థితులు అదుపులో ఉన్నప్పుడే ఎన్నికలు పూర్తి చేసి .. గ్రామ స్థాయిలో ప్రజాప్రతినిధులను నియమించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. స్థానిక సంస్థ ఎన్నికల్లో ఏ ప్రభుత్వమైనా ఏకగ్రీవాలవైపే మొగ్గు చూపుతుంది. ఏకగ్రీవాలు కావాలనే ప్రోత్సహకాలు కూడా ఇస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడైతే మా పార్టీ స్వీప్‌ చేసిందో.. అక్కడే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలు జరిగాయి. సీఎం జగన్‌పై నమ్మకంతో ప్రజలను తిరుగులేని విజయం అందిస్తున్నారు. అభ్యర్థులు దొరక్క ఎన్నికల ముందే చంద్రబాబు అస్త్రసన్యాసం చేశారు. ఓడిపోతామనే భయంతో ఈసీని అడ్డుపెట్టుకొని చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల వాయిదాపై సుప్రీంకోర్టు తీర్పును కూడా వక్రీకరించారు. ఈసీ ఏకపక్ష నిర్ణయం తప్పని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు చేసినా తిప్పికొట్టే సామర్థ్యం మాకు ఉంది’ అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
(చదవండి : ‘ఆ లేఖ బాబు ఆఫీసులో తయారు చేశారు!’)

Advertisement
Advertisement