కశ్మీర్‌లో పాక్ దురాగతం | Pak atrocity in Kashmir | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌లో పాక్ దురాగతం

Nov 23 2016 12:48 AM | Updated on Sep 4 2017 8:49 PM

కశ్మీర్‌లో పాక్ దురాగతం

కశ్మీర్‌లో పాక్ దురాగతం

జమ్మూ కశ్మీర్ సరిహద్దులో పాకిస్తాన్ ముష్కరులు మరోసారి దురాగతానికి పాల్పడ్డారు.

- దాడిలో ముగ్గురు భారత జవాన్ల బలి
- ఒక సైనికుడి తలను నరికిన ముష్కరులు
- భారీ ప్రతీకారం ఉంటుందన్న భారత్
 
 జమ్మూ/శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ సరిహద్దులో పాకిస్తాన్ ముష్కరులు మరోసారి దురాగతానికి పాల్పడ్డారు. మంగళవారం  వాస్తవాధీన రేఖ (ఎల్‌ఓసీ)ను దాటి   ముగ్గురు భారత సైనికులను మెరుపుదాడిలో చంపేసి, వారిలో ఒకరి తలను కిరాతకంగా నరికేశారు. గత నెలరోజుల్లో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి.  మృతులను రాజస్తాన్‌కు చెందిన ప్రభు సింగ్ (25), ఉత్తరప్రదేశ్‌కు చెందిన కుష్వాహ (31), శశాంక్ సింగ్ (25)లుగా గుర్తించారు. ప్రభు తలను నరికివేశారు. దీనికి ప్రతీకారం భారీగానే ఉంటుందని భారత్ హెచ్చరించింది. పాక్ సరిహద్దు యాక్షన్ టీం (బ్యాట్) సభ్యులు ఈ దారుణానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.

‘బ్యాట్’లో పాక్ ఆర్మీతోపాటు ఉగ్రవాదులూ ఉంటారని భావిస్తున్నారు. ‘కుప్వారా జిల్లా మచిల్ సెక్టార్‌లోని ఎల్‌ఓసీ అటవీప్రాంతంలో ఉగ్రవాదులు చొరబాటు నిరోధక బృందంలోని సైనికులపై దాడికి పాల్పడ్డారు’ అని సీనియర్ ఆర్మీ అధికారి చెప్పారు. ‘ముష్కరులు ముగ్గురు సైనికులను హతమర్చారు. ఒక సైనికుడి శరీరాన్ని ముక్కలు చేశారు. ఈ కిరాతకానికి ప్రతీకారం ఉంటుంది’ అని ఆర్మీ నార్తర్న్ కమాండ్ అధికార ప్రతినిధి ట్వీట్ చేశారు. తల నరికేసిన సైనికుడి మృతదేహంపై ఈ ఆపరేషన్‌లో పాలుపంచుకున్న పాక్ ముష్కరుల సంతకాలున్నాయని అధికారులు చెప్పారు.  దాడిని రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ తీవ్రంగా ఖండించారు. ఈ అమరవీరుల త్యాగనిరతికి వందనం అని ట్వీట్ చేశారు.

 ఇద్దరు మిలిటెంట్ల ఎన్‌కౌంటర్..
 ఉత్తర కశ్మీర్‌లోని బందిపొరా జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మిలిటెంట్లు హతమయ్యారు. హజిన్ గ్రామంలో  బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారని, దీన్ని భద్రతా సిబ్బంది దీటుగా తిప్పికొట్టారన్నారు. మృతదేహాల వద్ద నుంచి నగదుతోపాటు రెండు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రెండు  కొత్త రూ.2వేల నోట్లు  ఉన్నాయి.  

 చొరబాటు యత్నం భగ్నం..
 అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఒక పాక్ మిలిటెంట్ చొరబాటు యత్నాన్ని సైన్యం అడ్డుకుంది. కశ్మీర్‌లోని ఆర్‌ఎస్ పురా సెక్టార్‌లో సరిహద్దు బీఎస్‌ఎఫ్ బలగాలు అతడిని మట్టుబెట్టారుు. దట్టమైన మంచుకుతోడు చీకటి ఉండటంతో అతడు బీఎస్‌ఎఫ్ శిబిరం వద్దకు వచ్చేందుకు యత్నించాడు. లొంగిపోవాలని హెచ్చరించినప్పటికీ ముఖానికి మాస్క్ ధరించిన అతడు మరింత సమీపంలోకి వస్తుండటంతో బలగాలు అతడిపై కాల్పులు జరిపారుు. కాగా,  పాక్ ముష్కరులు ముగ్గురు భారత సైనికులను చంపేయడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఇస్లామాబాద్‌లోని భారత డిప్యూటీ హైకమిషనర్ జేపీ సింగ్ పాక్ విదేశాంగ కార్యాలయంలో నిరసన తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement