ఉగ్రదాడిని ఖండించిన జాతీయ నేతలు | national leaders condemned pakistan terror attack | Sakshi
Sakshi News home page

ఉగ్రదాడిని ఖండించిన జాతీయ నేతలు

Sep 19 2016 3:51 AM | Updated on Oct 2 2018 2:30 PM

యూరి సైనిక స్థావరంపై ఉగ్రదాడి ని పలువురు నేతలు తీవ్రంగా ఖండించారు.

న్యూఢిల్లీ/శ్రీనగర్: యూరి సైనిక స్థావరంపై ఉగ్రదాడి ని పలువురు నేతలు తీవ్రంగా ఖండించారు. యూరి ఘటన జాతీయ సమైక్యత, చైతన్యంపై జరిగిన క్షమించరాని దాడి అని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ పేర్కొన్నారు. తాజాదాడి వెనుక సూత్రధారుల్ని చట్టంముందు నిలబెట్టి కఠినంగా శిక్షించాలన్నారు. ఉగ్రవాదుల దాడులను తిప్పికొట్టేలా భద్రతా బలగాలు తమ వ్యూహాలకు పదును పెట్టాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సూచించారు. ఉగ్రవాదంపై భారత్ పోరు నిర్ణయాత్మక దశకు చేరిందని..సైనికుల త్యాగాలు వృథా కాకుండా మోదీ ప్రభుత్వం సరైన దిశలో ముందుకెళ్తోందని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా అన్నారు. యూరి ఉగ్రదాడిని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ ట్వీటర్‌లో ఖండించారు.

యూరిలో ఉగ్రదాడుల్ని కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, సృ్మతి ఇరానీ, జార్ఖండ్ సీఎం రఘువర్ తీవ్రంగా ఖండించారు. యూరి దాడి అనంతరం ఒక్క పంటికి మొత్తం దవడ అనే విధానమవసరమని బీజేపీ నేత రామ్ మాధవ్ సూచించారు. కశ్మీర్ సమస్యకు ఉగ్రదాడులు పరిష్కారం కాదని..ఇలాంటి దాడులతో సమస్యలు మరింత పెరుగుతాయని, భారత్‌లో పాక్ జోక్యాన్ని సహించేది లేదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. వెనెజులా పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ పాక్ తీరును తప్పుబట్టారు. దాడిలో మన సైనికుల మరణ వార్త తెలియగానే తీవ్రంగా బాధపడ్డానని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇక జమ్మూ కశ్మీర్‌లో హింసను ప్రేరేపించే లక్ష్యంతోనే ఈ ఉగ్రదాడికి పాల్పడ్డారని, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement