
సాక్షి, బెంగళూరు: గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతిచ్చిన ఆ రాష్ట్ర దళిత నేత జిగ్నేశ్ మేవానీ త్వరలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయనున్నారు. రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్న దళితుల ఓట్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ జిగ్నేశ్ను రంగంలోకి దింపనుంది. గుజరాత్ ఎన్నికల్లో ప్రచారం చేసిన జిగ్నేశ్ బలమైన దళిత నేతగా ఎదిగారు. తొలి ప్రయత్నంలోనే ఆయన వడగావ్ నియోజకవర్గం నుంచి గెలిచారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలో ఆయనను ప్రచారానికి తీసుకురావాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఇందుకు ఆయన అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఫిబ్రవరిలో ఆయన సీఎం సిద్ధరామయ్యతో కలిసి ప్రచారంలో పాల్గొననున్నారు.