ఎన్నారై భర్తలకు కేంద్రం షాక్‌

Passports Of 8 NRI Husbands Who Abandoned Their Wives And Absconded Have Been Cancelled - Sakshi

ఎనిమిది మంది పాస్‌పోర్టులు రద్దు

సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నారై పెళ్లిళ్ల వ్యవహారంలో వరకట్న వేధింపులు, మహిళల హత్యోదంతాలు తరచూ చోటుచేసుకుంటున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నారైతో పెళ్లి జరిగిన 48 గంటల్లో తప్పక రిజిస్టర్‌ చేయించాలనే నిబంధన తీసుకొచ్చింది. లేని పక్షంలో వారి వీసా, పాస్‌పోర్టు జారీని నిలిపేస్తామని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి మేనకా గాంధీ గతంలోనే స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆ దిశగా చర్యలు చేపట్టారు. భార్యలను వదిలేసి తప్పించుకు తిరుగుతున్న ఎనిమిది మంది ఎన్నారై భర్తల పాస్‌పోర్టులను రద్దు చేసినట్టు మహిళా శిశు సంక్షేమ శాఖ  అధికారి తెలిపారు.

ఇప్పటి వరకు 70 ఫిర్యాదులు..
ఎన్నారై మోసాలను అరికట్టేందుకు నియమించిన కమిటీకి ఇప్పటి వరకు 70 ఫిర్యాదులు అందినట్టు సదరు అధికారి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎనిమిది మంది పాస్‌పోర్టులను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఈమేరకు సదరు వ్యక్తులకు నోటీసులు కూడా జారీ చేసినట్లు వెల్లడించారు.

ఆస్తులు కూడా జప్తు చేసే అవకాశం..!
ఎన్నారై పెళ్లిళ్ల వ్యవహారంలో జరుగుతున్న మోసాలను అరికట్టే దిశగా కేంద్ర మహిళా సంక్షేమ శాఖ, విదేశాంగ శాఖ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఏడు రోజుల్లోగా పెళ్లి ధ్రువీకరణ పత్రం అందజేయకపోతే సదరు జంటకు వీసా, పాస్‌పోర్టు జారీ చేసేందుకు నిరాకరిస్తామని సంబంధిత శాఖ పేర్కొంది. అదే విధంగా ఎస్క్రో (వివాహం తర్వాత భార్యను తీసుకెళ్తానని మూడో వ్యక్తి సమక్షంలో పత్రము రాసుకుని ఆ తర్వాత అది చెల్లదని తప్పించుకోవడం) కేసుల్లో భార్యను వదిలేసి పారిపోయే ఎన్నారైల ఆస్తులను జప్తు చేసుకోవడంతోపాటు.. ఇలాంటి వివాహాల్లోని పలు సమస్యలను పరిష్కరించడంపైనా మంత్రివర్గ బృందం చర్చించింది. ఇందుకు నేర శిక్ష్మాస్మృతి నిబంధనలు, వివాహ చట్టం, పాస్‌పోర్ట్‌ చట్టాల్లో సవరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని నిర్ణయించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top