రాజ్యసభ ఎన్నికలు: ఈసీకి కాంగ్రెస్‌ ఫిర్యాదు | Congress Complaint on Party MLAs to election commission | Sakshi
Sakshi News home page

రాజ్యసభ ఎన్నికలు: ఈసీకి కాంగ్రెస్‌ ఫిర్యాదు

Mar 23 2018 1:54 PM | Updated on Mar 18 2019 9:02 PM

Congress Complaint on Party MLAs to election commission - Sakshi

రాజ్యసభ ఎన్నికలు శుక్రవారం ప్రారంభమ్యాయి.

సాక్షి, హైదరాబాద్‌: రాజ్యసభ ఎన్నికలు శుక్రవారం ప్రారంభమ్యాయి. శాసనసభలోని కమిటీ హాల్‌ నంబర్‌1లో ఉదయం 9 గంటలకు పోలింగ్‌ మొదలైంది. ఈ మేరకు శాసనసభ సచివాలయం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 117 మంది ఓటర్లు ఉన్నట్టు అధికారికంగా ప్రకటించారు. మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నిక జరుగుతుండగా.. నలుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులుగా జోగినపల్లి సంతోష్‌కుమార్, బండా ప్రకాశ్, బడుగుల లింగయ్యయాదవ్‌ బరిలో ఉండగా.. కాంగ్రెస్‌ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి పి.బలరాంనాయక్‌ పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికలకు బీజేపీ, టీడీపీ, సీపీఎం పార్టీలు దూరంగా ఉన్నాయి.

ఈసీకి కాంగ్రెస్‌ ఫిర్యాదు
రాజ్యసభ ఎన్నికల అధికారికి కాంగ్రెస్‌ పార్టీ ఫిర్యాదు చేసింది. పార్టీ ఫిరాయించిన ఏడుగురు ఎమ్మెల్యేల ఓట్లను పరిగణనలోకి తీసుకోవద్దని విజ్ఞప్తి చేసింది. అంతేకాక ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా కాంగ్రెస్‌ నేతలు ఫిర్యాదు చేశారు.

విప్‌ ధిక్కరించడం దారుణం
ముఖ్యమంత్రి కేసీఆర్‌ నీచరాజకీయాలు చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు విప్‌ను ధిక్కరించడం దారుణమని తెలిపారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. విప్‌ దిక్కరించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్‌ చేశారు. స్పీకర్‌ పదవి గౌరవాన్ని టీఆర్‌ఎస్‌ నేతలు దిగజార్చొద్దని సూచించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. 63 మంది ఎమ్మెల్యేలున్న టీఆర్‌ఎస్‌ ముగ్గురుని పోటీలో ఎలా పెట్టిందని ఆయన ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement