క‌రోనా సోకిందని యువతికి వేధింపులు, అరెస్ట్‌

Man Arrested For Calling woman corona and spitting on her in delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : క‌రోనా వైర‌స్ రోజురోజుకీ మ‌రింత విస్తరిస్తూ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ల‌క్షల‌మంది ఈ మ‌హమ్మారీ బారిన ప‌డ‌గా.. వేల మంది ప్రాణాల‌ను బ‌లితీసుకుంది. ఈ త‌రుణంలో విచిత్రమైన క‌థ‌నాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. క‌రోనాను ఆక‌తాయిలు వివిధ రకాలుగా ఉప‌యోగించుకుంటున్నారు. యువతి(25)పై ఓ యువకుడు పాన్‌ను ఉమ్మి, ఆమెను క‌రోనా వైర‌స్ అని ఎగతాళి చేశాడు. దీంతో యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ ఘ‌ట‌న ఆదివారం దేశ రాజ‌ధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని విజ‌య్‌న‌గ‌ర్‌లో నివాసం ఉంటున్న ఓ యువతి కిరాణ సామాన్లు కొన‌డానికి త‌న స్నేహితుడితో క‌లిసి బ‌య‌టికి వ‌చ్చింది. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న ఆకతాయి యువతిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. (ఢిల్లీలో ఆ డాక్టర్‌ కుటుంబానికి కరోనా)

ఆమెకు క‌రోనా వైర‌స్ సోకిందంటూ, ఆమె ద‌గ్గర‌కు ఎవ‌రూ వెళ్లవ‌ద్దంటూ అవ‌మానించాడు. అంతేగాక ఆమెపై పాన్‌ను ఉమ్మివేశారు. దీంతో బాధిత యువతి పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో పోలీసులు కేసు న‌మోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడిని గౌర‌వ్ వోహ్రగా పోలీసులు గుర్తించారు. కాగా  కోవిడ్ 19 పేరుతో ప్రజల‌ను వేధిస్తున్న వారిపై త‌గిన చ‌ర్యలు తీసుకోవాల‌ని హోం మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించిన విషయం తెలిసిందే. (రానున్న మూడు వారాలే అత్యంత కీలకం)

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top