‘రివర్స్‌ టెండరింగ్‌తో ప్రజాధనం ఆదా చేస్తున్నాం’ | Sakshi
Sakshi News home page

‘రివర్స్‌ టెండరింగ్‌తో ప్రజాధనం ఆదా చేస్తున్నాం’

Published Mon, Dec 16 2019 4:11 PM

Minister Anil Kumar Yadav Slams TDP In AP Assembly - Sakshi

సాక్షి, అమరావతి : రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూస్తున్నామని జలవనరుల మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు. సోమవారం శాసనమండలిలో మంత్రి మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వం టెండర్ల పేరుతో పెద్ద ఎత్తున కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చిందని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.55వేల కోట్లు కాగా, ఇప్పటి వరకు కేవలం రూ.17వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. కేవలం 35శాతం పనులు పూర్తి చేసి తమ హయంలో 65శాతం ప్రాజక్టులు పనులు పూర్తి చేశామని టీడీపీ తప్పుడు లెక్కలు చెబుతున్నారని మండిపడ్డారు.

టీడీపీ ప్రభుత్వం మొదటి మూడేళ్లు పోలవరంకు సంబంధించి ఎటువంటి పనులను ప్రారంభించలేదని ఆరోపించారు. పోలవరం కుడి ప్రధాన కారులవ టన్నెల్‌కు టీడీపీ ప్రభుత్వం 4.67శాతం ఎక్సెస్‌కు మాక్స్‌ అనే కంపెనీకి టెండర్లు కట్టబెడితే.. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా తమ ప్రభుత్వం అదే కంపెనీకి 15శాతం లెస్‌కు కోట్‌ చేశామన్నారు. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ పనుల్లోనూ 4.95శాతం​ ఎక్సెస్‌కు టెండర్లు కట్టబెడితే.. తమ ప్రభుత్వం వచ్చాకా అదే సంస్థ 25శాతం లెస్‌కు టెండర్లు వెశారని మంత్రి గుర్తు చేశారు. ఇలా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అరికడుతుంటే టీడీపీ వారికి ఎందుకు అభ్యంతరం అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టును ఇంజనీరింగ్‌ అధికారులు చెప్పిన సమయంలోగా పూర్తి చేశామని చెప్పారు. వచ్చే సీజన్‌ నాటికి ముంపు ప్రాంతాలలోని 18వేల ఇళ్లను ఖాళీ చేయిస్తామని మంత్రి పేర్కొన్నారు. నవంబర్‌ 1 నుంచి పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభిచామని మంత్రి తెలిపారు.

Advertisement
Advertisement