స్థాయి తెలుసుకుని లోకేశ్‌ మాట్లాడాలి  | Anilkumar Yadav And Ambati Rambabu Fires On Nara Lokesh | Sakshi
Sakshi News home page

స్థాయి తెలుసుకుని లోకేశ్‌ మాట్లాడాలి 

Jun 16 2020 4:02 AM | Updated on Jun 16 2020 5:11 AM

Anilkumar Yadav And Ambati Rambabu Fires On Nara Lokesh - Sakshi

ఎమ్మెల్యే అంబటి, మంత్రి అనిల్‌కుమార్‌

సాక్షి, అమరావతి: తన స్థాయి ఏమిటో తెలుసుకొని దానికి తగ్గట్టుగా లోకేశ్‌ మాట్లాడటం నేర్చుకోవాలని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అవినీతికి తావులేకుండా పరిపాలన అందిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు పాలనలో ప్రతీ స్కీమును.. స్కాముగా మార్చేశారని విమర్శించారు. ఆనాడే తాము చంద్రబాబు అవినీతిపై ‘ఎంపరర్‌ ఆఫ్‌ కరప్షన్‌’ పుస్తకం వేశామని, అవినీతి ఇప్పుడు బయటపడుతుంటే చంద్రబాబు, లోకేశ్‌ వెన్నులో వణుకు పుడుతోందని అన్నారు. సోమవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వారిరువురు విడివిడిగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్‌కుమార్, అంబటి ఏమన్నారంటే..  

► కార్మికుల సొమ్మును పందికొక్కులా తిన్న అచ్చెన్నాయుడిని ప్రభుత్వం అరెస్టు చేసింది. చట్టాలు అందరికీ సమానమే. బీసీలకు, అగ్రవర్ణాలకు విడిగా చట్టాలు ఉంటాయా?. అవినీతిపై ఆధారాలతోనే అరెస్టులు 
జరుగుతున్నాయి. 
► రూ.150 కోట్ల స్కామ్‌ చేసిన వ్యక్తికి చంద్రబాబు మద్దతు తెలపడం సిగ్గుచేటు. అచ్చెన్నాయుడికి సంబంధం లేదు, ముఖ్యమంత్రిగా నేను చెబితేనే స్కాం చేశారని చంద్రబాబు ఒప్పుకోగలరా?. 
► నకిలీ పత్రాలతో బస్సులు నడిపి ఎంతోమంది ప్రాణాలను బలిగొన్న జేసీ ప్రభాకర్‌రెడ్డికి అండగా నిలుస్తారా? ఇదేనా ప్రతిపక్ష నేత చేయాల్సిన పని. 
► అవినీతిపరుల జాబితా ఇంకా ఉంది. తప్పు చేసిన వారెవరినీ వదిలిపెట్టబోం.  
► తాడిపత్రిలో లోకేశ్‌ మాటలు హాస్యాస్పదం. వడ్డీతో సహా చెల్లిస్తామంటూ లోకేశ్‌ బీరాలు పలకడమేంటి. వడ్డీతో సహా చెల్లించడానికి ఇదేమన్నా హెరిటేజ్‌ సంస్థా.  
► టీడీపీకి మళ్లీ అవకాశమొస్తుందనే భ్రమల్లో లోకేశ్‌ ఉన్నారు. రాజారెడ్డి మీసంలో వెంట్రుకకు కూడా లోకేశ్, చంద్రబాబు సరిపోరు. 

Advertisement
 
Advertisement
Advertisement