మోసం.. బాబు నైజం

MLA Gummanur Jayaram Slams On Chandrababu Kurnool - Sakshi

సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు వేదవతి నదిపై సాగునీటి ప్రాజెక్టు నిర్మించాలని కోరుతూ ఆదివారం హాలహర్వి మండలం గూళ్యం గ్రామంలో ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం దీక్ష చేపట్టారు.  దీక్షకు  భారీ సంఖ్యలో రైతులు 
మద్దతు తెలిపారు.

ఆలూరు: ప్రజలను మోసం చేయడం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి నైజమని ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం విమర్శించారు. వేదవతి నదిపై ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని కోరుతూ ఆదివారం.. హాలహర్వి మండలం గూళ్యం గ్రామంలో ఒక రోజు దీక్ష నిర్వహించారు. ముందుగా వేదవతి నదిలో పూజలు జరిపారు. అనంతరం ర్యాలీగా స్టేజి వద్దకు చేరుకున్నారు. దీక్షకు ఆదోని, మంత్రాలయం, ఉరవకొండ ఎమ్మెల్యేలు సాయిప్రసాద్‌రెడ్డి, వై.బాలనాగిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా దీక్షను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయిందని, హామీలు ఇచ్చి అమలు చేయకపోవడంలో ఆయన నంబర్‌ వన్‌గా నిలిచారన్నారు.

నీరు–చెట్టు కార్యక్రమంలో భాగంగా ఆలూరు నియోజకవర్గం కురువళ్లి గ్రామానికి వచ్చి..వేదవతి నదిపై ప్రాజెక్టు నిర్మాణానికి రూ.300 కోట్లు కేటాయిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. హామీ ఇచ్చి రెండేళ్లు పూర్తయినా నేటికీ అమలు చేయలేదన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి సర్వే చేయడానికి అధికారులు రూ.6 కోట్లు కావాలని ప్రతిపాదనలు పంపిస్తే ప్రభుత్వం రూ.2 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఆ నిధులు సరిపోవని, అధికారులు సర్వే పనులు కూడా ప్రారంభించలేదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా నేటికీ రైతులకు సంతృప్తిగా రుణమాఫీ చేయలేదన్నారు.
 
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపై వివక్ష
వైఎస్సార్‌ హయాంలో పార్టీలకు అతీతంగా నియోజకవర్గాల అభివృద్ధికి  నిధులు మంజూరు అయ్యేవని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు నిధులు విడుదల చేయకుండా వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. ఆలూరు నియోజకవర్గంలో తన సొంత నిధులతో తాగునీరు, సీసీ రోడ్ల సమస్య పరిష్కరించానన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందన్నారు. టీడీపీ ప్రభుత్వ పాలనతో ప్రజలు విసుగుచెందారన్నారు.

  
వైఎస్‌ జగన్‌ను ముఖ్యమంత్రి చేద్దాం 

రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని ప్రజలకు ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి పిలుపునిచ్చారు. దీక్షనుద్దేశించి ఆయన మాట్లాడారు. వేదవతినదిపై ప్రాజెక్టు నిర్మించి తీరుతామని ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు ఎందుకు నెరవేర్చడం లేదో ప్రజలకు జవాబు చెప్పాలన్నారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top