కరోనా నిరోధక శక్తికి ‘నిద్ర’ ముఖ్యం | Sleep is a Vital Weapon to Beat Coronavirus | Sakshi
Sakshi News home page

కరోనా నిరోధక శక్తికి ‘నిద్ర’ ముఖ్యం

May 5 2020 2:47 PM | Updated on May 5 2020 6:50 PM

Sleep is a Vital Weapon to Beat Coronavirus - Sakshi

ఎన్నితిన్నా వేళకు సరైన నిద్ర లేకపోతే రోగ నిరోధక శక్తి శక్తివంతంగా పని చేయదట.

న్యూఢిల్లీ : ప్రాణాంతకమైన కరోనా వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు వ్యాక్సిన్‌గానీ, పడితే ప్రాణాలను కాపాడేందుకు తగిన మందులుగానీ ఇంతవరకు అందుబాటులో లేవు. కనుక పడకుండా ఉండేందుకు పరిశుభ్రత ఎలా ఏకైక మార్గమో, పడితే మన శరీరంలోని రోగ నిరోధక శక్తియే మనల్ని కాపాడాలి. మనలో రోగ నిరోధక శక్తి పెరగాలంటే అన్ని విటమిన్‌లకు సంబంధించిన పండ్లు, కూరగాయలు తినాలని మన వైద్యులు చెబుతూ వస్తున్నారు. కానీ ఎన్నితిన్నా వేళకు సరైన నిద్ర లేకపోతే రోగ నిరోధక శక్తి శక్తివంతంగా పని చేయదట.

ఈ విషయాన్ని అమెరికాలోని జాతీయ ఆరోగ్య సంస్థ ఇటీవల ఓ అంతర్జాతీయ సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ చెప్పింది. మన శరీరమంతా బయటి నుంచి దాడిచేసే మైక్రోబ్స్‌ను ఎదుర్కొనేలా నిర్మాణమై ఉంది. అణువులతో కూడా మన శరీరంపైనుండే చర్మం భిగించినట్లుగా ఉండి శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్‌ లాంటి మైక్రోబ్స్‌ను చొరపడకుండా అడ్డుకుంటుంది. అందుకు అనువుగా చర్మం వెలుపలి పొరలో ‘డెడ్‌ సెల్స్‌’ ఉంటాయి. కనుక కళ్లు, ముక్కు, నోరు ద్వారా మైక్రోబ్స్‌ శరీరంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తాయి. కళ్లలో ఓ దశ వరకు యాంటీసెప్టిక్‌ కన్నీళ్లు మైక్రోబ్స్‌ను అడ్డుకుంటాయి. ముక్కు, కాలేయంలో ఏర్పడే శ్లేష్మం కూడా వాటికి ఓ దశ వరకు అడ్డుకుంటాయి. కాలేయంలో తయారయ్యే శ్లేష్మం ముక్కు ద్వారా తుమ్ముల రూపంలో బయటకు వేగంగా వస్తుంది. శ్లేష్మం తుంపర్ల ద్వారా మైక్రోబ్స్‌ మన శరీరం నుంచి బయటకు వస్తాయి. ఈ ప్రక్రియను కూడా తట్టుకొని కొన్ని వైరస్‌లు మన శరీర జన్యువుల్లోకి ప్రవేశిస్తాయి. వాటిని మన రక్తంలోని యాంటీ బాడీస్‌ (రోగ నిరోధక శక్తి) గుర్తించి చంపేస్తాయి.

మొట్టమొదటగా ‘బి–లింపోసైట్స్‌’గా పిలిచే కొన్ని తెల్ల రక్త కణాల గుంపు మైక్రోబ్స్‌ను ఎదుర్కొనేందుకు యాంటీ బాడీస్‌ సృష్టికి సంకేతాలు పంపిస్తాయి. అప్పుడు టీ–సెల్స్‌గా పిలిచే రక్తంలోకి  మరికొన్ని తెల్ల రక్తకణాలు వైరస్‌ మీద దాడి చేస్తాయి. రసాయనిక సంకేతాలు పంపడం ద్వారా ఇవి మైక్రోబ్స్‌ను నాశనం చే స్తాయి. మైక్రోబ్స్‌ను ఎదుర్కోవడంలో భాగంగా అభివృద్ధి చెందిన యాంటీ బాడీస్‌ రక్తంలోని ప్లాస్మాలో కొన్ని సంవత్సరాలపాటు మనుగడ సాగిస్తాయి. యాంటీ బాడీస్‌ వల్ల నాశనం కాకుండా బతికే మైక్రోబ్స్‌ వల్లనే అంటురోగాలు వస్తాయి. (ఈ ఏడాది చివరికల్లా టీకా!)

చర్మం దగ్గరి నుంచి రక్తంలోని యాంటీ బాడీస్‌ వరకు అన్ని రోగ లేదా మైక్రోబ్స్‌ నిరోధక వ్యవస్థలు సక్రమంగా పని చేయాలంటే జీవ గడియారం (బయాలోజికల్‌ క్లాక్‌) సరిగ్గా పని చేయాలని, అందులో నిద్ర అతి ముఖ్యమైనదని అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ నిపుణులు తెలియజేశారు. ఏ వేళకు తినాలి, ఏ వేళకు నిద్రపోవాలి, ఏ వేళకు నిద్ర లేవలనే ప్రక్రియలను నిర్దేశించేదే జీవ గడియారం. ఈ జీవ గడియారం సక్రమంగా నడవాలన్నదే నిద్రనే ముఖ్యం. (చైనా కంటే ముందే ఆ దేశంలో కరోనా వైరస్‌!?)

Advertisement
 
Advertisement
Advertisement