బాబు నోట భలే మాట!

Chandrababu Naidu New Promises IS AC Concept For Andhra Pradesh People - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఓ తెలుగు సూపర్‌ డూపర్‌ హిట్‌ సినిమాలో ‘హైదరాబాద్‌కు సముద్రం తీసుకొస్తా’అంటూ ఎన్నికల ప్రచారంలో భాగంగా అర్థంపర్థంలేని హామీలు ఇచ్చి ఆ నాయకుడు గెలవడం చూశాం. సముద్రాన్ని హైదరాబాద్‌కు తీసుకరావడమేంటి అని బాగా నవ్వుకున్నాం. ఇప్పుడు అంతకుమించిన మాటలతో దేశంలోనే అత్యంత సీనియర్‌ నాయకుడు అని చెప్పుకునే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజల ముందుకు వస్తున్నారు. గతంలో సముద్రాన్ని కంట్రోల్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పి అందరినీ షాక్‌కు గురి చేసిన చంద్రబాబు.. తాజాగా ఇచ్చిన హామీతో అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు.

గురువారం గుంటూరులో చంద్రబాబు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన చేసిన ప్రసంగంతో సభకు వచ్చిన వారి దిమ్మతిరిగి మైండ్‌ బ్లాక్‌ అయింది. రాజధానిలో ఇంటింటికి గ్యాస్, కరెంటుతో పాటు ఏసీ కూడా సరఫరా చేస్తామని చంద్రబాబు చెప్పిన మాటలు అక్కడి సభికులను విస్మయపరిచింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ‘ఇంటింటికి ఏసీ ఏంది బాబు’.. ‘ఇంకా ఎన్ని మోసాలు చేస్తావు బాబూ’ అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

లోక్‌సభ, ఏపీ శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబు నుంచి సంభ్రమాశ్చర్యాలకు గురయ్యే మాటలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక తెలంగాణ ఎన్నికల సమయంలోనూ ప్రపంచ పటంలో హైదరాబాద్‌ను చేర్చింది, ఆధునిక తెలంగాణ సృష్టికర్తను తానేనని చెప్పుకుని నవ్వుల పాలైన విషయం తెలిసిందే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top