
'అణు' వివరాలు పంచుకున్న భారత్, పాక్
భారత్, పాకిస్థాన్లు గతంలో చేసుకున్న ఒప్పందాన్ని మరోసారి కొనసాగించేందుకు సిద్ధమయ్యాయి. గతంలో మాదిరిగానే ఇరు దేశాల్లో ఉన్న అణుస్థావరాల వివరాలను ఇచ్చిపుచ్చుకున్నాయి.
న్యూఢిల్లీ: భారత్, పాకిస్థాన్లు గతంలో చేసుకున్న ఒప్పందాన్ని మరోసారి కొనసాగించేందుకు సిద్ధమయ్యాయి. గతంలో మాదిరిగానే ఇరు దేశాల్లో ఉన్న అణుస్థావరాల వివరాలను ఇచ్చిపుచ్చుకున్నాయి. ఆదివారం దీనికి సంబంధించిన హామీ పత్రాలను ఇరు దేశాలు మార్చుకున్నాయి. ఇలా రెండు దేశాల మధ్య ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమం జరగడం ఇది 26వసారి. తొలిసారి 1992 జనవరి 1న ఈ ఒప్పందం ప్రారంభమై గత ఏళ్లుగా కొనసాగుతూ వస్తోంది.
ఈ ఒప్పందం ప్రకారం ఇరు దేశాల్లో ఉన్న అణు సౌకర్యం ఉన్న స్థావరాలపైగానీ, అణ్వాయుధాలపైగానీ దాడి చేయరాదు. దీనికి సంబంధించి తొలి అడుగు 1988లో పడింది. అదే ఏడాది డిసెంబర్ 31ని ఇరుదేశాల మధ్య సంతకాలు జరిగాయి. అయితే జనవరి 27, 1991న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా తొలి ఏడాది ఒప్పంద పత్రాల మార్పిడి 1992, జనవరి 1న జరిగింది. అప్పటి నుంచి ప్రతి జనవరి 1న ఇందుకు సంబంధించిన వివరాలతో కూడిన పత్రాలు మార్చుకుంటుంటారు.