రైతుల సంక్షేమానికి పెద్దపీట | Sakshi
Sakshi News home page

రైతుల సంక్షేమానికి పెద్దపీట

Published Sat, May 5 2018 1:19 AM

BJP announces declaration, big promises made by farmers and students - Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటక విధానసభ ఎన్నికల పోలింగ్‌ సమీపిస్తున్న తరుణంలో అక్కడి రైతులు, విద్యార్థులు, పేద మహిళలపై బీజేపీ హామీల వర్షం కురిపించింది. జాతీయ, సహకార బ్యాంకుల్లో లక్ష వరకు పంట రుణమాఫీ, సాగు నీటి ప్రాజెక్టులకు లక్షల కోట్ల వ్యయం, విద్యార్థులకు ఫ్రీ ల్యాప్‌టాప్‌లు, పేద మహిళలకు ఉచిత స్మార్ట్‌ఫోన్లు వంటి హామీలతో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది.

రూ. 5 వేల కోట్లతో ‘రైతు బంధు మార్కెట్‌ మధ్యంతర నిధి’ని ఏర్పాటు చేసి పంట ధరల్లో వ్యత్యాసాలు వచ్చినప్పుడు ఆ ప్రభావం రైతులపై పడకుండా చూస్తామని మేనిఫెస్టో విడుదల సందర్భంగా బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప చెప్పారు. వ్యవసాయంలో అత్యుత్తమ పద్ధతులను అధ్యయనం చేసేందుకు రైతులను ఇజ్రాయెల్, చైనా వంటి దేశాలకు పంపిస్తామన్నారు. వ్యవసాయ బోర్లకు 10 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తామని హామీ ఇచ్చారు.

బీజేపీ మేనిఫెస్టోలోని ఇతర హామీలు
► దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న (బీపీఎల్‌) కుటుంబాలకు చెందిన యువతుల పెళ్లి సమయంలో ప్రభుత్వ కానుకగా ‘వివాహ మంగళ’ పథకం కింద రూ.25 వేల నగదు, 3 గ్రాముల బంగారం.
► బీపీఎల్‌ కుటుంబాల్లోని మహిళల కోసం ‘స్త్రీ సువిధ’ పథకం కింద ఒక్క రూపాయికే శానిటరీ న్యాప్‌కిన్‌
► పేదలకు అందుబాటు ధరల్లో ఆహారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 300 ‘ముఖ్య మంత్రి అన్నపూర్ణ క్యాంటీన్ల’ ఏర్పాటు
► లోకాయుక్తను కాంగ్రెస్‌ అవినీతి నిరోధక విభాగంలో ఉపవిభాగం చేయగా, దానికి మళ్లీ పూర్వస్థితి కల్పిస్తామని హామీ.
► అవినీతిపై ప్రజలు ఫిర్యాదులు చేసేందుకు సీఎం కార్యాలయంలోనే  హెల్ప్‌లైన్‌.
► అవినీతిని బయటపెట్టే సామాజిక కార్యక ర్తలకు రక్షణ కల్పించేలా కొత్త చట్టం.
► కళాశాలల్లో చేరే ప్రతి విద్యార్థికీ ‘ముఖ్యమంత్రి ల్యాప్‌టాప్‌ యోజనే’ కింద ఉచిత ల్యాప్‌టాప్‌.
► ‘ముఖ్యమంత్రి స్మార్ట్‌ఫోన్‌ యోజనే’ కింద పేద మహిళలకు ఉచిత స్మార్ట్‌ఫోన్‌.
► ఉద్యాన నగరి బెంగళూరును చెత్త రహిత నగరంగా మారుస్తామని హామీ.
► ఆవుల సంరక్షణ కోసం గతంలో బీజేపీ తీసుకురాగా కాంగ్రెస్‌ రద్దు చేసిన ‘గౌ సేవా ఆయోగ్‌’ పునరుద్ధరణ.

Advertisement
Advertisement