చిన్నారుల కోసం ప్రాణాలు సైతం లెక్క చేయక...

How Driver Saved The Children In School Bus Attack In Jammu and Kashmir - Sakshi

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లో అల్లరి మూకలు మానవత్వాన్ని మరిచి ఎంతగా రెచ్చిపోతున్నాయో బుధవారం చిన్నారుల స్కూలు వ్యాన్‌ మీద జరిపిన రాళ్లదాడి చూస్తేనే అర్థం అవుతుంది. ఈ దాడిలో ఇద్దరు చిన్నారులు గాయపడగా అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. అయితే అల్లరిమూకలు దాడి చేసిన సమయంలో ఎటువంటి ప్రాణహాని జరగకూడదనే ఉద్దేశంతో బస్సు డ్రైవరు తన ప్రాణాలొడ్డి తీవ్రంగా శ్రమించాడు. ఈ సంఘటనకు ప్రత్యక్ష సాక్షి బస్సు డ్రైవరు.

ఈ సంఘటన గురించి అతడు చెబుతూ.. ‘అల్లరిమూక బస్సుపై రాళ్ల దాడి ప్రారంభించగానే నేను బస్సు వేగాన్ని పెంచాను. ఒక్క చిన్నారికి కూడా హాని కలగకూడదని నా శాయశక్తుల శ్రమించాను. కానీ ఒక దురదృష్టవశాత్తు ఒక చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి’ అని తెలిపాడు. బుధవారం షోపియాన్ జిల్లా, కానిపొర గ్రామంలో రెయిన్‌బో ఇంటర్నేషనల్ స్కూల్‌ బస్సుపై అల‍్లరి మూకలు దాడి చేసిన సంగతి విధితమే. ఈ దాడిలో ఇద్దరు విద్యార్థులకు గాయలయ్యాయి. గాయపడిన ఇద్దరిలో రెండో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి పరిస్థితి విషమంగా ఉందని, మరో విద్యార్థికి పెద్దగా ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పారు.

ఈ ఘటన గురించి ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ స్పందించారు. ‘పసిపిల్లలపై ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని, బాధితులకు న్యాయం చేస్తామని’ హామీ ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత ఒమర్‌ అబ్దుల్లా ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ, పిరికిపంద చర్యగా వర్ణించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top