విశ్వవ్యాప్తంగా యోగా సంబరాలు | International Yoga Day in the 191 countries | Sakshi
Sakshi News home page

విశ్వవ్యాప్తంగా యోగా సంబరాలు

Jun 21 2016 3:39 AM | Updated on Aug 20 2018 9:16 PM

విశ్వవ్యాప్తంగా యోగా సంబరాలు - Sakshi

విశ్వవ్యాప్తంగా యోగా సంబరాలు

ప్రపంచవ్యాప్తంగా నేడు ‘యోగా’ సంబరం. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 191 దేశాల్లో ఈ భారతీయ ప్రాచీన ప్రక్రియను ఘనంగా నిర్వహిస్తున్నారు.

191 దేశాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం
- చండీగఢ్‌లో ఆసనాలు వేయనున్న ప్రధాని మోదీ
- యోగాసన కాంతులతో మెరిసిపోతున్న ఐరాస ప్రధాన కార్యాలయం
- ఐరాస కార్యక్రమానికి జగ్గీ వాసుదేవ్
- ప్రత్యేక పోస్టల్ స్టాంపు విడుదల చేసిన ప్రధాని
- ఉద్యోగులకు సెలవు లేదన్న కేంద్ర ప్రభుత్వం
 
 ఛండీగఢ్ : ప్రపంచవ్యాప్తంగా నేడు ‘యోగా’ సంబరం. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 191 దేశాల్లో ఈ భారతీయ ప్రాచీన ప్రక్రియను ఘనంగా నిర్వహిస్తున్నారు. దేశంలోని చండీగ ఢ్‌లో నిర్వహిస్తున్న భారీ యోగా ఉత్సవంలో ప్రధాని మోదీ పాల్గొంటుండగా... ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీలో నిర్వహించే కార్యక్రమానికి ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్ హాజరవుతున్నారు. దేశవ్యాప్తంగా లక్ష కార్యక్రమాలు ఏర్పాటుచేయగా, ప్రముఖ నగరాల్లో నిర్వహిస్తోన్న భారీ ఉత్సవాల్లో 57 మంది కేంద్ర మంత్రులు పాల్గొంటున్నారు. చండీగఢ్‌లో నేడు నిర్వహించే యోగా డేలో 30 వేల మందితో కలసి మోదీ యోగాసనాలు వేస్తారు. ప్రధాని రాక నేపథ్యంలో చండీగఢ్‌లో 5 వేల మంది భద్రతా సిబ్బందితో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

ఉదయమే జరిగే ఈ కార్యక్రమం కోసం మోదీ చంఢీగఢ్ చేరుకున్నారు. హాజరయ్యే ప్రతి ఒక్కరి కదలికలు తెలుసుకునేందుకు రేడియో టాగ్‌లు అతికిస్తారు. నగరంలోని క్యాపిటల్ కాంప్లెక్స్‌లో నిర్వహించే ఈ కార్యక్రమ వేదికను ఫ్రెంచ్ వాస్తుశిల్పి లే కోర్‌బ్యూసియర్ రూపొం దించారు. నగరం మొత్తం 100 ప్రాంతాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో మరో 10వేల మంది పాల్గొంటారు. ప్రధాన కార్యక్రమం ఉదయం 6.30 గంటలకు మొదలవుతుంది. 7 గంటల నుంచి 45 నిముషాల పాటు యోగాసనాలు కొనసాగుతాయి. ప్రాంగణంలో భారీ ఎల్‌ఈడీ తెరలతో ఏర్పాటు చేశారు. ఉత్తమ యోగా ప్రదర్శకులకు నగదు బహుమతితో సన్మానిస్తారు.   ఔత్సాహకులు తమ యోగాసనాల వీడియోల్ని facebook.com/iydchd2016 కు, ట్విటర్‌లో  #IYDCHD2016 ఖాతాకు పంపవచ్చు. వీరి కోసం ప్రాంగణంలో సెల్ఫీ జోన్ ఏర్పాటు చేశారు. కాగా చండీగఢ్‌లో మంగళవారం వర్షం పడే అవకాశముందని స్థానిక వాతావరణ శాఖ వెల్లడించింది.

 యోగా కాంతుల్లో ఐరాస కార్యాలయం
 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయాన్ని మిరుమిట్లు గొలిపే యోగాసనాల చిత్రాలతో అలంకరించారు. ఐరాసలో నేడు జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్ పాల్గొంటున్నారు. జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు మోర్గెన్స్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ బ్రిటిష్ సింగర్ టాన్యా వెల్స్ యోగాపై సంస్కృత శ్లోకాల్ని ఆలపిస్తారు.

 ప్రత్యేక పోస్టల్ స్టాంపు విడుదల
 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ప్రధాని మోదీ సూర్య నమస్కారాలతో కూడిన ప్రత్యేక పోస్టల్ స్టాంపును విడుదల చేశారు.  

 ఉద్యోగులకు సెలవు లేదు: కేంద్రం
 అంతర్జాతీయ యోగా  డే రోజున ఉద్యోగులకు సెలవు లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వారు స్వచ్ఛందంగా పాల్గొనవచ్చని తెలిపింది.  యోగాకు తప్పకుండా హాజరుకావాలనే నిబంధన ఏదీ పెట్టలేదని వెల్లడించింది. నేడు యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ  తెలిపింది.

 హంగరీ ‘గంగా-డాన్యూబ్’ ఉత్సవంలో యోగా సంబరాలు
 హంగరీలోని తొమ్మిది నగరాలు గంగా- డాన్యూబ్ ఉత్సవం, అంతర్జాతీయ యోగా దినోత్సవంతో మార్మోగుతున్నాయి. జూన్ 17 నుంచి 19 వరకూ గంగా- డాన్యూబ్ ఉత్సవాలు నిర్వహించగా పలు చారిత్రక ప్రదేశాల్లో యోగా ప్రాశస్త్యాన్ని తెలిపేలా చిత్రాల్ని ఏర్పాటు చేశారు. నేడు జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కూడా ఘనంగా నిర్వహించనున్నారు.
 
 విశ్వవిద్యాలయాల్లో యోగా కోర్సులపై కసరత్తు
 సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని విశ్వవిద్యాలయాల్లో యోగాను ప్రవేశపెట్టేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. యోగా డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్ని నిర్వహించాలంటూ యూజీసీని ఆదేశించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్ణయించింది. దేశంలోని ఆరు కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో కూడా పూర్తి స్ధాయి యోగా విభాగాలను ప్రారంభించే అంశాన్ని ఇప్పటికే యూజీసీ పరిశీలిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement