స్క్రిప్ట్‌ రైటర్‌ ప్రసంగాలు! | Kalvakuntla Kavitha Rao dares Congress Chief Rahul Gandhi | Sakshi
Sakshi News home page

స్క్రిప్ట్‌ రైటర్‌ ప్రసంగాలు!

Dec 1 2018 5:20 AM | Updated on Dec 1 2018 5:20 AM

Kalvakuntla Kavitha Rao dares Congress Chief Rahul Gandhi - Sakshi

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, నరేంద్ర మోదీలు ప్రజలకు సత్యదూరమైన మాటలు చెబుతున్నారని నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. స్క్రిప్ట్‌ రైటర్ల ప్రసంగాలు.. మసాలా జోడించే అనువాదకులతో ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థంకాని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. శుక్రవారం నిజామాబాద్‌లో కవిత విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పసుపుబోర్డు కోసం తాను పార్లమెంట్‌లో ప్రశ్నిస్తే.. రాహుల్‌తో సహా కాంగ్రెస్‌ ఎంపీలు ఎందుకు మద్దతు తెలుపలేదని ప్రశ్నించారు. ఇప్పుడు ఎన్నికల వేళ పసుపుబోర్డు ఏర్పాటు చేస్తామని రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.

పసుపు రైతుల పట్ల రాహుల్‌కు చిత్తశుద్ధి ఉంటే ప్రధానికి లేఖ రాయాలని డిమాండ్‌ చేశారు. గల్ఫ్‌ బాధితులపై రాహుల్‌ మొసలి కన్నీళ్లు కార్చారని విమర్శించారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలీ, అమేథీ నియోజకవర్గాలు పేదరికం, అక్షరాస్యత వంటి అనేక రంగాల్లో వెనుకబడిందనే విషయాన్ని గమనించాలని కోరారు. పసుపుబోర్డు, ముస్లింలు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, సింగరేణి కార్మికులకు ఐటీ మినహాయింపు, తెలంగాణ పరిశ్రమలకు రాయితీలు వంటి అంశాలపై త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంట్‌ సమావేశాల్లో టీఆర్‌ఎస్‌ ఎంపీల పోరాటానికి రాహుల్‌ మద్దతిస్తారా అని ప్రశ్నించారు.

అమరులను చేసింది కాంగ్రెస్సే
తెలంగాణ ప్రజల కలను సాకారం చేయకుండా 60 ఏళ్లు జాప్యం చేసింది, తెలంగాణ బిడ్డలను అమరులను చేసింది కూడా కాంగ్రెస్‌ పార్టీయేనన్న విషయం గుర్తుంచుకోవాలని కవిత అన్నారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్‌ హయాంలో 22 వేల ఉద్యోగాలిచ్చారని, తమ ప్రభుత్వం నాలుగేళ్లలో 30 వేల ఉద్యోగాలిచ్చిందని వివరించారు.
నిజామాబాద్‌లో మాట్లాడుతున్న ఎంపీ కవిత  

Advertisement
 
Advertisement
Advertisement