అందుకే పవన్ను కలిసిరమ్మంటున్నా: చంద్రబాబు
సాక్షి, అమరావతి : గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతు పలికిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ను ఉద్దేశించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమతో పొత్తు కోసం కలిసి రావాలంటూ మరోసారి పవన్ను చంద్రబాబు కోరారు. రాష్ట్రం కోసమే పవన్ కల్యాణ్ను కలిసి రావాలని కోరుతున్నానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి రూ. 70వేల కోట్లు ఇవ్వాలని పవన్ కల్యాణ్ గతంలో కేంద్రాన్ని కోరారని గుర్తు చేశారు.
ఎన్డీయే కూటమి నుంచి తాను వెళ్లిపోలేదని, బీజేపీయే తనను మోసం చేసిందని ఆయన కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. విభజన చట్టంలో చాలా హామీలు ఇచ్చారు, కానీ వాటిని బీజేపీ అమలు చేయకుండా మోసం చేసిందని చెప్పారు. 11 జాతీయ సంస్థలను రాష్ట్రానికి ముష్టివేసినట్టు వేశారని, అమరావతికి రూ. 1500 కోట్లు ముష్టివేశారని చెప్పుకొచ్చారు. ఏమన్నా అంటే యూసీలు (యుటిలైజేషన్ సర్టిఫికెట్లు) ఇవ్వలేదని కేంద్రం అంటోందని చంద్రబాబు నిష్టూరమాడారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఉదారంగా వ్యవహరించి, విభజన చట్టంలో చాలా హామీలు ఇచ్చిందని ఆయన పేర్కొనడం కొసమెరుపు. ఇటీవల కాంగ్రెస్ పార్టీతో జతకలిసి మహాకూటమి పేరిట తెలంగాణ ఎన్నికల్లో పోటీచేసిన చంద్రబాబు అక్కడ చిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే.