కేటీఆర్‌ను కలిసిన అజహరుద్దీన్‌

HCA President Azharuddin Meets Minister KTR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీమిండియా మాజీ సారథి, హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ) తాజా అధ్యక్షుడు మొహమ్మద్‌ అజహరుద్దీన్‌ శనివారం టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ మంత్రి కేటీఆర్‌ను బుద్ధ భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. అజహర్‌తో పాటు తాజాగా ఎన్నికైన హెచ్‌సీఏ ప్యానల్‌ సభ్యులు కూడా కేటీఆర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా హెచ్‌సీఏ కొత్త ప్యానల్‌కు కేటీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. క్రికెట్‌ అభివృద్దికి ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుందని, హెచ్‌సీఏ కూడా తగిన కృషి చేయాలని సభ్యులకు సూచించారు. అయితే ఈ భేటీపై అనేక రాజకీయ ఊహాగానాలకు తెరదీస్తోంది. 

అజహరుద్దీన్‌ శుక్రవారం హెచ్‌సీఏ అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్‌ రాష్ట్రానికి బాస్‌ అంటూ పేర్కొనడంతో ఆయన టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరతారంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఇన్నాళ్లూ హెచ్‌సీఏ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించిన మాజీ ఎంపీ జి.వివేక్‌కు చెక్‌ పెట్టేందుకు అజహర్‌కు టీఆర్‌ఎస్‌ పరోక్ష సహకారమందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌లోకి చేరడానికి ఇదే సరైన సమయమని అజహర్‌ భావిస్తున్నట్లు అతడి సన్నిహితవర్గాలు పేర్కొంటున్నాయి. 

సీఎం కేసీఆర్‌ను కూడా కలుస్తాం..
క్రికెట్‌కు ప్రభుత్వ సహకారాన్ని అందించాలని మాత్రమే మంత్రి కేటీఆర్‌ను కలిశానని హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్‌ తెలిపారు. 33 జిల్లాల్లో యువత ప్రతిభనను గుర్తించి క్రికెట్‌లోకి తీసుకవస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు పెద్ద పీట వేస్తుందన్నారు. పార్టీలకు అతీతంగా అందరినీ కలిసి క్రికెట్‌ అభివృద్దికి పాటుపడేలా కోరుతామని తెలిపారు. సీఎం కేసీఆర్‌ను కూడా కలిసి హెచ్‌సీఏ, క్రికెట్‌ క్రికెట్‌ అభివృద్దికి సహకరించాలని కోరతామని అజహరుద్దీన్‌ వివరించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top